టీడీపీని తుదముట్టించే కుట్ర.. దాడుల‌పై చంద్రాగ్ర‌హం..

ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు. జగన్‌, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదన్నారు. కానీ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని చెప్పారు. పార్టీ ఆఫీసులోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెట్టించటం సిగ్గుచేటని మండిపడ్డారు చంద్ర‌బాబు.

టీడీపీ పార్టీ ఆఫీస్‌, నాయకులపై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గరుండి సాగనంపటం సిగ్గుచేటని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీకి హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు. చేతకాకుంటే పోలీసు వ్యవస్థను మూసేయండని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు వాడిన భాషపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని చంద్ర‌బాబు సవాల్ విసిరారు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందని మండిప‌డ్డారు. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమిది అన్నారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. పట్టాభి ఇంటిపైనా దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతో పాటు చాలా చోట్ల దాడులు జరిగాయి. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులకు తెగ‌బ‌డ్డారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అమిత్‌షాను కోరామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. నా ఫోన్‌ కాల్‌ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు. దాడుల గురించి  వివరించేందుకు డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించరా? పోలీసులు స్పందించకుంటే నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయి. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు నమోదు చేస్తారా? విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరులో చంద్రాగ్ర‌హం వ్య‌క్తం చేశారు.