మచిలీపట్నం నుంచి రాజమండ్రి జైలుకు పట్టాభి తరలింపు.. బెయిల్ వచ్చేనా? కస్టడీ కోరేనా?
posted on Oct 22, 2021 11:39AM
ఏపీలో ఇంకెవరూ బూతులు మాట్లాడనట్టు.. రాష్ట్రంలో బూతులను నిషేధించినట్టు.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఒక్కరే బూతు మాట్లాడినట్టు.. జగన్ కేబినెట్లో మంత్రులకు అసలు బూతులే రానట్టు.. ఒక్క పట్టాభిపైనే కేసులు పెట్టి.. రాత్రి వేళ ఆయన ఇంటిపై దాడి చేసి.. ఇంటి తలుపులు పగలగొట్టి.. అరెస్ట్ చేసి కక్ష్య సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాభిని సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడులకు తెగబడ్డాయి వైసీపీ మూకలు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నారు. ఇలా, పట్టాభి ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతూ రాజకీయంగా ఉద్రిక్తత రాజేస్తోంది.
సీఎం జగన్ను బోసిడీకే అని తిట్టారంటూ నమోదైన కేసులో పట్టాభిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. గురువారం పట్టాభిరామ్ను మచిలీపట్నం జైలుకు తరలించారు పోలీసులు. కొవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. శుక్రవారం పట్టాభిని పోలీస్ బందోబస్తుతో మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇక, పట్టాభికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు, పోలీసులు సైతం పట్టాభిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. మరి, పట్టాభికి బెయిల్ వస్తుందా? పోలీస్ కస్టడీ వస్తుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.