కేసీఆర్కు చలి జ్వరం!
posted on Mar 5, 2021 1:53PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందా.. అంటే అవును అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఆయన ధైర్యం లేదంటున్నారు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్కు చలి జ్వరమని వ్యంగ్యాస్త్రం సంధించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, మోడూ ఒకే నాణేనికి బొమ్మాబొరుసని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీఐఆర్ రాలేదని కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. కేటీఆర్కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీతో ఎందుకు జతకట్టాడో కేసీఆర్ చెప్పాలన్నారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి.. తమ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.