తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న ఈ చిచ్చుని ఆర్పేదెవరు?

  “రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ముల్లా కలుసుందాము...చైనా, పాకిస్తాన్ దేశాలతోనే ఎంతో సర్దుకుపోగా లేనిది ఇంతవరకు ఒక్కటిగా కలిసిమెలిసి జీవించిన తెలుగుజాతి రెండు రాష్ట్రాలుగా విడిపోతే సర్దుకుపోలేమా? హైదరాబాద్ లో నివసించే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటాము...” రాష్ట్ర విభజన జరగక ముందు ఇటువంటి గొప్ప గొప్ప మాటలు చాలా వినబడ్డాయి. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఎవరూ ఊహించలేనన్ని సమస్యలు, గొడవలు తలెత్తుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదించారు. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి. ఆయన కూడా ఊహించలేని అనర్ధాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి.   రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు సరికదా రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఆ కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దాలు నిత్యకృత్యమయిపోయాయి. అవి కూడా ఇరు ప్రభుత్వాల పరిపాలనలో ఒక అంతర్భాగమా...అన్నట్లుగా మారిపోయాయి. రాష్ట్రం విడిపోతే ప్రళయం ముంచుకు రాదని తెలంగాణా నేతలు వాదించేవారు. కానీ ఇప్పుడు ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8, తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఒకేసారి 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపడం, తాజాగా షెడ్యూల్:10 క్రింద ఉన్న సంస్థలపై ఆధిపత్యం కోసం ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు మరో యుద్దానికి సిద్దపడటం ఇలాగ ఒకదాని తరువాత మరొకటిగా వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ అటువంటి పరిస్థితికే దారి తీసేవిగానే కనబడుతున్నాయి.   ఈ సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు. తెలుగు ప్రజలు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నెత్తినపెట్టుకొని మోసినందుకు వారికి మేలు చేయకపోగా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తెలుగుజాతిలో ఈ చిచ్చు పెట్టింది. కనుక ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ శపిస్తూనే ఉంటారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకొన్నట్లయితే కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చును. కానీ తెదేపా, తెరాసల మధ్య రాజకీయ వైరం కారణంగా సమస్యలు నానాటికీ పెరిగాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు సిద్దపడినప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సానుకూలంగా స్పందించడం చాలా విచారకరం. పైగా ఆయన ప్రదర్శిస్తున్నఅనవసమయిన దూకుడు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్యం కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఇంత జరుగుతున్న ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న గొడవలలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చదని చెప్పడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని విడదీసింది కనుక ఈ సమస్యల పరిష్కారానికి అదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తాత్కాలిక ఆలోచనలు చేయడం కంటే శాశ్విత ప్రాతిపదికన ఒక చట్టబద్దమయిన ప్రత్యేక యంత్రాంగం లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచిది. లేకుంటే ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా రెండు రాష్ట్రాలలో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.

తెలుగు రాష్ట్రాలను ఇక గవర్నరే రక్షించాలి

  ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య చెలరేగిన చిచ్చు ఇప్పుడు సెక్షన్: 8తో ప్రజల మధ్యకు కూడా పాకుతోంది. ఆంద్రప్రదేశ్ మంత్రులు, నేతలు, ప్రజలు కూడా దానిని తక్షణమే అమలుచేయాలని గట్టిగా కోరుతుంటే, తెలంగాణా మంత్రులు, నేతలు, ప్రజలు దానిని అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఎవరి వాదనలు వారు బలంగా వినిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల గొడవలలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చబోదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి తెదేపా మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కొనసాగుతున్నందున ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తే కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని తెలంగాణా ప్రజలు భావించే అవకాశం ఉంది కనుకనే బహుశః ఆయన ఆవిధంగా అని ఉండవచ్చును. కానీ ఆ కారణంగా ఈ వ్యవహారంలో తలదూర్చబోమని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ బిగుసుకొని కూర్చోన్నట్లయితే ఈ సమస్యలు ఇంకా జటిలమయ్యే ప్రమాదం ఉంది.   ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి తెలియవని కాదు. బహుశః వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉండిఉండవచ్చును. ఆ ప్రయత్నంలోనే సెక్షన్: 8ని ముందుకు తెచ్చి ఉండవచ్చును. విభజన చట్టంలో ఉన్న ఈ సెక్షన్ని ఉపయోగించుకొని రెండు ప్రభుత్వాల మధ్య నడుస్తున్న ఈ యుద్దానికి తెర దించాలని కేంద్ర ప్రభుత్వం భావించినందునే ఆ ఆలోచన చేసి ఉండవచ్చును. కానీ అది రెండు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అది మరొక కొత్త సమస్యకు దారి తీయడం చాలా ఆందోళన కలిగిస్తోంది.   సెక్షన్: 8కి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు వాదోపవాదాలు మొదలుపెట్టడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారుతోంది. అయితే సెక్షన్: 8 ద్వారా రెండు ప్రభుత్వాల మధ్య నడుస్తున్న వివాదాలకు ముగింపు పలకడానికే తప్ప తెలంగాణా ప్రభుత్వ హక్కులను భంగం కలిగించేందుకు కాదని తెరాస, తెదేపా ప్రభుత్వాలకి తెలియదనుకోలేము. అయినా ఇరు రాష్ట్రాల మంత్రులు దీనిపై ఎందుకు తీవ్ర వాదోపవాదాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ముఖ్యమంత్రులిరురువురూ తమ మధ్య తలెత్తిన ఈ వివాదాలకు ఇంతటితో తెర దించేందుకు సిద్దపడినట్లయితే, ఇక సెక్షన్: 8 ప్రస్తక్తి కూడా ఉండకపోవచ్చును. కనుక గవర్నరే మళ్ళీ చొరవదీసుకొని ఈ సమస్యని పరిష్కరించవలసి ఉంటుంది.

న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందా?

  జయలలిత కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు, సల్మాన్ ఖాన్ కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపించాయి. బహుశః ఆ కారణంగానే కర్నాటక ప్రభుత్వం మళ్ళీ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో నిన్న ఒక పిటిషను దాఖలు చేసినట్లు భావించవచ్చును. తన కేసుపై స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విచారణ జరిగినట్లయితే తనకు న్యాయం జరగదని భావిస్తున్నందున పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయమని ఆమె అభ్యర్ధన మేరకే ఆమె కేసును కర్నాటకకు బదిలీ చేసారు. ఆమె చేసిన అభ్యర్ధన న్యాయవ్యవస్థను అనుమానిస్తున్నట్లుగానే ఉన్నప్పటికీ, తమిళనాడులో అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఆమె కేసును కర్నాటకకు బదిలీ చేసింది.   నిర్భయ కేసులో దోషులు ఎవరో అందరికీ తెలిసినా నేటి వరకు ఎవరికీ శిక్షలు పడలేదు. ఆ కారణంగానే దేశంలో ఇప్పుడు మహిళలపై సామూహిక అత్యాచారాలు చాలా సర్వసాధారణమయిపోయాయి. అయినప్పటికీ న్యాయవ్యవస్థల మీద నేటికీ ప్రజలకు నమ్మకం నిలిచే ఉండటం చాలా సంతొషించవలసిన విషయమే.    ప్రజలకు నమ్మకం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు లేదని నిరూపిస్తున్నట్లుగా ఓటుకి నోటు వ్యవహారంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న నామినేటడ్ ఎంయల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో ఒక పిటిషను వేసారు. ‘కొన్ని రోజుల క్రితం స్టీఫెన్ సన్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించలేదు కనుక ఈ కేసు నుండి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ ఈ కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య వేసిన పిటిషనును స్వీకరించి, తనకు నోటీసులు ఇచ్చిన జస్టిస్ బి. శివశంకర్ రావుపై తనకు నమ్మకం లేదని కనుక ఈ కేసును వేరే న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరుతూ ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో ఒక పిటిషను వేసారు.   ఇంతకు ముందు తెలంగాణా ఎసిబిపై కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చేయి. తెలంగాణా ప్రభుత్వ కనుసన్నలలో ఎసిబి పనిచేస్తోందని కనుక అది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు భావించడం లేదని కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో కృష్ణయ్య అనే ఒక న్యాయవాది పిటిషను దాఖలు చేసారు. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ సిఐడి అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేయడాన్ని తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.   ఇదివరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ అధినేత రంజిత్ సిన్హా నిత్యం కేంద్రమంత్రులను కలుస్తూ వారి ఆదేశాలనుసారం బొగ్గు గనుల కుంభకోణంపై తన సంస్థ తయారుచేసిన నివేదికలో మార్పులు చేర్పులు చేసినట్లు స్పష్టం అవడంతో సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించడమే కాక ఆయనపై కూడా కేసు నమోదు చేయమని కేంద్రాన్ని ఆదేశించింది. ఈవిధంగా దేశంలో న్యాయవ్యవస్థలు, దర్యాప్తు వ్యవస్థలు ప్రజల నమ్మకం పోగొట్టుకొన్నట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసే ప్రమాదం ఉంది.

