యుద్ధానికి ముందే పాక్ పరాజయం!
posted on May 9, 2025 4:30PM

ఇంకా అసలు యుద్ధం మొదలు కాలేదు. ఇంతవరకు జరిగింది,జ రుగుతున్నది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు చర్యలు మాత్రమే. కానీ.. ఇంతలోనే పాకిస్థాన్ పనైపోయిందనే ఏడ్పులు మొదలయ్యాయి. ఆ దేశ పార్లమెంట్ లోనే రోదనలు వినిపిస్తున్నాయి. నిజానికి.. భారత దేశం యుద్ధం ప్రకటించలేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏక కాలంలో దాడి చేసింది. వంద మందికి పైగా ఉగ్ర ముష్కర మూకలను మట్టు పెట్టింది. కానీ ఎక్కడా పొరపాటున కూడా పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేయక పోవడం మాత్రమే కాదు అసలు అటు వైపు కన్నెత్తి అయినా చూడలేదు.
అలాగే పాక్ ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు,ఇ తర ప్రభుత్వ, ప్రభుత్వేతర సదుపాయాల జోలికి వెళ్ళలేదు. నిజానికి, పాక్ భూభాగంలో కాలు అయినా పెట్టలేదు. మన భూభాగం నుంచే పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై స్కాల్ప్ క్రూజ్ క్షిపణులను,స్మార్ట్ బాబులను వేసి లక్ష్యాలను ఛేదించింది. ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ప్రజల జోలికి వెళ్ళలేదు. అయితే.. అక్కడితో ఆపరేషన్ పూర్తి కాలేదు. సినిమా అభీ బాకీ హై ..ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంటే.. ఆ దేశంలో నక్కిన చిట్టచివరి ఉగ్రవాదిని హతమార్చే వరకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుద్ధం మాట ఎత్త లేదు. అదే సమయంలో భారత్ దేశం ఉద్రిక్తతలను పెంచదని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.అయితే, అటు నుంచి పాక్ కాలుదదువ్వి కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం తగ్గేది ఉండదని భారత దేశం పాక్ కు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా స్పష్టం చేసింది.
అయితే పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్ర వాక్యమును..కనరు వినరు మూర్కొనరు అన్నట్లుగా పాకిస్థాన్ కాలు దువ్వనే దువ్వింది. చింత చచ్చినా పులుపు చావని దాయాది దేశం భారత సరిహద్దులో 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది అయితే.. భారత్ సాంకేతిక సామర్ధ్యం ముందు పాక్ ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లు మట్టి పిచ్చుకల్లా తుస్సు మన్నాయి. పాక్ మిస్సైల్స్, డోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత నావికాదళం కరాచీ పోర్టుపై దాడి చేసి ధ్వంసం చేసింది. పాక్లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దేశ ప్రజలకు ముఖం చూపుకునేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా దాడులకు పాల్పడింది.
మరో వంక భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మన త్రివిధదళాలు దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉగ్ర స్థావరాలు, సైనిక క్యాంపులే లక్ష్యంగా దాడులు చేస్తూ పాక్ యుద్దోన్మాదాన్ని ఎక్కడి క్కడ తుత్తునియలు చేస్తోంది. పాక్ కూడా ప్రతిదాడులు చేసినా.. అవి హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా నవ్వుల పాలవుతున్నాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్స్, మిసైల్స్ దీపావళి తార జువ్వల్లా ఇలా ఎగిరి ఆలా నేల కొరిగిపోతున్నాయి. మన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాక్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్స్, మిసైల్స్ను మార్గమధ్యలోనే నెలకు కూల్చేసింది. చేర్చింది. అయితే,పాకిస్థాన్ ఇంకా ప్రగాల్భాలకు పోతోంది. అసత్య ప్రచారంతో ఆత్మవంచనకు పాల్పడుతోంది. భారత్పై దాడులు చేశామని.. అందులో విజయవంతమయ్యామంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది.
ఇదలా ఉంటే.. భారత్ చేస్తోన్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా చితికి పోయింది. అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు విధ్వంసం అయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. వాటినుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థికసాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా వుందో వేరే చెప్పనక్కర లేదు.
మరో వంక పాకిస్థాన్కు అంతర్జాతీయ సంస్థల నుంచి, ముఖ్యంగా ఐఎంఎఫ్ నుంచి ఎలాంటి రుణాలు రాకుండా అడ్డుకొనేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ విధానం ఏమిటో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పాక్ పోస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నిజానికి దేశ పార్లమెంట్ లో సీనియర్ సభ్యుడు ఒకరు, భారత దేశం కాలు దువ్వి దేశాన్ని నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకున్నారు. నిజానికి రోజు రోజుకు దిగజారి పోతున్న పరిస్థితులను గమనిస్తే, అసలు యుద్ధం మొదలయ్యే సరికే పాక్ చేతులు ఎత్తేయడం ఖాయంగాకనిపిస్తోందని అంటున్నారు.