విండీస్‌ను కుప్పకూల్చిన భారత్.. వరల్డ్ కప్ వార్మప్‌లో ఘన విజయం!

posted on: Jun 9, 2026 10:42AM

మహిళల టీ20 ప్రపంచకప్‌ సమరానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ శుభారంభం చేసింది. కార్డిఫ్‌ వేదికగా జరిగిన మొదటి అధికారిక వార్మప్ మ్యాచ్‌‌లో భారత జట్టు 26 పరుగుల తేడాతో వెస్టిండీస్‌‌ను చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఏమాత్రం తడబడకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ కరేబియన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పవర్‌‌ప్లేలోనే మైదానాన్ని హోరెత్తించారు. స్మృతి మంధాన కేవలం కొద్ది సమయంలోనే 39 పరుగులు చేయగా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ 29 పరుగులతో రాణించింది. వీరిద్దరూ కలిసి పవర్‌‌ప్లే ముగిసేసరికి స్కోరు బోర్డుపై ఏకంగా 59 పరుగులు జోడించి జట్టుకు భారీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

తొలి వికెట్ పడిన తర్వాత కూడా భారత జట్టు ఇన్నింగ్స్ జోరు తగ్గలేదు. యాస్తికా భాటియా వన్ డౌన్‌లో వచ్చి బాధ్యతాయుతంగా ఆడుతూ 36 పరుగులు సాధించి ఇన్నింగ్స్ నిలబెట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆరుగురు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం భారత ఇన్నింగ్స్‌ను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టింది. విండీస్ స్పిన్ బౌలర్ అఫీ ఫ్లెచర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీసి భారత మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత లోయర్ ఆర్డర్ బ్యాటర్ భారతీ ఫుల్మాలి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. ఆమె క్రీజులో పాతుకుపోయి కేవలం 40 బంతుల్లోనే 56 పరుగులతో అజేయ అర్ధసెంచరీ బాది జట్టుకు భారీ స్కోరు అందించింది. ఫలితంగా భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

అనంతరం 180 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు ఆరంభంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. విండీస్ ఓపెనర్ డియాండ్రా డాటిన్ సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ 49 పరుగులు చేయగా, ఆమెకు తోడుగా షెమైన్ కాంప్‌‌బెల్ 25 పరుగులతో రాణించింది. వీరిద్దరి దూకుడుతో ఒక దశలో వెస్టిండీస్ కేవలం 2 వికెట్ల నష్టానికి 81 పరుగులతో అత్యంత పటిష్టంగా కనిపించింది. మ్యాచ్ భారత్ చేతుల్లోంచి చేజారిపోతుందనుకున్న తరుణంలో భారత బౌలర్లు మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన వైవిధ్యమైన బంతులతో కరేబియన్ల పతనాన్ని శాసించింది. ఆమె అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆమెకు తోడుగా సీనియర్ బౌలర్ రాధా యాదవ్ కూడా స్పిన్ మ్యాజిక్ చేస్తూ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...