హైదరాబాద్ లో గవర్నర్ కే సర్వాధికారాలు?

  రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ లో రెండు ప్రభుత్వ వ్యవస్థలు మరో తొమ్మిదేళ్ళపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక వాటి మధ్య ఎటువంటి సమస్యలు, ఘర్షణలు ఏర్పడినా వాటి వలన హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని ఏర్పాటుచేసి, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యతను గవర్నర్ కి అప్పగించబడింది. సుమారు మూడు నాలుగు నెలల క్రితమే గవర్నర్ నరసింహన్ కూడా సెక్షన్ :8 ద్వారా తనకు సంక్రమించే అధికారాలను, బాధ్యతలను నిర్వచించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పుడు ఇటువంటి విపత్కర సమస్యలేవీ లేనందున కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేసినట్లుంది. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాల వలన ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడటంతో కేంద్రం ఇప్పుడు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీను సంప్రదించిన తరువాత కేంద్ర హోంశాఖ అందుకు అనుమతించినట్లు సమాచారం.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని కోసమే కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు ప్రభుత్వాలు దేని వాదన అవి బలంగా వినిపిస్తున్నాయి. కానీ సెక్షన్: 8 ప్రకారం గవర్నర్ తన విశేషాధికారాలను ఉపయోగించుకొని ప్రస్తుత పరిస్థితులను తక్షణమే చక్కదిద్దవలసిందిగా కేంద్రప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. కనుక తెలంగాణా ఎసిబి చూస్తున్న ఓటుకు నోటు దర్యాప్తుని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుని కూడా ఇకపై గవర్నర్ నరసింహన్ స్వయంగా పర్యవేక్షించవచ్చును. ఆ రెండు సంస్థలు ఇకపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కాక గవర్నర్ కే తమ దర్యాప్తు నివేదికలను సమర్పించి ఆయన ఆదేశాల ప్రకారమే వ్యవహరించవలసి ఉంటుంది.   అయితే దీని ప్రధానోద్దేశ్యం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఘర్షణను తొలగించడమే తప్ప తెలంగాణా ప్రభుత్వ అధికారాలను హరించడం కోసం కాదనే విషయం గమనించవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కానీ, గవర్నర్ కి గానీ అటువంటి ఉద్దేశ్యమే ఉన్నట్లయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుండే సెక్షన్: 8 అమలుచేసి ఉండేవారు. కానీ సెక్షన్: 8 ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం సమస్యలు నివారించాలనే తప్ప సృష్టించాలని కాదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఇరువురూ కూడా దానిని ఇంతవరకు వినియోగించాలనుకోలేదని స్పష్టమవుతోంది. కనుక ప్రస్తుతం ఏర్పడిన విపరీత పరిస్థితులను చక్కదిద్దేంతవరకే ఆయనకు సెక్షన్: 8 ద్వారా కలిగిన ప్రత్యేకాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్రం అనుమతించి ఉండవచ్చును తప్ప శాశ్వితం కాదని భావించవచ్చును. కనుక పరిస్థితులు చక్కబడగానే తెలంగాణా ప్రభుత్వానికే హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలను అప్పగిస్తారనడంలో సందేహమూ లేదు. ఒకవేళ అప్పుడు కూడా గవర్నర్ తన విశేషాధికారాలను వినియోగించుకొంటున్నట్లయితే అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడం సహేతుకంగానే ఉంటుంది.

మరో నాలుగేళ్ళు హైదరాబాద్ నుండి పరిపాలన మంచిదేనా?

  ఆంద్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మరో నాలుగేళ్ళు పట్టవచ్చును. అంతవరకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు గమనించినట్లయితే హైదరాబాద్ నుండి పరిపాలన చేయడంలో మున్ముందు కూడా ఇటువంటి ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అర్ధమవుతోంది. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్స్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నప్పుడు, ఇక ప్రభుత్వ వ్యవహారాలలో గోప్యత పాటించడం అసంభవమేనని స్పష్టం అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమయితే ఇక ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ కూడా ప్రభుత్వ వ్యవహారాల గురించి ఫోన్స్ ద్వారా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాని వలన పరిపాలన మీద తీవ్ర ప్రభావం పడుతుంది.   ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం తలెత్తిన వివాదాలు నేడు కాకపోతే రేపయినా ఏదో విధంగా సద్దుమణగవచ్చు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమయితే, మున్ముందు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరగదనే భరోసా ఏమీ లేదు. అటువంటప్పుడు మరో నాలుగేళ్లపాటు హైదరాబాద్ కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగించడం మంచిదా కాదా? అక్కడే కొనసాగదలిస్తే ఇటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఏవిధంగా నివారించాలనే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరికగా భావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.

కంచికి చేరుతుందనుకొన్న కధ మళ్ళీ మొదలయిందా?

  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ చర్యకీ తప్పక సమాన ప్రతిచర్య ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుండే హెచ్చరిస్తుండటం అందరికీ తెలిసిందే. ఆ హెచ్చరికలను నిజం చేస్తూ నిన్న అర్ధరాత్రి ఆంధ్రా పోలీసులు టీ-న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఎన్‌వీవీ ప్రసాద్‌ అనే న్యాయవాది విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో టీ-న్యూస్ ఛానల్ పై చేసిన ఒక పిర్యాదుపై స్పందిస్తూ విశాఖ నగర ఎసిపి రమణ నిన్న అర్ధరాత్రి కి టీ-న్యూస్ ఛానల్ సిఈఓ నారాయణ రెడ్డికి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని టీ-న్యూస్‌ ప్రధాన కార్యాలయంలో నోటీసులు అందజేసారు.   నామినేటడ్ ఎమ్యల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ తో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఆడియో టేపులను జూన్ 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీ-న్యూస్ ఛానల్ ప్రసారం చేసి టెలిగ్రాఫిక్ చట్టంలోని సెక్షన్: 19ని ఉల్లంఘించినందుకు నోటీసు జారీ చేస్తున్నట్లు, దానికి మూడు రోజులలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. టీ-న్యూస్ ఛానల్ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ ఆడియో టేపులను ప్రసారం చేసి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయాణించిందని, కనుక దానిపై చట్టపరమయిన చర్యలు తీసుకోవలసిందిగా న్యాయవాది ఎన్‌వీవీ ప్రసాద్‌ తన పిర్యాదులో కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగానే టీ-న్యూస్ ఛానల్ కి నోటీసు జారీ చేయబడింది.   అయితే ఎసిపి రమణ టీ-న్యూస్ ఛానల్ కి నోటీసు అందజేయడానికి వెళ్లేముందు తమకు ఆ విషయం గురించి ముందుగా తెలియజేయనందుకు తెలంగాణా పోలీస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు కూడా విశాఖ నగర ఎసిపి రమణకి బహుశః నోటీసు ఇస్తారేమో?   గత రెండు రోజులుగా తెలంగాణా ఎసిబి అధికారులు ఎటువంటి తీవ్రమయిన చర్యలు చేప్పట్టకపోవడంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గబోతున్నాయేమోననే ఊహాగానాలు వినిపించాయి. కానీ కంచికి చేరుతుందనుకొన్న కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనబడుతోంది. కనుక ఈరోజు తెలంగాణా ఎసిబి అధికారులు కూడా మరొక అడుగు ముందుకు వేస్తారేమో? అప్పుడు మళ్ళీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలవవచ్చును.

