లక్ష డాలర్ల ఫీజు మినహాయింపు.. ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసా?
posted on Oct 22, 2025 2:48PM

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (ఇండిమర: కరెన్సీలో దాదాపు 8 కోట్ల 30 లక్షలు) ఫీజు విషయంలో స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది.
యూఎస్సీఐఎస్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి, లేదా అక్కడే పని చేస్తూ ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదు. ఇది నిస్సందేహంగా భారీ ఊరటేనని చెప్పవచ్చే. అయితే ఇందుకూ కొన్ని మినహాయింపులూ, షరతులు ఉన్నాయి. ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించి తీరాలి. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీకి ముందు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన వారికి కూడా పాత నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది.
అంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందదు. ఇప్పటికిప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే అమెరికాలో 3లక్షల 30 వేల మంది భారత విద్యార్థులు ఉన్నారు. అంటే అక్కడకు వెళ్లి చదువుకుంటున్నారు. వారిలో లక్ష మందికి పైగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో స్టెమ్ కోర్సులు చదివి మూడేళ్ల వరకూ అమెరికాలో పని చేసే అవకాశం ఉన్న విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించినట్లే. అంతే కాదు కంపెనీల యాజమాన్యాలు కూడా వీరికి హెచ్-1బీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తాయి.