గోదావరికి 10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. కోనసీమలో వరద బీభత్సం 

ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 10.4 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.  ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,41,146 క్యూసెక్కులుగా ఉంది. అత్యవసర సహాయక చర్యల కోసం రెండు NDRF, మూడు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం, చింతూరు, విఆర్ పురం. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కెఆర్ పురంలో బృందాలు రెడీగా ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.

కోనసీమలో గోదావరి ఉప నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పిల్ల కాలువలు, ఉపనదులకు వరద పోటెత్తుతుండటం.. ఆ ప్రవాహం గోదావరిలో కలుస్తుండటంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. పి.గన్నవరం మండలం ఊడిముడి లంక నదీపాయకు అడ్డుకట్ట తెగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలోని అధికారులకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. లంక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతి కారణంగా కొబ్బరి చెట్లు నేలకొరుగుతున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి నదీ తీర ప్రాంతంలో గోదావరి వరద ఉధృతి కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. నదీ కోత కారణంగా 9 కొబ్బరి చెట్లు వరద నీటిలో పడిపోయాయి.

మరోవైపు భద్రాచలంలో గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం నీటిమట్టం భారీగా పెరగడంతో రామాలయం ఎదురుగా ఉన్న స్లూయిజ్ లీక్ కావడంతో అన్నదాన సత్రం వద్దకు గోదావరి వరద నీరు చేరింది.  రాములవారి పడమటి గుడిమెట్ల ముందు ఉన్న ఇళ్లు, బొమ్మ కొట్టలోకి గోదావరి వరద నీరు చేరింది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సత్రంలోకి, ఇళ్ల వద్దకు వచ్చిన గోదావరి వరద నీటిని మోటార్ల ద్వారా గోదావరి నదిలోకి పంపింగ్ చేస్తున్నారు అధికారులు.ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలంలో నీటిమట్టం తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.