ఢిల్లీలో కాక్రోచ్ ఉద్యమం ఎందుకు తేలిపోయింది?

posted on: Jun 9, 2026 2:54PM

సోషల్ మీడియాలో ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు తేలిపోతున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రజామద్దతు లభించక నీరుగారిపోతూ సీజేపీ మనుగడనే ప్రశ్నార్ధకంతా మారుస్తున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ  అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనకు పిలుపునిచ్చింది.  మొదట్లో ఆ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సోషల్ మీడియా డేటాను విశ్లేషించిన పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటూనే, ఈ ఆందోళనకు అనుమతినిచ్చారు. నీట్ పేపర్ లీకేజీలు, సీబీఎస్‌ఈ మార్కింగ్ లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్వయంగా అమెరికా నుంచి ఢిల్లీ వచ్చి ఈ నిరసనకు నాయకత్వం వహించారు.  మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే, మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు అనే నినాదాలతో యువత హోరెత్తించారు.  పుస్తకాలు, పువ్వులు పట్టుకుని శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా అభిజీత్‌ను, సీజేపీ సభ్యులను కానీ పోలీసులు అరెస్ట్ చేస్తే 42 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడతానని సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అప్పటికే హెచ్చరించారు. 

అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా, ముఖ్యంగా జంతర్ మంతర్ , విమానాశ్రయం వద్ద 1,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం వల్ల యువతలో మరింత ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశం ఉందని భావించి.. నిర్దిష్ట షరతులతో పోలీసులు అనుమతి మంజూరు చేశారు. నిరసన ప్రశాంతంగా ముగిసేలా చూసి, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సీజేపీ ఉద్యమంపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచాయి. జంతర్ మంతర్ వద్ద సమస్యాత్మక పరిస్థితులను నివారించడానికి, గుంపును పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు.  సోషల్ మీడియా పోస్టుల ద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందేమోనని అంచనా వేసి, ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరుగురు నిరసనకారులను అదుపులోకి కూడా తీసుకున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏటంటే సీజేపీ నిరసనపై తొలుత ఆసక్తి చూపించిన మీడియా కూడా మధ్యాహ్నం తర్వాత కవరేజ్ క్రమేపీ తగ్గించేసింది. టీఆర్‌పీ లేక బ్రేకింగ్ న్యూస్‌లకు బ్రేక్ పడింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పటిష్ట చర్యలు తీసుకోవడంతో అంతా ప్రశాంతంగా ముగిసింది. ఆ క్రమంలో హింసాత్మక నిరసనలకు కాలం చెల్లిందని, సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు నిలబడటం కష్టమని తేలిపోయింది. సీజేపీ నిరసన ఒక పెద్ద రాజకీయ ప్రదర్శనగా మారాలనుకున్నా, అది నిఘా వ్యవస్థ ముందస్తు వ్యూహం వల్ల  పూర్తిగా నిర్వీర్యం అయింది. ఆధునిక సాంకేతికత, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాతో పెరిగిన మొదటి తరం    జెన్-జెడ్ పెద్దగా స్పందించకపోవడం, మీడియా ఆసక్తి తగ్గిపోవడం, భారీ నిఘా వ్యవస్థ ఉండటం.. ఇవన్నీ సీజేపీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేశాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...