మోడీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. పెగాసస్ నిఘా నిజమైతే తీవ్రమైన అంశమన్న సీజేఐ

దేశంలో రాజకీయ ప్రకంపనలు స్పష్టిస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎడిటర్స్ గిల్డ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వస్తున్నట్లు గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   

పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన ఈ స్పైవేర్‌తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్లు ఎన్ రామ్, తదితరుల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని ఆరోపించారు. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని తెలిపారు. గూఢచర్యం, నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయన్నారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో తనకు తెలియదన్నారు. 

ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని కపిల్ సిబాల్ తెలిపారు. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదన్నారు. జర్నలిస్టులు,  కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై ఈ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారని చెప్పారు. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ అంశం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ను ఆసంస్థ కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మినప్పుడు, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండదన్నారు సిబల్. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్‌ జాబితాలో కనిపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో ఉభయ సభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ల ట్యాపింగ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడతారని తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది. ఇది రాజ్యాంగబద్ధత, నేరతత్వానికి సంబంధించింది’’ అని వాదించారు.