ఆంధ్రా, తెలంగాణా జలవివాదాలకు పరిష్కారం

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఏడాదిగా సాగుతున్న జల వివాదాలకు కేంద్రజలవనరుల శాఖ ఎట్టకేలకు ఒక పరిష్కారం కనుగొంది. ఈరోజు డిల్లీలో కేంద్రజలవనరుల శాఖ కార్యదర్శి అమరేందర్ సింగ్ సమక్షంలో సమావేశమయిన కృష్ణానది జలసంఘం సభ్యులు కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో కూడా ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు. దీనిలో ఇరు రాష్ట్రాల ఈ.యన్.సి.లు, కేంద్రజలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ గేట్ల నిర్వహణ భాద్యతలు పూర్తిగా ఈ తాత్కాలిక సంఘానికే అప్పగించబడ్డాయి. దిగువనున్న ఆయకట్టు రైతుల నీటి అవసరాలను బట్టి ఆ తాత్కాలిక సంఘమే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నీరు విడుదల చేస్తుంటుంది. నీటి విడుదల, ప్రాజెక్టు గేట్ల నిర్వహణ విషయంలో ఆ కమిటీదే తుది నిర్ణయం. అందులో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఎవరూ కూడా జోక్యం చేసుకోకూడదు. ఆ తాత్కాలిక కమిటీ సభ్యులు నీటి విడుదలలో ఏకాభిప్రాయానికి రాలేకపోయినా, మళ్ళీ వారి మధ్య వివాదం చెలరేగినా దాని గురించి కేంద్ర జలవనరుల ప్రధాన కార్యదర్శికి మాత్రమే నివేదించాలి.   ఈరోజు జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు కూడా పూర్తి చేసారు. వీటిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 164 టీయంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 519 టీయంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 181.2 టీయంసీల నీళ్ళు కేటాయించారు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 100 టీయంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 299 టీయంసీల నీళ్ళు కేటాయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తాత్కాలిక కమిటీ నిర్ణయాలలో జోక్యం చేసుకోనట్లయితే ఈ సమస్యకు ఇదే శాశ్విత పరిష్కారం అవుతుందని భావించవచ్చును. ఈ ప్రయత్నం సఫలమయితే గోదావరి జలాల పంపకాలకు కూడా ఇదే సూత్రం అమలుచేయవచ్చును.

ఇంక కోర్టులూ, తీర్పులు ఎందుకు?

  ఓటుకు నోటు వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారందరూ కోర్టులు, విచారణలతో సంబంధం లేకుండా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోషి అని ఖరారు చేస్తుండటమే కాకుండా ఆయనకి జైలు శిక్షని ఖరారు చేస్తూ తీర్పులు కూడా చెప్పేస్తున్నారు. ఆయనతో బాటు ఇంకా ఎంతమంది దోషులున్నారో, ఎవరెవరు దోషులో, వారిలో ఎవరెవరికి ఎటువంటి శిక్షలుపడాలో కూడా వారే డిసైడ్ చేసేస్తున్నారు. అటువంటప్పుడు ఇక దేశంలో కోర్టులు, ఎసిబిలు, విచారణలు, పరిశోధనలు, సాక్షులు ఏవీ కూడా అవసరమే లేదు. వారందరి తీరు చూస్తుంటే తమ రాజకీయ ప్రత్యర్ధుల తప్పొప్పుల లెక్కలను తామే సరిచూసి, తమకు నచ్చినట్లు తామే శిక్షలు విధించే సౌలభ్యం ఉంటే బాగుంటుందని కోరుకొంటున్నట్లుంది. అయితే అటువంటివి రాజరిక వ్యవస్థలోనే సాధ్యమవుతాయని వారికీ తెలుసు.   ఇప్పుడు శ్రీరంగనీతులు చెపుతున్న రాజకీయ నాయకులందరి చరిత్రలు ప్రజలకు చాలా బాగా తెలుసు. అయితే కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భావిస్తున్నట్లుగానే వారు కూడా తమ నిర్వాకాలని ప్రజలెవరూ గమనించడంలేదని భావిస్తున్నట్లున్నారు. అందుకే వారు అంత దైర్యంగా మీడియా ముందుకు వచ్చి మరీ శ్రీరంగనీతులు వల్లిస్తున్నారు. ఇక మరికొందరయితే అప్పుడే తెదేపా, బీజేపీ బంధాలు తెగిపోయినట్లు, ఎన్డీయే కూటమిలో, మోడీ ప్రభుత్వంలో తెదేపా స్థానాన్ని తాము భర్తీ చేయబోతున్నట్లు కలలుకంటూ అప్పుడే ఊహాలోకంలో తేలిపోతున్నారు. కాంగ్రెస్, వైకాంగ్రెస్, తెరాస పార్టీలయితే చంద్రబాబు నాయుడు స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలో కూడా నిర్ణయించేసాయి.   అయితే ఎసిబి అధికారులు ఇంకా తమకు ఫోరెన్స్ ల్యాబ్ నుండి నివేదిక రాలేదని, అందువల్ల తమ పరిశోధన ఇంకా పూర్తి కాలేదని కోర్టుకి చెప్పడంతో రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మరొక రెండు వారాలు పొడిగించడాన్ని వారెవరూ పట్టించుకోవడం లేదు. అంటే ఎసిబి తన పరిశోధన పూర్తి చేయకముందే, ఇంకా కోర్టు తీర్పు చెప్పకముందే అంతవరకు ఆగలేని వైకాపా, కాంగ్రెస్, తెరాసలు చంద్రబాబు నాయుడుతో సహా చాలా మందిని దోషులుగా ఖరారు చేసేసి వారికి ఏమి శిక్షలు వేయాలో కూడా ప్రకటించేస్తున్నాయి. కానీ వారందరూ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే  వారు అవినీతిని వ్యతిరేకిస్తున్నారని కాదు, తమ రాజకీయ ప్రత్యర్ధి తెదేపా ఇటువంటి సంకట పరిస్థితిలో ఇరుకొని విలవిలలాడుతుంటే, పైశాచిక ఆనందంతోనే దానిపై మరో నాలుగు రాళ్ళు విసురుతున్నారని చెప్పవచ్చును.   కానీ వారు రాజకీయాలను ఇంకా ఎంతకు దిగజార్చుకొంటే దాని వల్ల వారికే ప్రమాదం ఉంటుందని గ్రహించలేకపొతున్నారు. తాము పెంచి పోషిస్తున్న భయంకరమయిన విషసర్పం వంటి ఈ నీచవికృత రాజకీయాలకు నేడు కాకపోతే ఏదో ఒకనాడు తామూ బలయ్యే ప్రమాదం ఉంటుందనే సత్యాన్ని రాజకీయనేతలు, పార్టీలు గ్రహించకుండా వికృత రాజకీయ క్రీడలలో మునిగితేలుతున్నారు. వాటి గురించి ప్రజలు చర్చించుకొంటున్నారంటే దానర్ధం వాటికి ప్రజామోదం ఉందని కాదని వారు గ్రహించడం మంచిది.

తెలంగాణా ప్రభుత్వంపై జగన్ కేంద్రానికి పిర్యాదు అందుకేనా?

  తెలంగాణ ప్రభుత్వంపై పిర్యాదు చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలవనరులమంత్రి ఉమాభారతికి ఆదివారం ఒక లేఖ వ్రాసారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాలమూరు ఎత్తిపోతల పధకం చేప్పట్టిందని, దాని వలన రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు నీళ్ళు అందక ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని తన లేఖలో పేర్కొన్నారు. కనుక కేంద్ర మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని తగిన చర్యలు చెప్పట్టాలని కోరారు.   అయితే ఇటీవల జరిగిన తెలంగాణా ఎమ్యల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హటాత్తుగా అదే తెరాస ప్రభుత్వంపై కేంద్రానికి పిర్యాదు చేస్తూ లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగించవచ్చును. కానీ దానికి చాలా బలమయిన కారణాలు కనబడుతున్నాయి. ఇటీవల తెలంగాణా కౌన్సిల్ ఎన్నికలలో తెదేపా అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే వైకాపా తెరాస అభ్యర్ధికి మద్దతు తెలిపింది. అయితే అది చాలా పెద్ద పొరపాటని తెదేపా ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టిన తరువాత అర్ధమయినట్లుంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సమస్యలు సృష్టిస్తూ,రాష్ర్ట ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నతెరాస ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని తెదేపా నేతలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడవలసిన వ్యక్తి పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజలెన్నుకొన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెరాస రాయబారిగానే జగన్ డిల్లీ వెళ్లి కేంద్రానికి పిర్యాదు చేసారని ఆరోపించారు. గత పది రోజులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వైకాపా నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియాలో చేస్తున్న ప్రచారం గమనించినట్లయితే, తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేవిగా కనబడుతున్నాయి.   తెదేపా నేతలు తనపై చేస్తున్న విమర్శలు, ఆరోపణల కారణంగా వైకాపా పట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించినందునే రాష్ట్రంలో తన పార్టీకి మరింత నష్టం కలగకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడేందుకు తను కూడా పోరాడుతున్నాని ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి చాలా హడావుడిగా కేంద్రానికి లేఖ వ్రాసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఈ లేఖ వ్రాయడానికి మరో కారణం కూడా కనబడుతోంది. త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రప్రజలను ఆకట్టుకోవాలనే ఉదేశ్యం ఉండి ఉండవచ్చును. తెరాసకి, తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్లుగా బలమయిన సంకేతాలు పంపినప్పుడే హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లను సంపాదించుకోగలమని వైకాపా భావిస్తున్నట్లుంది.   కనుక ఇది కేవలం ఆంద్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిందే తప్ప నిజంగా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతోనో, లేకపోతే ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకో వ్రాసింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా తెలంగాణా ప్రభుత్వం చేప్పట్టిన పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే రేపటి నుండి తెలంగాణాలో వైకాపా నేతల చేత కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాల్సి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణాలో వైకాపా పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరగడం ఖాయం. కనుక ఆ పని చేయక పోవచ్చును.   ఒకవేళ చేయించినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఆంద్రప్రదేశ్ లో పార్టీని కాపాడుకోవడమే తప్ప తెలంగాణాలో పార్టీని కాదు. తెలంగాణా గడ్డపై అడుగు పెట్టడానికి కూడా సాహసించలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి, ఆ రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ పార్టీని బలపరుచుకొనే ఆలోచన చేస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కనుక ఆంధ్రాలో పార్టీని కాపాడుకొనేందుకు తెలంగాణాలో పార్టీ నష్టపోయినా ఆయనకి అదేమీ పెద్ద తీవ్రమయిన సమస్య కాదు. కాబోదు. కనుకనే ఆయన ఈవిధంగా లేఖ వ్రాయగలిగారని భావించాల్సి ఉంటుంది. వైకాపా ఈ విధంగా ద్వంద వైఖరితో వ్యవహరిస్తే చివరికి నష్టపోయేది ఆ పార్టీయేనని గ్రహిస్తే మంచిదేమో? 

అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసిరితే...

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన ప్రభుత్వంలో చాలమంది మంత్రులు ఓటుకు నోటు కేసు పట్ల తమకు ఎటువంటి ఆసక్తి, తీరికా లేవని ఒకపక్క చెపుతూనే మరోపక్క ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు...ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు......ఆధారాలు చాలా ఉన్నాయి... ముందుంది ముసళ్ళ పండగ...అంటూ మాట్లాడటం గమనిస్తే వారి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ ఈవిషయంలో కేంద్రం జోక్యం చేసుకొనకపోతే తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారమే ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ కేసులో రేవంత్ రెడ్డితో సహా మిగిలిన ఇద్దరినీ కూడా ఎసిబి ప్రశ్నించడం పూర్తయింది. రేవంత్ రెడ్డిపై పిర్యాదు చేసిన నామినేటడ్ యంయల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ వాగ్మూలం తీసుకొని తదుపరి చర్యలకు ఎసిబి ఉపక్రమించవచ్చును. అదే జరిగితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ జరిగి అది వాంచనీయమయిన సంఘటనలకు లేదా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ ఒక ఎత్తయితే ఇక ముందు జరుగబోయే పరిణామాలు మరొక ఎత్తుగా భావించవచ్చును.   ఈ వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులను పిర్యాదు చేసారు. గవర్నర్ కూడా దీనిపై తన నివేదిక కేంద్రానికి సమర్పించారు. ఈ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన కూడా చాలా హడావుడిగా డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయడం తెదేపా చేస్తున్న ఆరోపణలను నిజమని రుజువు చేస్తున్నట్లుంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయాలని భావిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంతవరకు ఆ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకోలేదు. హైదరాబాద్ పై సర్వాధికారాలు ఉన్న గవర్నర్ కి కూడా ఆ విషయం తెలియకుండా మొత్తం వ్యవహారం చాలా గుట్టుగా నడిపించారు. ఒకవేళ ఆ విషయం ముందుగా గవర్నర్ కి తెలిపి ఆయన అనుమతి తీసుకొని ఉండి ఉంటే, ఆ సంగతి ఆయనైనా కేంద్రానికి తెలియజేసి ఉండాలి. కానీ టీవీలలో ఈ సంచలన వార్త బయటపడేవరకు గవర్నర్ కి కూడా ఆ విషయం గురించి తెలియదంటే చాలా ఆశ్చర్యమే!   ఇంత జరిగిన తరువాతయినా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి చర్యలకు ఉపక్రమించి ఉండి ఉంటే అప్పుడు ఎవరూ అనుమానించేవారు కాదు. కానీ ఇంత జరిగినా, ఇంకా చాలా జరుగబోతున్నా కూడా కేసీఆర్ నేటికీ కేంద్రానికి తెలియజేసి దాని అనుమతి తీసుకోవాలనుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రప్రభుత్వానికి తెలియజేయకుండా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేందుకు దోహదపడే ప్రమాదకరమయిన నిర్ణయాలు తీసుకొనేందుకు కేసీఆర్ సిద్దపడటం చూస్తుంటే ఆయన కేంద్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఖాతరు చేస్తున్నట్లు లేదు. ఇటువంటి ఆలోచనలు, పోకడలు అన్నీ కేవలం రాజరికవ్యవస్థలలో మాత్రమే కనబడతాయి తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలలో తావు లేదు. బహుశః ఆ సంగతి ఆయన అనుభవపూర్వకంగానే తెలుసుకొంటారేమో?   ఇంతవరకు జరిగిన సంఘటనల గురించి గవర్నర్ తెలుసుకో(లే)కపోవడం తప్పేనని చెప్పవచ్చును. కానీ ఇకపై జరుగబోయే సంఘటనల గురించయినా తెలంగాణా ప్రభుత్వం నుండి పూర్తి సమాచారం రప్పించుకొని, వాటి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, ఎటువంటి విపరీత పరిణామాలు ఏర్పడకుండా గవర్నర్ తగు చర్యలు చేప్పట్టవలసి ఉంటుంది. లేకుంటే అది ఆయన వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డితో నిన్న సమావేశం కావడం గమనిస్తే, తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారం ముందుకే సాగేందుకు నిశ్చయించుకొన్నందున, హైదరాబాద్ జంట నగరాలలో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అనుమానం కలుగుతోంది.   ఈ వ్యవహారం ఆ రెండు పార్టీలకు, వ్యక్తులకు మధ్య ఉన్న రాజకీయ వైషమ్యాల కారణంగా జరుగుతున్నదే అయినా తెలంగాణా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల వలన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజల మధ్య ఎన్నటికీ పూడ్చలేని ఒక అగాదం సృష్టించడం తధ్యం. తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నంత కాలమే తెలంగాణాలో తెరాస ఎదురులేకుండా నిలబడగలుగుతుంది. అది పోయిన మరుక్షణం తెదేపాతో సహా అన్ని ఇతర పార్టీలకు సమాన అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణా సెంటిమెంటును మళ్ళీ బలపరిచేందుకే దోహదపదేవిగా ఉన్నాయని చెప్పవచ్చును. ఈ వ్యవహారంలో తెదేపా నేతలు తమ తెరాస ప్రభుత్వంపై ఎంతగా ఎదురు దాడిచేస్తే దాని వలన వారిపట్ల తెలంగాణా ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఆలోచన ఇందులో ఇమిడి ఉన్నట్లు కనబడుతోంది. బహుశః అందుకే కేసీఆర్ ఇంత రిస్క్ తీసుకొంటున్నారేమోననే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.   రాజకీయ పార్టీలు, వాటి నేతలు అందరూ కూడా అద్దాల మేడలో కూర్చొన్నట్టి వాళ్ళే! ఈ చిన్న సంగతి గ్రహించకుండా అవకాశం దొరికింది కదాని ఇతరుల మీద రాళ్ళు విసిరి ఆనందిద్దామనుకొంటే ఆ ఆనందం తాత్కాలికమే అవుతుంది. ఏదో ఒకనాడు తమ అద్దాలమేడ మీది ఎదుటవాళ్ళు కూడా రాళ్ళు విసిరే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే ఇటువంటి సాహసాలు చేయబోరు.

కొరివితో తల గోక్కున్న కేసీఆర్

తెలుగుదేశం పార్టీని అప్రతిష్ఠపాలు చేసి రాజకీయంగా లాభం పొందాలని అనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొరివితో తల గోక్కున్నారా? తెలుగుదేశం నాయకులను కేసులలో ఇరికించే విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ప్రభుత్వం తాను తీసిన గోతిలో తానే పడిందా? చెరపకురా చెడేవు అనే సామెతకు టీఆర్ఎస్ మరో ఉదాహరణగా నిలవబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారి నుంచి వస్తోంది. కేసీఆర్ చాలా తెలివైన వారని, తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టగల నేర్పరి అని మొన్నటి వరకూ అనుకున్నవారు కూడా ఇప్పుడు కేసీఆర్ ఇరుక్కుపోయిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఎరక్కపోయి ఇరుక్కపోవడం కాకుండా... అన్నీ ఎరిగిన వ్యక్తి ఇలా అడ్డంగా ఇరుక్కుపోవడం చాలా వెరైటీగా వుంది.  ఓటుకు నోటు వ్యవహారంలో ఏ కోణంలో చూసినా తెలుగుదేశం పార్టీకి గానీ,  ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ ఎలాంటి నష్టం జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంలో చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన అధికార పార్టీ మాత్రం అన్నిరకాలుగా ఇరుక్కుపోయింది. మొన్నటి వరకూ మాదే పైచేయి అన్నట్టుగా వున్న అధికార టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అయితే వారి అత్యుత్సాహం కారణంగా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది. కేసులు పెట్టి చంద్రబాబును ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ ఇప్పుడు తానే ఇరుకున పడింది. రేవంత్ మీద జరిపిన స్టింగ్ ఆపరేషన్‌కి న్యాయస్థానాల్లో విలువ లేదని పలువురు న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్లకి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టును ఇచ్చిన తీర్పును కూడా వారు ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తిని లంచం ఇచ్చేలా ప్రేరేపించి, ఆ వ్యవహారాన్ని చిత్రీకరించి, అతన్ని దోషిగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడం అనేది నిష్ప్రయోజనం అనేది స్పష్టంగా వుంది.  అలాగే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన సంభాషణ అన్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మీడియా ప్రచారం చేస్తున్న ఆడియో టేపులకు కూడా ఎంతమాత్రం విలువలేదు.  అసలు  ఆ టేపుల్లో ఉన్న సంభాషణలో కొంపలు మునిగిపోయే అంశమే లేదు. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం మెడకే పాములా చుట్టుకుంది. ట్యాపింగ్ వ్యవహారం గతంలో ప్రభుత్వాలనే కూల్చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖతోగానీ, టెలికం శాఖతోగానీ విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం ‘‘మేం ఏపీ సీఎం సంభాషణలను రికార్డ్ చేశాం’’ అని సగర్వంగా ప్రకటించుకున్న టీఆర్ఎస్‌కి వెన్నులో చలి పుట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ విషయంలో టీఆర్ఎస్ చేసిన యాక్షన్‌కి ఇప్పుడు భారీ రియాక్షన్ వస్తోంది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో తమకు రక్షణ లేని పరిస్థితి వుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో వున్న సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పోలీసు, శాంతిభద్రతల అంశాలు గవర్నర్‌కి అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  సంవత్సర కాలంగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో వుంది. ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్‌ని గవర్నర్ చేతిలో పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అదే జరిగితే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శరాఘాతం తగిలినట్టే. రాజధానిలో కీలకమైన అంశాలు గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేయగలిగిందే ఏమీ వుండదు. ఈ ఏడాది చివర్లో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతూ, ఏ అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఆయువుపట్టు మీద దెబ్బలా మారే ప్రమాదం వుంది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు విషయంలో చాలా సానుకూలంగా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చంద్రబాబుకు అండగా నిలిచే అవకాశాలు నూటికి నూరుశాతం వుంది. కేంద్ర ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన స్నేహధర్మాన్ని విడిచిపెట్టని చంద్రబాబు మీద కేంద్రానికి గౌరవం వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం చంద్రబాబును ఆదుకోవడానికి ముందుకు రావడం అనేది సహజ పరిణామం. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు కోరినట్టుగా హైదరాబాద్‌ అధికారాలను గవర్నర్‌కి అప్పజెప్పడం అనేది బీజేపీకి కూడా ఉపయోగపడే అంశం. తన రాజకీయ ప్రత్యర్థులైన టీఆర్ఎస్, మజ్లిస్‌లను ఒకేసారి దెబ్బతీయడానికి దీనిద్వారా మేలు జరుగుతుంది. గవర్నర్‌కి అధికారాలు అప్పగించడంతోపాటు ఇప్పుడున్న గవర్నర్‌ నరసింహన్‌ని తొలగించి, తమకు అనుకూలంగా వున్న గవర్నర్‌ని కేంద్రం నియమించిందంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్, మజ్లిస్ కూటమి చేతులు ఎత్తేయడం మినహా చేయగలిగిందేమీ వుండదు. రాజధానిలోనే టీఆర్ఎస్ తన పట్టును పూర్తిగా కోల్పోయిందంటే, ఒక విధంగా అది ఆ పార్టీ పతనానికి మొదటి మెట్టు అయ్యే ప్రమాదం వుంది. మరి ఇలాంటి పరిస్థితిలోకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైనా నెట్టారా? దీన్నే స్వయంకృతాపరాధం అంటారు. ఆ అపరాధానికి ఏ స్థాయిలో మూల్యం చెల్లిస్తారనేది వేచి చూడాల్సిన విషయం.

మయన్మార్ లో భారత సైనిక చర్య పాక్ ఉగ్రవాదులకు హెచ్చరిక వంటిదే

  భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా తనంతట తానుగా ఇతరదేశాల మీద దండయాత్రలు, యుద్దాలు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే భారతదేశానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదు. అనంతమయిన భోగ భాగ్యాలకు, సిరిసంపదలకు, పాడిపంటలకు భారతదేశం నిలయమయిన కారణంగా దానిపైన శతాబ్దాల తరబడి అన్యదేశస్తులు దాడులు చేసి అపారమయిన సంపదను అందినకాడికి దోచుకొనిపోయారు. బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి పొందిన తరువాత కూడా భారత్ అదే స్పూర్తిని కొనసాగిస్తూ వస్తోంది. వీలయితే ఇరుగు పొరుగు దేశాలకు యధాశక్తిన సహాయపడాలని ప్రయత్నించేదే తప్ప ఎన్నడూ దాడులకు పాల్పడలేదు. చైనా, పాక్ లతో జరిగిన రెండు యుద్దాలు మనపై రుద్దబడినవే తప్ప స్వయంగా యుద్దానికి దిగలేదు.   స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక దశాబ్దాలపాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇరుగు పొరుగు దేశాల పట్ల చాలా మెతకవైఖరి అవలంభించడంతో భారత్ పై ఆధారపడే నేపాల్ వంటి చిన్న చిన్న దేశాలకు సైతం భారత్ అంటే చాలా చులకనయిపోయింది. శాంతి మంత్రం పటిస్తూ కూర్చొన్న భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు గత మూడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తూ వేలమంది పొట్టనపెట్టుకొన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గట్టిగా ఖండించి చేతులు దులుపుకొనేదే తప్ప ఏనాడు పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పే సాహసం చేయలేకపోయింది.   కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పటిన తరువాత ఇరుగుపొరుగు దేశాలతో చక్కటి స్నేహ సంబంధాలు పెంచుకొనేందుకు ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తూనే మరోవైపు భారతదేశంతో చెలగాటమాడుతున్న పాకిస్తాన్ పట్ల చాలా కటినమయిన వైఖరి అవలంభిస్తున్నారు. అయినప్పటికీ పాక్ ధోరణిలో ఎటువంటి మార్పు మాత్రం కనబడలేదనే చెప్పవచ్చును. కానీ భారత సైనికదళాలు పొరుగు దేశమయిన మయన్మార్ లో నిన్న తెల్లవారు జామున చేప్పట్టిన సైనికచర్య పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక వంటిదేనని చెప్పవచ్చును.   నాగా తీవ్రవాదులు జూన్ 4వ తేదీన మణిపూర్ లో 18 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకొన్నప్పుడు, వారిలో ఏ ఒకరినీ కూడా ప్రాణాలతో విడిచిపెట్టబోమని హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ చెప్పారు. వారు భారత సరిహద్దుకి అవతల మయన్మార్ లో దాగి ఉన్న సంగతి తెలియగానే వారందరినీ అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఈయడంతో భారతదళాల మయన్మార్ భూభాగంలో ప్రవేశించి తమ సహచరులను పొట్టన్నపెట్టుకొన్న నాగా ఉగ్రవాదులందరినీ హతమార్చి తిరిగి వచ్చేయి. భారత దళాలు ఉగ్రవాదులను హతమార్చేందుకు ఈవిధంగా పొరుగుదేశంలోకి ప్రవేశించిన దాఖాలాలు లేకపోవడంతో ఈ చర్యతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇకపై ఎవరయినా భారత్ పై దాడులు చేయాలని ప్రయత్నిస్తే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని భారత్ పాక్ లో తలదాచుకొన్న ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపినట్లయింది.   కానీ ఏడాది కాలంగా పాక్ ఉగ్రవాదులు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలో దాడులు చేస్తూనే ఉన్నారు. పాక్ భద్రతా దళాలు సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముఫ్తీ మొహమ్మద్ సయ్యీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత నుండే ఆ రాష్ట్రంలో పాక్ జెండాల రెపరెపలాడటం, భారత వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. అటువంటి ప్రభుత్వంతో బీజేపీ భాగస్వామిగా ఉండటాన్ని దేశ ప్రజలెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ రాన్రాను ఆ రాష్ట్రంలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతుంటే మోడీ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోందని యావత్ భారతీయలు మదనపడుతున్నారు. మోడీ ప్రభుత్వం తగిన సమయం, సందర్భం కోసమే వేచి చూస్తోందని మరి కొందరు భావిస్తున్నారు.   ఏమయినప్పటికీ నాగా ఉగ్రవాదులతో వ్యవహరించి విధంగానే మోడీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని అందరూ కోరుకొంటున్నారు. అయితే భారత సేనలు పాక్ ఉగ్రవాదులను వెంటాడుతూ పాక్ భూభాగంలోనికి ప్రవేశించినట్లయితే, ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నందున పాక్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తే అది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. అంతేకాక ప్రపంచ దేశాల నుండి భారత్ విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చుననే ఉద్దేశ్యంతోనే భారత్ వెనక్కి తగ్గవలసి వస్తోందేమో? కానీ ఏదో ఒకరోజున పాక్ ఉగ్రవాదులకు కూడా భారతదళాలు ఇటువంటి గుణపాఠమే చెప్పే అవకాశాలున్నాయని మయన్మార్ లో జరిపిన మిలటరీ ఆపరేషన్ స్పష్టం చేస్తోంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు....

  రాష్ట్ర విభజన అనంతరం ఇంతవరకు ఆంద్రా, తెలంగాణా ప్రభుత్వాలు మధ్య నిత్యం ఏదో ఒక అంశం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి వ్యవహారంతో అది కాస్తా ముదిరి పాకాన పడినట్లయింది. అది ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారడంతో చివరికి ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. ఇంతవరకు ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగానే జరుగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరి పరిధులలో వారే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిన్న గవర్నర్ మరియు లక్షలాది ప్రజల సమక్షంలోనే ప్రకటించినందున, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలుగజేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చంద్రబాబు నాయుడుని రక్షించడం ఆ బ్రహ్మతరం కూడా కాదని ప్రకటించిన కేసీఆర్ ఒకవేళ ఆయనపై కేసు నమోదు చేసి విచారించాలని పట్టుబడితే గవర్నర్ దానిని కాదనలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అదే జరిగితే ఇరు రాష్ట్రాల మధ్య ఊహించని అనేక సమస్యలు తలెత్తకమానవు. కనుక ఈ సమస్యను ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా ఆయన పరిష్కరించవలసి ఉంటుంది.   పదేళ్ళ పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ నగరంలో ఇటువంటి సమస్యలు, ఘర్షణలు చెలరేగకుండా చూడవలసిన బాధ్యత గవర్నర్ దే. కనుక కేంద్ర ప్రభుత్వం ముందుగా ఆయననే ఇందుకు సంజాయిషీ కోరవచ్చును. కానీ అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే దీనిని పరిష్కరించవలసి ఉంటుంది. లేకుంటే ఆ ప్రభావం నేరుగా బీజేపీ పడే అవకాశం ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా కూడా భాగస్వామిగా ఉన్నందున ఈవిషయంలో కేంద్రం చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అలాగని తెదేపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంటే అది తెరాసకు ఆయుధంగా మారుతుంది. దానిని ఉపయోగించుకొని తెలంగాణాలో బీజేపీని దెబ్బ తీసే ప్రమాదం ఉంది.   ఒకవేళ తెరసాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నట్లయితే, ఇప్పటికే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం వంటి అనేక హామీలను అమలు చేయనందుకు మోడీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రజలు, బీజేపీపై ఆగ్రహించే ప్రమాదం ఉంది. కనుక తెదేపా, తెరాస ప్రభుత్వాలమధ్య, ముఖ్యమంత్రుల మధ్య మొదలయిన ఈ గొడవ ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు బీజేపీ పీకకి చుట్టుకొన్నట్లయింది. ఒకవేళ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పినట్లు “చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కేంద్రం ఊరుకొంటే ఇది ఇరు రాష్ట్రాల మధ్య చాలా తీవ్రమయిన సమస్యలని సృష్టించే ప్రమాదం ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుందేమో?

తెదేపా ప్రభుత్వ ఏడాది పాలనపై ఓ చిన్న సమీక్ష

  తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొంది. కనుక ఈ ఏడాది పాలనపై సమీక్ష జరపవలసిన సమయం ఇది. రాష్ట్ర విభజన కారణంగా అస్తవ్యస్తంగా తయారయిన పరిపాలనను, ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. ఆ కారణంగానే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా బలమయిన ప్రభుత్వం ఒకటి ఉందనే భావన ప్రజలలో నెలకొని ఉంది.   కానీ ఏడాది గడుస్తున్నా హైదరాబాద్ నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి తరలిరాలేకపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ విజయవాడలో ఏర్పాటు చేసుకొన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కనుక క్రమంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా విజయవాడకు తరలిరాక తప్పదు.   ఇక రాష్ట్ర విభజన కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలతో బాటు, విద్యుత్, ఆర్ధిక, రాజకీయ, పరిపాలనాపరమయిన అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా వివిధ అంశాలలో తెలంగాణా ప్రభుత్వంతో ఏర్పడుతున్న గొడవల కారణంగా రాష్ట్రాభివృద్ధికి కేటాయించవలసిన విలువయిన సమయం హరించుకుపోతోంది. అవికాకుండా రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసకు అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ, అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్న వైకాపాను కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి వస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నాలుగు నెలలలోనే రాష్ట్రంలో కరెంట్ కోతలనేవీ లేకుండా చేయగలిగారు.   అదే విధంగా రాజధాని నిర్మాణం విషయంలో కూడా ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా వాటినన్నిటినీ ఎదుర్కొంటూ దృడంగా ముందుకే సాగుతున్నారు. ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల కారణంగా కొంత వెనుకబడినట్లే ఉన్నారు. కానీ రాష్ట్రంలో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కనుక ఇచ్చిన హామీలన్నిటినీ ఒకటొకటిగా అమలుచేయవచ్చును. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఐఐటి. ఐఐఐటి, ఐఐయం, నిట్ వంటి ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. వాటికి శాశ్విత భవనాలు ఏర్పాటు చేసేవరకు వేచి చూడాలను కోకుండా తాత్కాలికంగా వేరే ఉన్నత విద్యాసంస్థలకు చెందిన భవనాలలో ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు మొదలుపెట్టాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం, రాష్ట్రంలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా ప్రశంశనీయం. రాష్ట్ర ప్రభుత్వం తలపెడుతున్న ఈ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుండటం చాలా హర్షణీయం. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో జరుగుతున్నా ఆలస్యం, కొనసాగుతున్న సందిగ్ధత వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇబ్బందిపడవలసి వస్తోంది. త్వరలోనే రైల్వే జోన్ మరియు ప్రత్యేక హోదాపై కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతోంది.   రాష్ట్రంలో పరిపాలన కూడా పూర్తిగా గాడిన పడినట్లే కనబడుతోంది. కాకపోతే మంత్రులలో కొంతమంది మాత్రమే మీడియా ముందుకు వస్తుంటే మిగిలిన వారు పనిచేయడం లేదనే ఒక అపోహ ప్రజలలో నెలకొని ఉంది. కనుక మంత్రులు అందరూ కూడా విధిగా నెలకి ఒక్కసారయినా మీడియా ముందుకు వచ్చి తమ తమ శాఖలలో జరుగుతున్న ముఖ్యమయిన పనులు గురించి, రాష్ట్రాభివృద్ధి కోసం తాము చేస్తున్న కృషి గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిది.   రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర పరిస్థితి చూసి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందిన మాట వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న మంచి పనితీరు, పట్టుదల కారణంగా కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలలో ఇపుడు ఆ నిరాశ నిస్పృహలు దూరమవడమే కాకుండా, వేగంగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. బహుశా రానున్న నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితి మరింత మెరుగపడవచ్చును. అయితే అందుకు ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ సహకారం, ప్రభుత్వంపై నమ్మకం కూడా చాలా అవసరం. అప్పుడే ప్రభుత్వం దైర్యంగా, పూర్తి ఆత్మ విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అవగాహన, అంచనా ఏర్పడింది. ఇక మిగిలిన నాలుగేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసి చూపించ గలిగితే చంద్రబాబు నాయుడు సమర్ధత, కార్యదీక్షపై అపార నమ్మకంతో ఆయనకు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలు కూడా తాము సరయిన నిర్ణయమే తీసుకొన్నందుకు చాలా సంతోషిస్తారు.

అమరావతికి భూమిపూజతో ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం

  ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట విభజన తరువాత రాజధాని లేకపోయినందుకు రాష్ట్ర ప్రజలు అందరూ బాధపడుతుంటే కాంగ్రెస్, వైకాపాలు మాత్రం అందుకు ఏమాత్రం చింతించకపోగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి అడుగడుగునా అడ్డుపడుతూ అవరోధాలు సృష్టించడం చాలా శోచనీయం. ఒక మహత్కార్యానికి వారు ఈవిధంగా అవరోధాలు సృష్టించడం వలన చరిత్రహీనులుగా మిగిలిపోతే, వారు సృష్టిస్తున్న ఆ అవరోధాలన్నిటినీ దాటుకొంటూ రాజధాని నిర్మాణం చేయగలిగితే చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో శాస్వితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడటం ఖాయం. అందుకే ఆయన ఇటువంటి సువర్ణావకాశం తనకే దక్కినందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు.   ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటినన్నిటినీ దాటుకొంటూ ముందుకు సాగి ఆయన ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్విగ్నంగా పూర్తి చేసారు. సంకల్పం మంచిది, గొప్పది అయితే పైనున్న భగవంతుడు కూడా తోడ్పడతాడని నిరూపిస్తూ భూమి పూజ జరుగుతున్న ప్రాంతంలో తేలికపాటి వర్షం పడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. రాజధాని నిర్మాణ పనులు అక్టోబర్ 22నుండి మొదలుపెట్టి ఆపకుండా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే దీక్ష, పట్టుదలతో ఆంద్రప్రదేశ్ ప్రజలందరూ గర్వపడే విధంగా రాజధాని నిర్మించి చూపుతానని అన్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీలను నిర్మించి అక్కడి ప్రజలకు అక్షయపాత్ర వంటి ఆర్ధిక వనరును సృష్టించినట్లే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాజధానిని నిర్మించి, అందుకోసం భూములు ఇచ్చిన రైతులకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ ప్రయోజనం కలిగించే విధంగా ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మిస్తానని ఆయన తెలిపారు.   ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయ సహకారాలు అందజేస్తుందని, ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకొనవసరం లేదని కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ హామీ ఇచ్చారు.   రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా కొంతమంది వెండి కలశాన్ని, వెండి పూత పూసిన తాపీనీ, గమేళాని బహూకరించగా, కొంతమంది రైతులు రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. అనేకమంది స్థానిక రైతుల పిల్లలు సైతం తాము దాచుకొన్న డబ్బుని రాజధాని నిర్మాణానికి విరాళంగా అందించడం చూస్తే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎంత అర్ధరహితమో తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రతిపక్షాలు పాలుపంచుపోకపోయినా పరువాలేదు కానీ రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తమను రాష్ట్ర ప్రజలు క్షమించబోరనే సంగతి గ్రహిస్తే వారికే మంచిది.   ఇంతవరకు ఎదురయిన అవరోధాలు ఒకటొకటిగా తొలగిపోతున్నాయి. వచ్చే నాలుగేళ్ళలోనే ప్రధాన రాజధాని నగరమయిన అమరావతికి రూపు రేఖలు కల్పిద్దామని ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. కానీ రాజధానికి పూర్తిగా రూపురేఖలు రావడానికి కనీసం మరొక రెండు దశాబ్దాలు పట్టవచ్చును. కనుక మున్ముందు అనేక సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంటుంది. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే అకుంఠీత దీక్షతో, పట్టుదలతో తనకు ఎదురయిన సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగగలిగినప్పుడే ఆంధ్రుల కల అమరావతి సాకారమవుతుంది.

మ్యాగీ తప్ప దేశంలో అన్నీ సురక్షితమయినవేనా?

     సంప్రదాయ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే భారతీయులు గత మూడు దశాబ్దాలుగా క్రమంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్చినం అయ్యి వాటి స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడటం, ఆ కారణంగా భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేయవలసి రావడం, జీవన ప్రమాణాలు పెరగడం, యాంత్రిక జీవనం, సమాజ ఆలోచన విధానంలో పెను మార్పులు చోటు చేసుకోవడం వంటి అనేక కారణాల వలన భారతీయుల ఆహారపుటలవాట్లు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ కారణంగానే మ్యాగీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్స్, చిప్స్ కుర్ కురేలు వంటి నోరూరించే విదేశీ ఆహార ఉత్పత్తులు భారతదేశంలో ప్రవేశించగలిగాయి.   తమ ఆకర్షణీయమయిన వాణిజ్య ప్రకటనలతో క్రమంగా భారతీయలను వశపరుచుకొని ఏటా వేల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆహార ఉత్పత్తులకు బాగా అలవాటుపడిపోయారు కనుక వారి వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లు సాగిపోతోంది. కానీ దేశంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడి తినే మ్యాగీ నూడిల్స్ లో పరిమితికి మించి సీసం, మోనో సోడియం గ్లుటామేట్ అనే రసాయనం కూడా ఉన్నట్లు పరీక్షలలో తేలడంతో ప్రజలు నివ్వెరపోవలసివచ్చింది. దానితో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఒక్కో రాష్ట్రం మ్యాగీపై నిషేధం విధించడం మొదలుపెట్టాయి. ఒక్క మ్యాగీపైనే కాకుండా సన్ఫీస్ట్, యప్పీ వంటి అనేక బ్రాండ్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు నుండి తెలంగాణా రాష్ట్రం కూడా మ్యాగీపై నిషేధం విధించింది.   అయితే కేవలం వివిధ కంపెనీలు తయారుచేసే నూడుల్స్ లో మాత్రమే హానికరమయిన రసాయనాలున్నాయనట్లు మిగిలిన ఆహార ఉత్పత్తులన్నీ చాలా స్వచ్చమయినవి, ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి అన్నట్లుంది ప్రభుత్వాల వ్యవహారం చూస్తుంటే. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ అధికంగా తినే, త్రాగే చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి అనేక రకాల ఆహార పదార్దాలలోనే కాకుండా కాఫీ, టీ, వంట నూనెలు, టూత్ పేస్టులు, మహిళలు అధికంగా వాడే మేకప్ క్రీములు, పౌడర్ల వరకు ప్రతీ దానిని ఇంతే క్షుణంగా పరిశీలిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది.   ఇక దేశంలో ఉన్న లక్షలాది చిన్న పెద్ద హోటళ్ళలో ఆహార పదార్ధాల నాణ్యత గురించి పట్టించుకొనే నాధుడే లేడు. ఇక రోడ్ల మీద దుమ్ము దూళి, మురికి కాలువలు పక్కన తయారు చేసే పానీ పూరీలు, నూడుల్స్, ఛాట్, జిలేబీ వంటి ఆహారపదార్ధాలు తిని దేశంలో ఎన్ని వేలమంది అనారోగ్యానికి గురవుతున్నారో ఎవరికీ తెలియదు.   డిల్లీలో గాలి ఎంతగా కలుషితమయిపోయింది అంటే అది పీల్చడానికి కూడా పనికిరాదని ఇటీవల ఒక నివేదిక వెలువడింది. ఒక్క డిల్లీలోనేకాదు దేశ వ్యాప్తంగా పల్లె పట్టణం నగరం అనే తేడా లేకుండా పీల్చే గాలి, త్రాగే నీళ్ళు , నివసించే భూమి అన్నీ కలుషితం చేసుకొంటున్నాము. వీటన్నిటినీ అరికట్టడానికే అనేక చట్టాలున్నాయి. కానీ అవన్నీ కొంతమందికి ఉద్యోగాలు సృష్టించేందుకే ఏర్పటు చేసుకొనట్లున్నాయి తప్ప వాటి వలన మరే ప్రయోజనం కనబడటం లేదు. అందుకే లక్షల కోట్లు ఖర్చు చేసి హుస్సేన్ సాగర్ ని, గంగానదిని ప్రక్షాళన చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. వేల రూపాయలు ఖర్చు చేసి ఇంట్లోనే బోర్లు వేసుకొన్నా ప్రజలు దైర్యంగా ఆ నీళ్ళు కూడా త్రాగలేక కొనుకొని త్రాగవలసిన దుస్థితి నెలకొంది.   దేశంలో ఇంతగా ఆహారం, నీళ్ళు, గాలి, భూమి, వాతావరణం అన్నీ చాల వేగంగా కలుషితమయిపోతున్నా పట్టించుకొనే నాధుడే లేదు. కానీ మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ ఒక ప్రభుత్వాన్ని చూసి మరొకటి మ్యాగీపై నిషేధం విధిస్తూ చాలా హడావుడి చేస్తున్నాయి. మ్యాగీలో హానికర రసాయనాలున్నట్లయితే మరి గత మూడు దశాబ్దాలుగా దానిని ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఒకవేళ ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన మ్యాగీ ఉత్పత్తిలోనే అటువంటి హానికర పదార్ధాలున్నట్లు కనుగొని ఉంటే, దేశంలో వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఆహార పదార్ధాలన్నీ ప్రజలు ఉపయోగించేందుకు యోగ్యమయినవేనా? అనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు.   ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్ గా అవతరించిన భారతదేశంపై అనేక అంతర్జాతీయ కంపెనీలు కన్ను వేశాయనే సంగతి పెద్ద రహస్య విషయమీ కాదు. ఆ కార్పోరేట్ సంస్థల మధ్య తెర వెనుక జరుగుతున్న పోరాటాల కారణంగానే మ్యాగీకి ఈపరిస్థితి ఎదురయి ఉండవచ్చును తప్ప అందులో హానికరమయిన రసాయనాలున్న కారణంగా మాత్రం దానిపై ఈ అత్యవసర యుద్ద ప్రకటన జరిగి ఉండకపోవచ్చుననే అనుమానాలున్నాయి. కనుక వాటి మధ్య రాజీ కుదిరిననాడు, ఈ కార్చిచ్చు ఎంతవేగంగా ఎగిసిపడిందో అంతకంటే వేగంగానే చల్లారిపోవచ్చును. అప్పుడు మళ్ళీ “మ్యాగీ చాలా రుచికరమయినదే కాదు చాలా ఆరోగ్యకరం కూడా” అనే టీవీలలో ప్రకటనలు చూస్తూ అందరూ మ్యాగీని తింటారని ఖచ్చితంగా చెప్పవచ్చును.  

