Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏబీవీ లిగల్ నోటీసులు ఎవరెవరికంటే?
posted on: Apr 26, 2026 10:30AM

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, తన గౌరవానికి కలిగిన నష్టానికి గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాటి సీఎం జగన్ సీఎంఓలో సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరి సహా పదిమంది పోలీసు అధికారులకు లీగల్ నోటీసులు పంపించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ పరికరాల కొనుగోలుకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం సాగించడంలో సీపీఆర్ఓ శ్రీహరి కీలక పాత్ర పోషించారని ఏబీ ఆరోపిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి, మీడియాకు తప్పుడు సమాచారం చేరవేసి, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు వచ్చేలా చేశారని ఆయన మండిపడ్డారు. ఈ చర్యల వల్ల తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతిన్నదని, అందుకు శ్రీహరి బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం సీపీఆర్ఓ మాత్రమే కాకుండా, గతంలో తనను ఇబ్బంది పెట్టిన ఐపీఎస్ అధికారులు ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్, రవిశంకర్ అయ్యన్నార్, పీఎస్సార్ ఆంజనేయులుకు కూడా ఆయన లీగల్ నోటీసులు పంపారు. వీరంతా కలిసి పథకం కుట్రపూరితంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారని, ఆధారాలు లేకపోయినా తనపై కేసులు బనాయించారని ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు కూడా ఫిర్యాదులు అందజేశారు.
తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు జారీ చేసిన ఈ నోటీసులు ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనం రేపుతున్నాయి. ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి తన సహోద్యోగులపైనే ఈ స్థాయిలో న్యాయపోరాటానికి దిగడం కలకలం రేపింది. ఈ పరిణామాలపై ప్రస్తుత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బాధ్యులైన అధికారులపై విచారణకు ఆదేశిస్తుందా? లేదా ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ద్వారానే తన పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, తన నిజాయితీని నిరూపించుకోవడంతో పాటు, తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.
తనపై కుట్రకు పునాదులు 2018లోనే పడ్డాయని పేర్కొన్న భద్రతా పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్ను 2018 డిసెంబరులో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా.. దురుద్దేశపూర్వకంగా రద్దు చేశారనీ.. కానీ ఆ విషయాన్ని ఫైళ్లలో ఎక్కడా పొందుపరచలేదని ఏబీవీ సాక్ష్యాధారాలతో పేర్కొన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత.. అప్పటి సీఎం జగన్ మెప్పు పొంది.. కీలక పోస్టింగ్ల కోసం వీరు తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ రికార్డులను సైతం తారుమారు చేసి కల్పిత కథనాలను సృష్టించి, తన పరువు ప్రతిష్ఠలను భంగం కలిగించేలా వ్యవహరించారని ఏబీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భద్రతా పరికరాల టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
గత కొన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్న ఏబీవీ.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వేధించడం వ్యవస్థకే తీరని నష్టమన్నారు. తనను ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారీ చట్టం ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందనీ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీశాయి. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కూటమి సర్కార్ ఏ చర్యలు తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.






