నేను ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు : అంజన్ కుమార్ యాదవ్
posted on Oct 10, 2025 4:22PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ బుజ్జగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎంపీని ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. టిక్కెట్ను నవీన్ యాదవ్కు కేటాయించాల్సిన పరిస్థితులను ఆయనకు వివరించారు.
అనంతరం అంజన్ కుమార్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందానని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తనను ఇప్పుడు పక్కన పెట్టడం బాధాకరమన్నారు. తాను పార్టీలో చాలా సీనియర్ నాయకుడినని, ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ అందరూ కలిసి ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు జూబ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఆ తర్వాత కరోనాతో వెంటిలెటర్పై చికిత్స చేయించుకున్నానని గుర్తు చేశారు.
పార్టీ విధేయులకు న్యాయం జరగడం లేదన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనను సంప్రదించకుండా జూబ్లీ అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. హస్తం పార్టీలో అనేక పదవులు చేపట్టాను. నేను రెండు సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేశాను’ అని ఆయన గుర్తుచేశారు. తనకు అసంతృప్తి ఉందని.. తన బాధనంతా మీనాక్షీ నటరాజన్కు చెప్పుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయానన్నారు. అగ్రనేత రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని మీనాక్షికి చెప్పినట్లు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు.