సిడ్నీలో మంత్రి లోకేశ్‌‌కు ఘన స్వాగతం

 

ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సిడ్నీ విమానశ్రయంలో ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం  లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేశ్ కు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ వారితో ఫోటోలు దిగారు.  బ్రిస్బేన్‌, కాన్‌బెర్రా, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు లోకేశ్‌ను కలిశారు. 

లోకేశ్‌ నేటి నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ‘స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రాం’లో పాల్గొనాల్సిందిగా ఆసీస్ ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్‌ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేశ్ అధ్యయనం చేయనున్నారు. 

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేశ్ సమావేశమవుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu