యువతి కిడ్నాప్.. సినిమాను తలపించిన యాక్షన్

సినిమాను మించిన యాక్షన్.. వంద మంది శుభకార్యం జరుగుతున్న ఇంటికి చేరుకుని.. విధ్వంసం సృష్టించి ఓ యువతిని కిడ్నాప్ చేశారు. సాధారణంగా ఇలాంటి వయలెంట్ సన్నివేశాలను సినిమాలలోనే చూస్తాం. కానీ తెలంగాణలోని ఆదిభట్ల గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తాను ప్రేమించిన యువతికి  మరోకరితో వివాహ నిశ్చితార్ధం జరుగుతోందని తెలిసిన ప్రేమికుడు వంద మంది గ్యాంగ్ తో వాహనాలలో వచ్చి.. ఆ యువతిని కిడ్నాప్ చేశాడు.

అడ్డు వచ్చిన యువతి తండ్రిని, బంధువులను తీవ్రంగా కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మిస్టర్ టీ టైమ్ యజమాని నవీన్ రెడ్డి బీడీఎస్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు. తొలుత ఇరు కుటుంబాల వారూ వారి ప్రేమకు ఆమోదం తెలిపినా.. ఆ తరువాత కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఆ యువతి  నవీన్ రెడ్డిని దూరం పెట్టింది. అతడు ఫోన్లు, మెస్సేజీలతో వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అదలా ఉంటే తాను ప్రేమించిన యువతికి  వేరే వ్యక్తితో వివాహ నిశ్చితార్ధం జరుగుతోందని తెలుసుకున్న నవీన్ రెడ్డి సినీఫక్కీలో తన గ్యాంగ్ తో ఆమె ఇంటిపై దాడి చేసిన  మరీ యువతిని కిడ్నాప్ చేశాడు.

ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల చెరనుంచి యువతిని రక్షించారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాప్ నకు గురైన యువతి నల్గొండలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ సమాచారాన్ని నల్గొండ పోలీసులకు అందజేయడంతో వారు ఆ యువతిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి పీఎస్ కు తరలించారు.

అక్కడ నుంచి ఆమె తన తండ్రికి ఫోన్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి  పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా మిగిలిన వారు పరారీలో ఉన్నారు.