ఆ మూడు పార్టీల పొత్తు పొడుపు ..కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే  ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజం. ఇప్పటికే అనేక సందర్భాలలో రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్’లో అధికార వైసీపీని ఓడించేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రకటించినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్త పరిచారు. అదెలా సాధ్యమని,అయ్యే పనికాదని పెదవి విరిచారు.అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. బీజేపీ జాతీయ నాయకులతో ఆయన ఏమి మాట్లాడారో ఏమో కానీ, టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పించే బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించగలననే విశ్వాసం వ్యక్త పరిచారు. అయినప్పటికీ, రాష్ట్ర బీజేపే నాయకులు అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారు. చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట నిలబడుతుందా అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. 
అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ‘పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలు,వాహనదారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పిలుపునివ్వడాన్ని కూడా చంద్రబాబు స్వాగతించారు. రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులను తగ్గించాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 

నిజానికి, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇలా సానుకూలంగా ఎప్పుడూ స్పందించే లేదు. తొలిసారిగా ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అది కూడా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటనకు కొనసాగిపుగానే చంద్రబాబు స్పందన ఉందని, ఇది ఆ మూడు పార్టీలు మళ్ళీ దగ్గరవుతున్నాయి అనేందుకు ఒక సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.   

మరోవంక పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం నిర్ణయంపై అభినందనీయమంటూ ప్రసంసలు కురిపించారు,  'పెరుగుతున్న ధరలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఉపశమనం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.9.50, రూ.7 చొప్పున తగ్గించడం అభినందనీయం' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 
'బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో, కొంతమేరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, దిగువ-ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఉపశమనం పొందవచ్చని నేను భావిస్తున్నాను.పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గింపు కచ్చితంగా పేదలకు మేలు చేస్తుంది' అని అన్నారు పవన్ కళ్యాణ్. 

ఇలా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా, బీజేపీకి స్నేహ హస్తం అందించారని అనుకోవచ్చని అంటునారు. నిజానికి, తెలుగు దేశం, చంద్రాబాబు నాయుడు, రాష్ట్ర పయోజనల దృష్ట్యా బీజేపీతో పొత్తుకు సిద్దంగా ఉన్న సంకేతాలు ఉండబట్టే, పవన్ కళ్యాణ్’ విపక్షాల ఓటు చీలకుండా చూస్తానాయి మాట ఇచ్చారని  జనసీన నాయకులు అంటున్నారు. అలాగే, టీడీపీతో పొత్తుకు బీజేపీ జాతీయ నాయకత్వం కోడా సిద్ధంగా ఉందని అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించే బాధ్యతను తీసుకున్నారని అంటున్నారు. అయితే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అదే విధంగా చంద్రబాబు స్పందనకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, అనే దానిపై పొత్తు పొడుపు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.