ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ సమావేశం
posted on Sep 5, 2025 2:50PM

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని ప్రధానిని లోకేశ్ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని మెరుగైన ఫలితాల సాధించేందుకు సహకరించాలని కోరారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ఆయన వివరించారు. ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేశ్ బహుకరించారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేశ్ భేటీ కానున్నారు.