ప్రియుడి మోజులో భర్తను చంపి.. జేసీబీతో గుంత తవ్వి పూడ్చిన భార్య

posted on: May 24, 2026 4:27PM

 

నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పవిత్రమైన దాంపత్య బంధాన్ని మరిచి వివాహేతర సంబంధానికి బానిసైన ఓ మహిళ, చివరకు ప్రియుడితో కలిసి భర్తనే అడ్డుతొలగించుకోవడం విషాదంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారడం అందరినీ కలిచివేస్తోంది. నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్పన నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

 ఈ క్రమంలో ఆమెకు చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన ముత్యంరెడ్డి పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించినా కల్పనలో మార్పు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రియుడితో కలిసి జీవించాలనే ఆలోచనతో భర్తను అడ్డుగా భావించిన కల్పన, అతడిని హత్య చేయాలని పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. 

తొమ్మిది రోజుల క్రితం కల్పన తన ప్రియుడు చింటూతో కలిసి ముత్యంరెడ్డిని మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారుకు తీసుకెళ్లింది. అక్కడ అతడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు బయటపడకుండా మృతదేహాన్ని గుంత తవ్వి పూడ్చిపెట్టారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు భర్త కనిపించడం లేదంటూ కల్పనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. 

పోలీసుల ప్రశ్నలకు తడబడిన కల్పన చివరకు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో కల్పనతో పాటు ఆమె ప్రియుడు చింటూను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఒక కుటుంబం ఛిద్రమైపోగా, ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి.. తల్లి జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారారు. ఈ విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...