6 వేల కోట్ల నష్టం జరిగితే 35 కోట్లు ఇస్తారా.. జగన్ పై చంద్రబాబు ఫైర్
posted on Nov 28, 2021 12:51PM
ఆంధ్రప్రదేశ్ లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గినా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా వరదల్లోనే ఉన్నాయి. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనా మేరకు రూ.6,054 కోట్ల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికి కేవలం రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.
ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టిందని చంద్రబాబు చెప్పారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు. ఏపీలో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోయారని ఆయన అన్నారు.ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందించాలని చంద్రబాబు కోరారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాల్సి ఉందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సాయం అందించాలని చెప్పారు. పంట నష్ట పరిహారాన్ని పెంచాలని కోరారు.