నకిలీ అధికారి అరెస్టు.. అతడి ఇంట్లో సోదాలలో పోలీసుల చోరీ

ఐపీఎస్, ఐఏఎస్ అధికారినంటూ హల్ చల్ చేసి పలువురు బిల్డర్లను మోసం చేసి భారీగా సొమ్మలు దండుకున్న శశికాంత్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇద్దరు గన్ మెన్ లను వెంటపెట్టుకుని మరీ తాను స్పెషల్ ఆఫీసర్‌ నంటూ శశికాంత్ బిల్డర్లను బెదరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శశికాంత్‌ షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్‌మెంట్‌లో  ఉంటూ..  తాను ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారిననీ, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నాననీ, జాతీయ దర్యాప్తు సంస్థలో ఉన్నతపదవిలో ఉన్నాననీ చెప్పుటుంటూ..  పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలను నమ్మించి బెదరించి  భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.  శశికాంత్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఫిల్మ్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు అతడిని గుర్తించి   అదుపులోనికి తీసుకున్నారు.

  అతను ఉపయోగించిన నకిలీ ఐడీలు,  వసూలు చేసిన డబ్బుల లావాదేవీలను సేకరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో శశికాంత్‌ ఫ్లాట్‌లో  సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో పోలీసులు తమ చేతివాటం చూపిన వైనం బయటపడింది. సాక్షుల సమక్షంలో, వీడియోగ్రఫీ మధ్య  జరుగుతున్న ఈ సోదాల్లో  పోలీసులు చోరీలకు పాల్పడ్డారు. ఆ తరువా శశికాంత్ ప్లాట్ లో చోరీ వస్తువుల పంపకాలలో పోలీసుల మధ్య గొడవ జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి దర్యాప్తునకు ఆదేశించారు.  పోలీసులు శశికాంత్ నివాసం నుంచి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.   ఒక వైపు మోసం చేసిన నకిలీ ఐఏస్‌, ఐపీఎస్‌ అధికారి … మరోవైపు అతడి ఇంట్లోనే  చోరీ చేసిన పోలీసులు.. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu