సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీకి బెదిరింపు కాల్!

 

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్‌ వచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్‌కాల్‌ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్‌ చేశారు. బెదిరింపు కాల్‌పై డీజీపీ, మెదక్‌ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్‌ ఫిర్యాదు చేశారు.

సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్‌రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్‌కి, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.