రెండేళ్లలో ఉస్మా‘నయా’ ఆస్పత్రి.. సీఎంరేవంత్
posted on Oct 22, 2025 3:46PM
.webp)
ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై రేవంత్ బుధవారం (అక్టోబర్ 22) తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం అవసరాలకు తగ్గట్టుగా ఉండాలనీ, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు తగినట్లుగా గదులు, ల్యాబ్ లు ఇతర రూమ్ లు ఉండాలని సీఎం ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.
ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోసారి సమావేశమై సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అను సంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని, అలాగే ఈ నిర్మాణాలను నిరంతరం అంటే 24X7 పర్యవేక్షించేలా ఆ అధికారికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. నిర్మాణాలపై 24x7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు.