ఇస్లామీకరణను పక్కన పెట్టి లాహోర్ లో హిందూ దేవుళ్ల పేర్లు.. పాక్ వ్యూహం ఏంటి?

posted on: May 20, 2026 12:42PM

పాకిస్తాన్‌లోని చారిత్రాత్మక నగరమైన లాహోర్  పాత సాంస్కృతిక మూలాలను మళ్లీ వెలికితీస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఇస్లామీకరణ ధోరణిని పక్కనపెట్టి.. దేశ విభజనకు ముందు ఉన్న చారిత్రక హిందూ, సిక్కు, జైన్ గుర్తింపులను పాకిస్థాన్  ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగానే లాహోర్ లోని  పలు ప్రాంతాలలో  వలస పాలన కాలం నాటి  అంటే బ్రిటిష్ కాలం నాటి,  దేశ విభజనకు పూర్వం ఉన్న పాత పేర్లు తిరిగి దర్శనమిస్తున్నాయి.

రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి   పాత పేర్లను ఖరారు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా  ఇస్లాంపురా ప్రాంతానికి  కృష్ణానగర్ గా,  బాబ్రీ మసీదు చౌక్ ను  జైన్ మందిర్ చౌక్ గా,  రెహమాన్ గల్లీ ని రామ్ గల్లీ గా మార్చారు.  వీటితో పాటు 'ఫాతిమా జిన్నా రోడ్డును పాత పేరైన  క్వీన్స్ రోడ్డుగా పునరుద్ధరించారు.  

ఈ మార్పుల వెనుక పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యూహం దాగి  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాము ఉగ్ర ధోరణులను వీడి, అందరినీ కలుపుకుపోయే సహనశీల, అలాగే..  బహుళ సంస్కృతుల దేశంగా మారుతున్నట్లు ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ సమాజం నుండి దౌత్య, ఆర్థిక  సహాయాన్ని సులభంగా పొందవచ్చని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  

ముఖ్యంగా ఉగ్రవాద నిధుల ఆరోపణల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వేల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్  వంటి అంతర్జాతీయ సంస్థలు మళ్లీ ఆంక్షలు విధించకుండా నివారించడానికి, తాము తీవ్రవాదానికి దూరంగా జరుగుతున్నామనే నమ్మకాన్ని కలిగించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నమే ఈ పేర్ల మార్పు అంటున్నారు పరిశీలకులు. 

ప్రస్తుతం తీవ్ర  ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్..  మనుగడ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి ) బెయిల్ అవుట్ ప్యాకేజీపైనే పూర్తిగా ఆధారపడింది. ఆర్థిక అంశాలతో పాటు,  ఆయా దేశాల రాజకీయ, సామాజిక వాతావరణాన్ని కూడా ఐఎంఎఫ్ పరిగణనలోకి తీసుకుంటుంది కనుక..  విదేశీ పెట్టుబడిదారులలో,  ఐఎంఎఫ్ ప్రతినిధులలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చారిత్రక పునరుద్ధరణ చర్యలను పాకిస్థాన్ చేపట్టిందని అంటున్నారు. 

ఈ పేర్ల మార్పు ప్రక్రియ 2025లోనే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం షరీఫ్‌ల నేతృత్వంలో ప్రారంభమైంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల ప్రాజెక్ట్ అయిన  లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్  లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా దేశ సాంస్కృతిక రాజధానిగా వెలుగొందిన లాహోర్‌కు విభజన కు ముందు నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా చారిత్రక,  వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వానికి కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవాలని పాక్ యోచిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చారిత్రక ప్రాంతాలకు వాటి పాత పేర్లను అధికారికంగా పునరుద్ధరించే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...