ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడు.. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమరం హీటెక్కింది. ప్రచారంలో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ . కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..   కుల బలం, మజిల్ బలం లేకుండానే కేసీఆర్ ప్రయాణ ప్రారంభించారని చెప్పారు. తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి తెలంగాణ జెండా పట్టారన్నారు. రాష్ట్రం వచ్చేవరకు పోరాటం చేయకపోతే రాళ్లతో కొట్టండన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, ఆయన కష్టంతో తెలంగాణ వచ్చిందన్నారు కేటీఆర్. అలాంటి నేతపై ఉద్యమంలో అడ్రస్ లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని.. వాళ్లకంటే చీల్చి చెండాడే సత్తా తమకుందన్నారు కేటీఆర్. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని, సీఎంలనే హడలెత్తించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఘనచరిత్ర ఉందని వెల్లడించారు. కేసీఆర్ అంటే కొందరు లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని విపక్షాలను హెచ్చరించారు.

బీజేపీ నేతలది వాట్సప్ యూనివర్సిటీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమీ తెలియదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష? ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదు..  మన్ను లేదన్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని.. వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదన్నారు. అందరి లెక్కలు రాస్తున్నామని, మిత్తితో చెల్లిస్తామన్నారు. ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదన్నారు కేటీఆర్.