ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ మీటర్ల పెడుతుంది : కేటీఆర్

posted on: May 24, 2026 5:14PM

 

తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల అమలుకు సిద్ధమవుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని కేటీఆర్ అన్నారు.

అంబర్‌పేట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమలు చేయడం ద్వారా రైతులపై భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రీపెయిడ్ మీటర్ల అమలుపై చర్చ జరిగిందని, త్వరలోనే గ్రామాలు, పట్టణాల్లో ఈ విధానం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా ప్రతి ఇంటిలో ఉన్న సాధారణ మీటర్ల స్థానంలో కూడా ప్రీపెయిడ్ మీటర్లను అమలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


ప్రీపెయిడ్ మీటర్లు అమల్లోకి రాకముందే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యుత్ రంగంలో జరుగుతున్న మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ హెచ్చరించిందని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలోనే మీటర్ల వ్యవహారంపై హెచ్చరించారని తెలిపారు.

ప్రధాని మోదీ  ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రుణాలను ఆపినా కేసీఆర్ ప్రీపెయిడ్ మీటర్ల అమలుకు ఒప్పుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు అమలు చేస్తామని చెబుతోందని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అవినీతి మరియు అరాచకాలతో పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో సగం కాలం పూర్తయినా ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగలేదన్నారు. ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇదే సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా కేటీఆర్ మాట్లాడారు. త్వరలోనే సభ్యత్వ నమోదు అనంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈసారి సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడతామని వెల్లడించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధి అంశంపైనా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం కొత్త నగరాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. నగరంలో చెత్త, డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. వేలాది ఇండ్లను కూల్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మూసీ ప్రక్షాళన పేరుతో భారీ అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...