వైసీపీ నోరు మూయించేలా చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్.. వర్చువల్ పద్ధతిలో మహానాడు

posted on: May 16, 2026 9:50AM

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పసుపు పండుగ మహానాడు  నిర్వహణలో ఈ ఏడాది ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఏటా ఘనంగా,  భారీ జనసందోహం మధ్య భౌతికంగా నిర్వహించే ఈ మహాసభను ఈసారి పూర్తిగా సరికొత్త పంథాలో  ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.  దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా..  ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ   నిర్ణయం తీసుకున్నారు. 

 ఏటా మే 27, 28 తేదీల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేస్తూ మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది వైసీపీకి పెట్టని కోటలాంటి   కడప జిల్లాలో  మహానాడును విజయవంతంగా నిర్వహించిన టీడీపీ..  ఈసారి నెల్లూరు  వేదికగా నిర్వహిం చాలని నిర్ణయించిన  సంగతి తెలిసిందే. ఇందుకోసం నెల్లూరులో ఇప్పటికే   ఏర్పాట్లు కూడా ప్రారంభ మయ్యాయి. అయితే పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల  నేపథ్యంలో ఇంధన వనరుల పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని మార్చారు.

కొత్త ప్రణాళిక ప్రకారం కేవలం పొలిట్‌బ్యూరో సభ్యులు మాత్రమే మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు నేరుగా హాజరవుతారు. అక్కడ జరిగే తీర్మానాలు, ప్రసంగాలు,  వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ఎక్కడికక్కడ ప్రత్యక్ష ప్రసారం  ద్వారా చేరవేయనున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 1,845 క్లస్టర్లను గుర్తించి, అక్కడ పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది కార్యకర్తలు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ సొంత ప్రాంతాల నుంచే ఈ పండుగలో భాగస్వాములు కావచ్చు.

వాస్తవానికి నెల్లూరులో భారీ ఎత్తున  సభ నిర్వహించేందుకు పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో..  అధిష్టానం నుండి వచ్చిన ఈ తాజా ఆదేశాలతో శుక్రవారం (మే 15) సాయంత్రం నుంచే  అక్కడ వేదిక పనులు నిలిచిపోయాయి. సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటూనే వనరులను ఆదా చేసే ఉద్దేశంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు చంద్రబాబు నిర్ణయం వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నిన్నటి దాకా ప్రధాని పొదుపు అంటుంటే.. మహానాడును ఆర్భాటంగా ఎలా నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిష్ఠాత్మక మహానాడు వేడుకను కుదించుకుంటుందా? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ విమర్శలు గుప్పించింది. అయితే చంద్రబాబు నిర్ణయంతో వైసీపీయుల నోళ్లు మూతపడ్డాయి.  ఇటు ఇంధన పొదుపు బాధ్యతను చాటుకుంటూనే.. , అటు డిజిటల్ మాధ్యమాల ద్వారా గ్రామీణ స్థాయి క్యాడర్‌ను ఏక తాటిపైకి తెచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంకేతికతను  సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ తాజా వ్యూహం భవిష్యత్తులో మిగిలిన పార్టీలకు కూడా మోడల్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...