ఓరి మీ ఎలివేషన్‌లో...విజ‌య్ లంచ్ బాక్స్ వెన‌క‌...ఇంత మేట‌రుందా?

posted on: May 17, 2026 3:56PM

 

విజ‌య్ ఇంటి  నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది. ఒక సీఎం అంటే ఫుడ్, హెల్త్ ఇత‌ర అలవెన్సుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంది. సాధార‌ణ  ఎమ్మెల్యేకే ఈ వ‌స‌తులుంటాయి. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రికి  స‌క‌ల సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తుంది ప్ర‌భుత్వం.

అయితే మోదీ  సూచించిన పొదుపు సూత్రాలు పాటించ‌డంలో భాగమా లేక‌, బేసిగ్గానే విజ‌య్ సినిమాటిక్ డ్రామా  పండించ‌డంలో ఇదొక ఎత్తా?  తెలీదు. కానీ, ఓవ‌రాల్ గా  అయితే విజ‌య్ సీఎంగా కోటు వేసుకోవ‌డం  నుంచి మొద‌లు పెడితే, అసెంబ్లీలో నోట్స్ రాసుకోవ‌డం. ఇప్పుడు చూస్తే లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెప్పించుకోవ‌డం వంటివి.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగులు, ఎలివేష‌న్లు బాగా ఎక్కువ‌య్యాయి.

మాములుగా మ‌న  పాల‌కుల విష‌యానికి వ‌స్తే కేసీఆర్, జ‌గ‌న్ కేవ‌లం  ఆహారం  కోసం పెట్టిన మొత్తం గ‌తంలో చాలా పెద్ద చ‌ర్చ‌నీయాంశం. ఇప్పుడు విజ‌య్ ఫుడ్డు  కూడా త‌న సొంత  ఖ‌ర్చులే అన‌డం వెన‌క చాలా పెద్ద అర్ధ‌ముంది.  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి భవన్‌లో  జరిగిన అధికారిక సమావేశాలు, విందులు, ఆతిథ్య ఖర్చులపై- RTI  ద్వారా కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి.

కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్‌లో వివిధ కార్యక్రమాలు, కలెక్టర్ల సమావేశాలు, ప్రజాప్రతినిధుల విందులు, ఇతర హాస్పిటాలిటీ కోసం సుమారు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఇందులో ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ వంటకాలు,  మాంసాహార విందులతో పాటు  వీఐపీలకు ఏర్పాటు చేసిన ఆతిథ్య ఖర్చులు అత్యధికంగా ఉన్నట్లు ఈ నివేదికలు తేల్చి  చెప్పాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కేవలం స్నాక్స్, లంచ్ కోసం పెట్టిన ఖర్చుపై ప్రస్తుత అధికార పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముగ్గురు తిన‌డానికి ఒక మ‌ధ్యాహ్నం డెబ్బై వేల రూపాయ‌లు వ‌చ్చించి లంచ్ తెప్పించుకున్నారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో సీఎంఓ పరిధిలో కేవలం  ఎగ్ పఫ్స్  ఇతర స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేతలు అధికారిక లెక్కలను చూపిస్తూ విమర్శించారు.

ఈ లెక్కల ప్రకారం ఏడాదికి సగటున రూ.72 లక్షలు, అంటే రోజుకు సుమారు వెయ్యి ఎగ్ పఫ్స్ చొప్పున ఐదేళ్లలో దాదాపు 18 లక్షల పఫ్స్‌లను క్యాంప్ ఆఫీస్‌లో వాడినట్లు ట్రెండింగ్ నెరేటివ్ నడిచింది. దీనిని అప్పట్లో కూటమి నేతలు ఎగ్ పఫ్ స్కామ్ అని కూడా పిలిచారు.

అయితే ఈ ఆరోపణలపై ఆయా ప్రతిపక్ష పార్టీలు ఘాటుగానే స్పందించాయి. ముఖ్యమంత్రి నివాసానికి, కార్యాలయానికి ప్రతిరోజూ వందలాది మంది అధికారులు, విదేశీ ప్రతినిధులు, సందర్శకులు, పార్టీ క్యాడర్ వస్తుంటారని... అది కేవలం సీఎం ఒక్కరే తిన్న ఖర్చు కాదని అంటారు వైసీపీ  లీడ‌ర్లు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన హయాంలో  2014-19 మ‌ధ్య‌ స్నాక్స్, ఆతిథ్యం కోసం రూ.8.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఎదురుదాడి చేసింది వైసీపీ.

ఇక బీఆర్‌ఎస్ వాదన ఎలాంటిదంటే.. ప్రగతి భవన్‌లో జరిగినవన్నీ అధికారిక సమావేశాలని, రాష్ట్ర ప్రగతి కోసం దేశ విదేశీ ప్రతినిధులకు, అధికారులకు ఇచ్చే ప్రోటోకాల్ ఆతిథ్య ఖర్చులను ఇలా వ్యక్తిగత ఖర్చులుగా చూపించడం రాజకీయ కక్షసాధింపేనని కొట్టిపారేసింది.

మొత్తంగా చూస్తే, ప్రజాధనంతో నడిచే ముఖ్యమంత్రి కార్యాలయాల్లో జరిగే ఈ భారీ ఆతిథ్య ఖర్చులు ఎప్పుడూ అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి కారణమవుతూనే ఉంటాయి.

మంత్రి నారా లోకేష్ తన 77 విమాన ప్రయాణాలకు గానూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా టికెట్ ఖర్చుల కింద తీసుకోలేదు. అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధన కోసం చేసిన ప్రయాణాలు, వ్యక్తిగత పర్యటనలు.. ఇలా అన్నింటికీ ఆయన తన సొంత నిధులనే ఉపయోగించారు.

గతంలో వైసీపీ హయాంలో లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన ఆఫీస్ స్నాక్స్, టీ బిల్లుల కింద రూ.25 లక్షలు ప్రజాధనం ఖర్చయిందంటూ వచ్చిన పాత ఆరోపణలపై లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు.

తాజాగా వైఎస్ జగన్ హయాంలో సీఎంఓలో కేవలం ఎగ్ పఫ్స్, స్నాక్స్ కోసమే రూ.3.62 కోట్లు ఖర్చయ్యాయనే నిజాలు బయటకు వచ్చిన తరుణంలో.. లోకేష్ తన విమాన ప్రయాణాలు, ఆహారం, కనీసం తాగే వాటర్ బాటిల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా తనే చూసుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆర్టీఐ రికార్డులను చూపిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి.

ఇటీవల లోకేష్ భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి శ్రీలంక వెళ్లినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రి లగ్జరీ టూర్లు వేస్తున్నారు అని విమర్శించాయి వైసీపీ  శ్రేణులు. అయితే ఆ టూర్‌కు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు, హోటల్ స్టే, ఫుడ్ ఖర్చులన్నీ లోకేష్ తన సొంత అకౌంట్ నుంచే కట్టారని, ప్రభుత్వానికి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ  ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టం చేసింది.

రాజకీయాల్లో నాయకులు ప్రభుత్వ ప్రోటోకాల్ కింద‌ ఖర్చులను వాడుకోవడం సర్వసాధారణం. కానీ, లోకేష్ తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలకు చెక్ పెట్టడానికి, తన పరిపాలనలో పారదర్శకతను చూపించడానికి.. అధికారిక పర్యటనల ఖర్చులను కూడా తన సొంత జేబు నుండే పెట్టుకుంటున్నారని ఈ అధికారిక లెక్కలు నిరూపించాయి.

ఇలా లోకేష్ ఆల్రెడీ ఈ పొదుపు సూత్రం  పాటిస్తున్నారు. ఇప్పుడు కొత్త‌గా  విజ‌య్ వ‌చ్చి ఈ నిరాడంబ‌ర‌త పాటించ‌డం లేద‌న్న‌ది కొంద‌రి కామెంట్. అయితే విజ‌య్ విష‌యంలో కొస‌మెరుపు ఏంటంటే త్రిష ఆయ‌న‌గారి కోసం ఎలాంటి వంట‌లు చేస్తున్నారు? అవెలాంటి రుచిని క‌లిగి ఉన్నాయి?  వెజ్ వంట‌లా- నాన్ వెజ్ వంట‌లా? అన్న స‌ర‌దాతో కూడిన  సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...