అసెంబ్లీ ఆవరణలో లిక్కర్ సీసాలు.. సీఎం రాజీనామాకు డిమాండ్

అసెంబ్లీ అంటే అత్యంత భద్రత ఉండే ప్రాంతం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. సామాన్యులు అక్కడికి వెళ్లడం కుదరదు. అలాంటిది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఇదే దారుణం అనుకుంటే.. మరో సంచలన విషయం కూడా ఉంది. ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలవుతోంది. అంటే మద్యపాన నిషేదం ఉన్న రాష్ట్రంలో. అసెంబ్లీ ఆవరణలో ఖాళీ లిక్కర్ బాటిల్స్ దొరకడం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. 

మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. మద్యంపై రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధాన్ని ‘కంటితుడుపు’గా అభివర్ణించిన తేజస్వీయాదవ్.. నితీశ్ కుమార్ పోలీసులు మద్యం కొనే వినియోగదారులను మాత్రమే అరెస్ట్ చేస్తారని, అసలు దోషులైన లిక్కర్ మాఫియాపై కన్నెత్తి కూడా చూడరని మండిపడ్డారు. 

అసెంబ్లీలోనూ నితీశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాయి. అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు బయటపడడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ కనుక అనుమతిస్తే ముఖ్యకార్యదర్శి, డీజీపీని దర్యాప్తు కోరుతామని అన్నారు.