ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు.. అస‌లు స్కెచ్ ఇదేనా?

అశోక్ బాబు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ. గతంలో ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమంలో ముందు వరసలో నిలబడ్డారు. గతంలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ( ఏసీటీఓ)గా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ వాయిస్ ను పలు వేదికలపై సమర్థంగా వినిపిస్తున్న నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు అశోక్ బాబు.

అయితే.. అశోక్ బాబుపైన ఇప్పుడు కేంద్రం ఆధీనంలో పనిచేసే సీఐడీ విభాగం కేసు నమోదు చేయడం వార్తల్లోకి ఎక్కింది. ఆయనపై సెక్షన్ 477A,465,420  కింద సీఐడీకేసు నమోదు చేసింది. అశోక్ బాబు గతంలో ఏసీటీఓగా పనిచేసే సమయంలో బీకాం చదవక పోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారనేది సీఐడీ మోపిన అభియోగం. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ వచ్చింది.  రికార్డులు ట్యాంపరింగ్ చేసిన అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై గత ఏడాది లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.

దీంతో స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త 2021 ఆగస్టులో అశోక్ బాబు కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అశోక్ బాబు విషయంలో తీసుకున్న చర్యల గురించి తమ దృష్టికి తీసుకురావాలని లోకాయుక్త తన ఆర్డర్లో పేర్కొంది.

అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. బీకాం చదవకపోయినా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే అభియోగంపై అశోక్ బాబుపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో కూడా గ్రాడ్యుయేట్ అని పేర్కొన్నారనే అభియోగం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేసి, రిటైరైన అశోక్ బాబుపై ఇప్పుడు కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైరైన తర్వాత టీడీపీలో చేరిన అశోక్ బాబు ఏ అంశంపైనైనా జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడుతూనే ఉంటారు. అలాంటి అశోక్ బాబుపై ఇన్నేళ్ల తర్వాత సీఐడీ కేసు నమోదు చేయడమేంటని అంటున్నారు. అకోశ్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన మెహర్ కుమార్ వెనుక ఏ శక్తులు ఉన్నాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ బాబు నిజంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉంటే ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడెందుకు అశోక్ బాబును టార్గెట్ చేశారనే సమాధానం అందని ప్రశ్న. టీడీపీ నేతలు ఒక్కొక్కరిని కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో వేధిస్తున్న వైసీపీ సర్కార్ కు అశోక్ బాబుపై కేసుల విషయంలో ఏమైనా ప్రమేయం ఉండి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.