సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్.. ఆర్సీబీపై ఎల్ఎస్జీ విజయం

posted on: May 8, 2026 8:27AM

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో  లక్నో సూపర్ జెయింట్స్ జట్టు  విజయం సాధించింది. లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ కళ్ళు చెదిరే సెంచరీతో ఆకాశమే హద్దుగా విరుచుకుపడటంతో బెంగళూరు  చేతులెత్తేసింది.  ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న లక్నో, ఈ విజయంతో  తన ప్లేఆప్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది.  మిచెల్ మార్ష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఆర్సీబీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన మార్ష్  కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతనికి నికోలస్ పూరన్ 38 పరుగులు జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టు స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. నిర్ణీత 19 ఓవర్లలో లక్నో  3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.  వర్షం కారణంగా ఆర్సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జాకబ్ బెథెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా మిడిల్, ఆఫ్ స్టంప్‌లను గిరాటేయడంతో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 2023 ఏప్రిల్ తర్వాత ఐపీఎల్‌లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి.

9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్  61 పరుగులు, దేవదత్ పడిక్కల్ 34 పరుగులూ ఆదుకున్నారు.  ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. పడిక్కల్‌ను కూడా తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి ఔట్ చేసిన ప్రిన్స్..  ఆ తర్వాత జితేశ్ శర్మను కూడా పెవిలియన్‌కు పంపాడు. కాసేపటికే పాటిదార్ కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ పతనం మొదలైంది. చివర్లో కృనాల్ పాండ్య (28 నాటౌట్‌), రొమారియో షెపర్డ్ (23 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా, దిగ్వేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోకు విజయాన్ని అందించాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...