జీవీ రెడ్డి విషయంలో సీబీఎన్ నిర్ణయం కరెక్టేనా?

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. జీవీ రెడ్డి సమర్పించిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఫైబర్ నెట్‌లో వివాదంపై సీఎం చంద్రబాబు దగ్గరికి నివేదిక చేరగానే... జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో పాటు... ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీఏడీకి రిపోర్ట్ చేయాలని దినేష్ కుమార్‌ను అదేశించారు. ఈ రెండు చర్యల ద్వారా పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకే ప్రాధాన్యం అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లైంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి జీవీ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీనితో ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ జీవి రెడ్డి పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఫైబర్ నెట్ లో సుమారు 410 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. వైసీపీ కార్యకర్తలకు ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించారని పలుమార్లు జీవి రెడ్డి ఆరోపించారు. ఈ దశలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కు చైర్మన్ జీవి రెడ్డికి పలు విషయాలలో విభేదాలు వచ్చాయి. దినేశ్‌కుమార్‌ది రాజద్రోహమంటూ జీవీరెడ్డి ఆరోపణలు చేశారు. రాజద్రోహం అనడంపై ప్రభుత్వానికి దినేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాంతో జీవీరెడ్డి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయాలను మీడియా ముందు జీవీరెడ్డి ప్రకటించడంపైనా వివాదం నెలకొంది. ఆల్ ఆఫ్ సడెన్ గా  కూటమి ప్రభుత్వానికి జీవి రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆ క్రమంలో యువనేత జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu