ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిందితుల డిఫాల్ట్ బెయిలు రద్దు
posted on Nov 20, 2025 12:19PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. వీరు ముగ్గురూ ఈనెల ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. నిందితులు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై కేసు మెరిట్స్ ఆధారంగానే విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది.
హైకోర్టు ఈ తీర్పులోని అభిప్రాయాలతో ప్రభావితం కావాల్సిన అవసరం లేదనీ పేర్కొంది. వీరి డిఫాల్ట్ బెయిలును రద్దు చేసిన హైకోర్టు ముందు ఈ నెల 24లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తరువాత నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో లొంగుబాటు గడువును మరో రెండు రోజులు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.