గుప్తనిధుల కోసం తవ్వకాలు...వైసీపీ నేత అరెస్ట్
posted on Oct 12, 2025 11:34AM

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం వీర్పల్లి కొండపై ఆదివారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం సాగిన తవ్వకాలు కలకలం రేపాయి. బంగారం కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి చేశారు.
దాడిలో వైసీపీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక జేసీబీ యంత్రం, ఒక కారు, నాలుగు మోటార్సైకిళ్లు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం బంటపల్లెకు చెందినవారిగా తేలింది. ఇంకా ఇద్దరు స్వామీజీలు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికుల సమాచారం ప్రకారం, కొండపై పాతకాలపు నిధులు ఉన్నాయన్న వదంతులు నెలలుగా ప్రచారంలో ఉన్నాయి. ఆ నమ్మకంతో ఈ గుంపు రాత్రివేళ తవ్వకాలకు చేపట్టారని పోలీసులు తెలిపారు
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుప్తనిధుల వేటలో రాజకీయ నేతల ప్రమేయం బయటపడటం చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చగా మారింది.