సానియా మిర్జాపై రాజాసింగ్ రచ్చ..
posted on Aug 5, 2021 2:50PM
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? వెంటనే సమాధానం చెప్పలేరు కొందరు. గూగుల్లో సెర్చ్ చేసి.. ఓహో, సానియా మిర్జానా అనుకుంటారు. తెలంగాణకు ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని.. అది టెన్నిస్ ప్లేయర్ సానియా అని తెలిసాక కూడా అనేక ప్రశ్నలు వస్తుంటాయి. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏం చేస్తారు? ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే విషయాలు పక్కనపెడితే.. ఇప్పుడు ఆ హోదాపై కిరికిరి స్టార్ట్ చేశారు బీజేపీ ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్. పాకిస్తాన్ కోడలు మనకెందుకు.. తెలంగాణ అమ్మాయి పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్ చేయాలని డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుని సీఎం కేసీఆర్ మరింత ప్రోత్సహించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. స్పోర్ట్స్ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పీవీ సింధు తెలంగాణ అమ్మాయి.. తెలంగాణకే కాకుండా భారతదేశానికి కూడా పేరు తెచ్చిందన్నారు. అందుకే, పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేయాలన్నారు. పాకిస్తాన్ కోడలు (సానిమా మిర్జా)ను సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడం సరికాదన్నారు.
ప్రముఖ టెన్నీస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా తొలగించాలని రాజా సింగ్ గతంలో కూడా డిమాండ్ చేశారు. హైదరాబాద్కు చెందిన సానియా మిర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు.