Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నటి త్రిషపై షాకింగ్ కామెంట్స్.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్..!
posted on: Jul 3, 2026 3:25PM

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్, అలాగే ప్రముఖ సినీ నటి త్రిషలపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
స్థానిక టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పరువు నష్టం, ప్రజల్లో ఘర్షణలను ప్రేరేపించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాధాకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్ను తిరస్కరించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళ్తే.. గత జూన్ 20వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్లో ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారు. విజయ్ శారీరక రూపాన్ని ఎగతాళి చేయడంతో పాటు, ఆయన సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి రావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో మరియు విజయ్ అభిమానుల్లో తీవ్ర దుమారం రేగింది.
అక్కడితో ఆగకుండా, శాంతిభద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కూడా రాధాకృష్ణన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నటితో సంతోషంగా ఉండే విజయ్, ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయారని, నలువైపులా ఇరుక్కుపోయాననే మానసిక ఆందోళనలో ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగులు వేరు, రాష్ట్ర పాలన వేరంటూ ఎద్దేవా చేశారు.
తాను ఒక వ్యాపారినని, ఒక వ్యక్తి దుకాణంలోకి వచ్చినప్పుడు అతను కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది ముఖం చూసి చెప్పగలనని, అదేవిధంగా అసెంబ్లీలో సీఎం విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యంగ్యంగా మాట్లాడారు. తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అన్నట్లుగా విజయ్ ప్రవర్తన ఉందని రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు టీవీకే శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి.
మరోవైపు ఈ అరెస్టు పట్ల అధికారిక డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అవలంబిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా విమర్శించారు.
డీఎంకే ఇటువంటి అణచివేత చర్యలకు ఎప్పటికీ భయపడదని, తలొగ్గబోదని స్పష్టం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని డీఎంకే ఆరోపిస్తుండగా, పరువు నష్టం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని టీవీకే శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.






