పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఏ క్షణంలోనైనా అరెస్టు?
posted on Nov 28, 2025 1:58PM

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం (నవంబర్ 28) డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిలుకు అర్హులు కారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో వారి అరెస్ట్పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. దీంతో లొంగిపోయేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
కేసు పూర్వాపరాల్లోకి వెడితే.. ఈ ఏడాది మే 24న గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్నగర్లో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్పై తిరిగి వస్తుండగా వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్ద దారుణ హత్య కు గురయ్యారు. వీరిని స్పార్కియో వాహనంతో గుద్ది హత్య చేసి ప్రమాదంగా సృష్టించడానికి ప్రయత్నించారు.
కానీ వీరిరువురూ హత్యకు గురయ్యారంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మృతుల బంధువుల ఫిర్యా దుతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చగా, ఏ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ-7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్టు భయంతో వారు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందం టున్నారు.