ఈ బంధం అనుబంధ‌మేనా?

అన్న‌య్య స‌న్నిధి.. అదే నాకు పెన్నిధి.. అంటూ చెల్లెలు అన్న‌గారి కాళ్ల‌ మీద ప‌డి క‌న్నీళ్ల‌తో క‌డిగిన‌పుడు ప్రేక్ష‌కులు అన్న‌గారినే మెచ్చుకున్నారు. సినిమాలో చెల్లెలు నిజంగానే వీర ప్రేమ ప్ర‌క‌టించింది గ‌నుక‌.  అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ త‌రిగిపోతుందా అంటే అసాధ్య‌మంటారు పెద్ద‌వాళ్లు.. కానీ  ఇప్పుడు అవ‌స‌రార్ధం ప్రేమ‌నే ప్ర‌క‌టించారు వైసీపీ చెల్లెళ్లంతా! 

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్ట‌డానికి స్వీట్లు తినిపించ‌డానికి పార్టీ మ‌హిళా మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌ట్టారు. వారి ప్రేమ‌ను మ‌రీ సినిమాటిక్‌గానూ ప్ర‌ద‌ర్శించారు. బొట్టుపెట్టి రాఖీ క‌ట్టి స్వీట్లు తినిపిస్తుంటే జ‌గ‌న్ మాత్రం ఏమి ప్రేమ ఎంత‌టి ప్రేమ అనుకునే ఉంటారు. హోంమంత్రి తానేటి వ‌నిత‌, మ‌రో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ, వాసిరెడ్డి ప‌ద్మ.. అంతా అన్న‌గారి మీద ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో పోటీలుప‌డ్డారు.  మరో వైపు.. మహి ళలపై దాడులు జరిగితే... గన్ కంటే ముందు జగనన్న వచ్చేస్తాడంటూ గతంలో చెప్పిన మరో మంత్రి ఆర్కే రోజా మాత్రం.. జగనన్నకు రాఖీ కట్టలేదని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా తెగ ట్రోల్ చేస్తున్నారు. 

ఇంత‌లో ఎంత మార్పు అనుకునే ఉంటారు జ‌గ‌న్‌. తాను క‌ష్టాల్లో ఉన్న‌పుడు, జైల్లో ష‌టిల్ ఆడుతున్న పుడు ఈ చెల్లెళ్ల‌లో ఏ ఒక్క‌రూ క‌నీసం అటుకేసి వెళ్ల‌లేదు. వెళితే మెడకి  ఏమి చుట్టుకుంటుందోన‌ని భ‌యం! కానీ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఎక్క‌డా లేని ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి  స‌హ‌క‌రించింది ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి ష‌ర్మిల‌. కానీ వారిని  దూరం చేసుకోవ‌డం బ‌హుశా ఇప్పుడు ఇబ్బందిపెడుతుందనే విశ్లేషకుల మాట‌. ర‌క్షా బంధ‌న్ అంటే చెల్లెలు, అక్కా వ‌చ్చి రాఖీ క‌ట్ట‌డం స‌హ‌జంగా జ‌రిగేది. కానీ ష‌ర్మిల దూరంగా ఉన్నా రు. త‌ల్లి అవ‌మానంతో కూతురు వేపు వెళ్లారు. 

మరోవైపు.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి  షర్మిల.. తెలంగాణలో పంట చేలల్లో వరి నాట్లు వేస్తూ.. రైతులకు సాయం చేస్తున్న ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొనకపోవడంతోనే రాజకీయ చెల్లెళ్ల ప్రేమలోనే జగనన్న తరించాల్సి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.