కృష్ణా జిల్లాలో కాల్ మనీ కలకలం.. మాఫియా వేధింపులతో వీఆర్వో సూసైడ్..
posted on Nov 30, 2021 11:14AM
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది. అధిక వడ్డీలు వసూల్ చేస్తూ జనం నడ్డి విరుస్తోంది. అప్పులు చెల్లించడం లేదంటూ వేధింపులకు దిగుతోంది కాల్ మనీ మాఫియా. దీంతో వేధింపులు భరించలేక కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా కాల్మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్గా గుర్తించారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్తానికులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం గౌస్ కొండపల్లి గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. వారి చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.