ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ
posted on Oct 15, 2025 5:55PM

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మొదటిసారి శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శించుకోనున్నారు. ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన సంబంధించి కర్నూలు నంద్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్ననున్నారు. కర్నూల్ నగర శివారులోని నన్నూరు టోల్గేట్ వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్, రాష్ట్ర మంత్రులు పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 7300 మంది పోలీసులతో పాటు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఈ నెల 16న ఉదయం 7.50 గంటలకు డిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంకు చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్సీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులను జల్లెడ పట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్శనం అనంతరం కర్నూలుకు ప్రధాని చేరుకుని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 13,429 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిఎస్టి 2.0 సంస్కరణలు,వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించారు.
మోడీ పర్యటనను సక్సెస్ చేసేందుకు జిల్లా టిడిపి నాయకులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మోడీ సభకు మూడు లక్షల మందిని తరలించేందుకు జిల్లా టిడిపి నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామికంగా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందినందుకు ప్రధాని మోడీ ఎలాంటి వరాలు ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.