నాల్గో టెస్టులో ఘన విజయం! టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు భారత్
posted on Mar 6, 2021 3:25PM
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపును అందుకుంది కోహ్లీ సేన. నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్కు చేరగా.. తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. జూన్లో లార్డ్స్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది.
నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం సాధించింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో స్టోక్స్ 55 పరుగులు మినహా మరెవరు రాణించలేకపోయారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులు చేసింది. ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును పంత్- సుందర్ జోడి ఆదుకుంది. పంత్- సుందర్ల సెంచరీ భాగస్వామ్యం అందించగా.. సుందర్- అక్షర్ కూడా సూపర్ గా ఆడి మరో సెంచరీ భాగస్వామ్యం చేశారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 160 పరుగుల ఆధిక్యం దక్కింది.