కాంగ్రెస్ సీనియర్ నేతపై అనర్హత వేటు.. మూడేళ్ల వరకు నో పోటీ..
posted on Jun 23, 2021 8:37PM
ఎన్నికల రూల్స్ పాటించని వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళీపించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతపై అనర్హత వేటు వేసింది. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్పై ఎన్నికల సంఘం వేటు వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే నిర్ణీత గడువు లో ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించలేకపోయారు. దీంతో బలరాం నాయక్ పై ఈసీ అనర్హత వేటు వేసింది.
ఈసీ అనర్హత వేటు వేయడంతో వచ్చే మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీచేసే అర్హతను బలరాం నాయక్ కోల్పోయారు. ఈ మేరకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావుపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.