ట్రంప్ పబ్లిసిటీ స్టంట్స్... యూఎస్లో 12 అడుగులు బంగారు విగ్రహం
posted on Oct 13, 2025 5:00PM
.webp)
అమెరికా ప్రెసిడెంట్ రూటే సెపరేటు. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఆయనకు ఎంత పిచ్చో వేరే చెప్పనవసరం లేదు. నోబెల్ శాంత బహుమతి కోసం ఆయన ఎంత హడావుడి చేశారో ఎవరూ మర్చిపోరు. తాజాగా ఆయన గోల్డెన్ స్టాట్యూ ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్ అయింది. గత నెల సెప్టెంబర్ లో ట్రంప్ గోల్డెన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అది కూడా అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా పెట్టారు. 12 అడుగుల ఎత్తైన ట్రంప్ బంగారు విగ్రహం అది. చేతిలో బిట్ కాయిన్ పట్టుకుని నిలబడ్డట్లు పెట్టిన ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తుండటం విశేషం.
ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల నిధులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ స్టాట్యూ ఏర్పాటు చేశారు. ట్రంప్ కు ఇలాంటివంటే మహా ఇష్టం. 12 అడుగుల బంగారు విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తినా... ట్రంప్ మాత్రం పిచ్చ హ్యాపీ అయిపోయారు. జస్ట్ ఇదే కాదు.. ట్రంప్ మైండ్ సెట్ ఎవరికీ అంతుపట్టదన్న టాక్ ఉంది. చరిత్రలో నిలిచిపోయేందుకు ట్రంప్ తనను తానే ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. అది రివర్స్ అవుతుందా.. సక్సెస్ అవుతుందా అనేది పక్కన పెడితే... ప్రపంచంలోనే తాను బలమైన లీడర్ అని ట్రంప్ బలంగా విశ్వసిస్తుంటారు. అయితే చైనా, భారత్, రష్యా మాత్రం ఆయన్ను లెక్క చేయడం లేదు. ఎంత వరకైనా తేల్చుకుందాం అంటున్నాయి.
ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలని ట్రంప్ అనుకుంటున్నారో ఏమోగానీ.. మొదట అమెరికాలో ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుల కంటే గొప్ప వ్యక్తిగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2026లో అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక డాలర్ ప్రత్యేక నాణెం విడుదల చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ డాలర్ కాయిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఫోటో పెట్టుకుంటున్నారు. ట్రంప్ పిడికిలి ఎత్తి ఉన్న ఫోటో పెట్టి.. పక్కన ఫైట్, ఫైట్, ఫైట్ అన్న నినాదాలతో ఉన్న నాణెం డిజైన్ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. నిజానికి ఇది అమెరికన్ కరెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంప్రదాయాలకు విరుద్ధం. బతికి ఉన్న వారి ఫోటోలు కాయిన్లు, నోట్లపై వేయకూడదు. కానీ ట్రంప్ కు ముందు చూపు ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్లాన్ తో గతంలోనే చట్టం చేయించుకున్నారు.
అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన మౌంట్ రష్మోర్ పై ట్రంప్ కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్ మెమోరియల్లో తన ఫేస్ స్టాచ్యూను చెక్కించాలని తెగ ఆసక్తి చూపారు. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లో ఏఐ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అందులో అమెరికన్ లెజెండరీ ప్రెసిడెంట్ల పక్కనే తనది కూడా ఉన్నట్లు ఎలివేట్ చేసుకున్నారు. మౌంట్ రష్మోర్ నేషనల్ మెమోరియల్ సౌత్ డకోటాలోని కీస్టోన్ వద్ద ఉన్న బ్లాక్ హిల్పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్ శిలలపై అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్ చేశారు. ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.
వాటిని చూసి వెళ్తుంటారు. ఈ మెమోరియల్పై అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూజ్ వెల్ట్, అబ్రహం లింకన్ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన వారే. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదు. మౌంట్ రష్మోర్ను నిర్వహించే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సేఫ్టీ కాదని, మొత్తం కూలిపోతాయని స్పష్టం చేసింది
అసలు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. ఆ క్రమంలోనే ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షో హోస్ట్ చేశారు. 2004 నుంచి 2017 వరకు NBC నెట్వర్క్లో 15 సీజన్లు రన్ అయింది. 14-18 మంది బిజినెస్ కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. ఈ షోలు ట్రంప్ని టఫ్ బిజినెస్మ్యాన్ గా బ్రాండ్ చేశాయి. అయితే ఈ షోలు ప్లీప్లాన్ అని, ట్రంప్ ఇమేజ్ మాస్క్ అని కొందరు అంటారు. ఇప్పుడు అధ్యక్షుడు అయినప్పటికీ అదే కథ నడుస్తోంది. అందుకే ట్రంప్ రూటే సపరేటు.