ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!

posted on: Aug 4, 2026 3:08PM

 

ఆగస్టు 15లోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సిట్‌ సన్నాహాలు..!

 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దర్యాప్తును దాదాపు తుది దశకు తీసుకెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చార్జ్‌షీట్‌ దాఖలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 15లోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 600 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసిన సిట్‌, వాటన్నింటినీ క్రోడీకరించి భారీ చార్జ్‌షీట్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈకేసులో రాజకీయ నాయకుల పాత్రకు సంబంధించి సిట్‌ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చాలా? వద్దా? అనే అంశంపై అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటు న్నట్లు సమాచారం. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్‌ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసే అంశంపైనా సిట్‌ దృష్టి సారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ అవసరమా? ఏ అంశాలపై నమోదు చేయాలి? అనే దానిపై దర్యాప్తు అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును కీలక సూత్రధారి గా సిట్‌ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని బృందం రాజకీయ ప్రము ఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు సంబం ధించిన ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. 

గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలకు ముందు కూడా పెద్ద ఎత్తున ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్‌ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చింది. కేసులో ఇప్పటి వరకు సుమారు 600 మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లు, సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని చార్జ్‌షీట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రతి అంశాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచి, నిందితుల పాత్రను ఆధారాలతో సహా వివరించేందుకు సిట్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో తొలిసారిగా టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ కింద కూడా అభియోగాలను చేర్చి చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సిట్‌ సిద్ధమవుతున్నారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన అంశాలను పరిశీలించిన అధికారులు, సంబంధిత చట్టపరమైన సెక్షన్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా 600 మందికి పైగా స్టేట్‌మెంట్లు, సాంకేతిక ఆధారాలు, ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాలు, నిందితుల పాత్రపై సేకరించిన సమాచారంతో భారీ చార్జ్‌షీట్‌కు సిట్‌ తుదిరూపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల పేర్ల చేర్పు, ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్‌ నమోదు, వర్తించే చట్టపరమైన సెక్షన్లపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది.

Phone tapping case, Sit, Chargesheet, Telegraph Act, CM Revanth reddy,  KCR, KTR ,BRS Party,  SIT

google-ad-img
    Related Sigment News
    • Loading...