ప్రేమజంట  ఆత్మహత్య.. 

వాళ్ళ ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే.. చిన్నప్పటి తూనీగ తూనీగ పాట పాడుకున్నారు. చెడ్డి నుండే ఇద్దరికీ పరిచయముంది. ఆ పరిచయం గా మరి ఆ  స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ అమ్మాయి మైనర్‌ కావడంతో వాళ్ళ పెళ్ళికి పెద్దలు నో చెప్పారు. చివరికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 

కట్ చేస్తే..  అబ్బాయికి అతని కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అంతే ఆ ప్రేమికులు తమకు వేరే పెళ్లి జరిగితే ఆ ఎడబాటును భరించలేమనుకున్నారు. చావైనా బతుకైనా ఆ ఇద్దరే అనుకున్నారు చివరికి చావులోనైనా ఒక్కటవుదామనుకొన్నారు. ఆఖరికి అదే చేసి రెండు కుటుంబాల్లో విషాదం నింపారు. ఈ హృదయవిదారక ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో ఆదివారం జరిగింది. 

సీఐ పి.సైదులు కథనం ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్‌నగర్‌లో ఉండే దంపతులకు నలుగురు కుమార్తెలు. వృత్తి టైలరింగ్‌. వీరి రెండో కుమార్తె(16).. అదే బస్తీలో ఉండే విశాల్‌(21) ప్రేమించుకున్నారు. ఆ యువకుడు ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరూ తమ ప్రేమ గురించి నెల కిందట ఇంట్లో చెప్పారు. వారు అంగీకరించలేదు. విశాల్‌ స్వయంగా అమ్మాయి వాళ్ల ఇంటికెళ్లి మాట్లాడినా ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా విశాల్‌కు అతని కుటుంబ సభ్యులు జనగామలో సంబంధం చూశారు. కుటుంబమంతా కలిసి అక్కడికి వెళ్లి అమ్మాయిని చూసి వచ్చారు. మాటామంతీ పూర్తయ్యింది. కరోనా పరిస్థితులు చక్కబడగానే పెళ్లి తంతు జరిపించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి విశాల్‌, ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడకుండా దిగాలుగా ఉంటున్నారు. ఈ నెల 14న తెల్లవారుజామున 4 గంటలకు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాల్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ మేరకు సీఐ సైదులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గాజులరామారం డివిజన్‌ బాలయ్యనగర్‌ సమీపంలోని క్వారీ నీటిగుంతలో ఆదివారం రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు అక్కడికి చేరుకొని ఈ మృతదేహాలు విశాల్‌, ఆ బాలికదేనని తేల్చారు. శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.