తెలంగాణాలో వైకాపా నేతలను పావులుగా వాడుకొంటున్నారా?

  రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాను విడిచిపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశించి అక్కడ బలపడేందుకు ప్రయత్నిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం రాష్ట్ర వైకాపా నేతలు తెరాస ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. ఆ పార్టీ నేత షర్మిల రెండు సార్లు పరామర్శయాత్రలు చేసారు. మళ్ళీ ఈనెల 9నుండి మూడవసారి యాత్రలకి బయలుదేరుతున్నారు. కానీ మొన్న జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెరాసకు వైకాపా మద్దతు ఇవ్వడంతో రాష్ట్ర నేతలు కంగు తిన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు యం.యల్యేలను తెరాస తన వైపు త్రిప్పుకొన్నప్పుడు సహజంగా ఆగ్రహం కలగాలి. కానీ అందుకు ఏ మాత్రం స్పందించకపోగా తిరిగి ఆ పార్టీ అభ్యర్ధికే ఓటు వేయడంతో వైకాపాకు నిజంగానే తెలంగాణాలో బలపడాలనే ఉద్దేశ్యం ఉందా...లేక రాష్ట్రంలో వైకాపా నేతలను ఆ రెండు పార్టీలు కలిసి తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకొంటున్నాయా? అనే అనుమానం కలుగకమానదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం వలన రాష్ట్ర నేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు నటిస్తున్నట్లయింది. తెలంగాణా ప్రజలు వారి చిత్తశుద్ధిని శంఖించే పరిస్థితి ఏర్పడింది.   రెండు రాష్ట్రాలలో తెదేపా-బీజేపీలు కలిసి పనిచేస్తున్నట్లే, ఒకవేళ తెలంగాణాలో తెరాసతో కలిసి పనిచేయాలని వైకాపా భావిస్తే అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఒకవేళ చెప్పినా ఆ రెండు పార్టీలకు ప్రజలకు జవాబు చెప్పుకోగల దైర్యం ఉన్నట్లయితే ఎవరినీ పట్టించుకోనవసరం లేదు. కానీ తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తూ మళ్ళీ అవసరం పడినప్పుడు ఈవిధంగా మద్దతు ప్రకటించడం గమనిస్తే ఆ పార్టీకి తెలంగాణాలో బలపడాలని కాక వేరే ఇతర కారణాలు, ఉద్దేశ్యాలు ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది.   ఆ రెండు పార్టీలు తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీసేందుకే వైకాపాను తెలంగాణాలో ప్రవేశపెట్టి ఉండవచ్చును. అందుకే వైకాపా యం.యల్యేలను తెరాస తనవైపు త్రిప్పుకొన్నప్పటికీ ఆ పార్టీ అస్సలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణాలో ఎలాగయినా బలపడి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తున్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ యం.యల్యేలను తెరాస ఆకర్షించినప్పుడు దానిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా న్యాయపోరాటాలు కూడా చేస్తుండటం గమనిస్తే, ఈ విషయంలో వైకాపా ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్ధమవుతుంది.   ఇక మరో కారణం ఏమయి ఉండవచ్చంటే తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లు తెరాసకు పడతాయనే నమ్మకం లేదు. కనుక వారి ఓట్లను తెరాసకు బదలాయించేందుకే వైకాపాను తెలంగాణాలోకి రప్పించి ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. నల్గొండలో పరామర్శ యాత్ర పూర్తయిన తరువాత రంగారెడ్డి, హైదరాబాద్ లలో షర్మిల యాత్రలు చేస్తారని ఆ పార్టీ ప్రకటించడం గమనిస్తే, త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా పోటీ చేసి ఆంద్ర ప్రజల ఓట్లను తెరాసకు బదలాయించేందుకేనని అనుమానం కలుగుతోంది. మొన్న శాసనమండలి ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చినట్లే, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీ అభ్యర్ధుల ఓట్లను చీల్చి తెరాసకు ప్రయోజనం కలిగించవచ్చును. లేదా ఎన్నికల తరువాత తెరాసకు మద్దతు ప్రకటించవచ్చును.   వైకాపా ఉద్దేశ్యం తెలంగాణాలో బలపడి ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం కాదు కనుకనే తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాత్రలను వ్యతిరేకించినట్లుగా షర్మిల పరామర్శ యాత్రలను, తమ ప్రభుత్వంపై వైకాపా చేస్తున్న పోరాటాలను తెరాస పెద్దగా పట్టించుకోవడంలేదని భావించవలసి ఉంటుంది. తెలంగాణాపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి లేదు కనుకనే ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఇంత వరకు తెలంగాణాలో పర్యటించకుండా అప్పుడప్పుడు తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రలకు పంపిస్తున్నట్లున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.   ఆమె కూడా తన యాత్రలు రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నవి కావు కనుక తను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని చాలా లౌక్యంగా తెరాసపై ఎటువంటి విమర్శలు చేయకుండా వెళ్లి వచ్చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఓదార్పు యాత్రలు, రైతు భరోసా యాత్రలు చేస్తునప్పుడు మాత్రం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను, అది నడిపిస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎంత ఘాటుగా విమర్శిస్తారో అందరికీ తెలుసు. దీనిని బట్టి చూస్తే వైకాపాకు తెలంగాణాపై ఆసక్తి లేదని, తన రాజకీయ శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో నిలువరించేందుకు తెరాసకి సహాయపడేందుకే ఆ రాష్ట్రంలో తిరిగి ప్రవేశించినట్లు అనుమానం కలుగుతోంది. అయితే ఇది కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వేరే ఇతర అవసరాలు, ప్రయోజనాలు లేదా ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చును. కానీ ప్రధాన కారణం మాత్రం పైన పేర్కొన్నవే అయ్యి ఉండవచ్చును.   ఈ అనుమానాలే నిజమయితే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది వైకాపాను నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలే. ఇంతకు ముందు కొండా సురేఖ వంటి నేతలు వైకాపాను నమ్ముకొన్నందుకు తెలంగాణా ద్రోహులుగా అనేక అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని, తెలంగాణాలో పార్టీకి కొండంత అండగా నిలబడిన కొండా సురేఖ దంపతులతో సహా అనేకమంది తెలంగాణా నేతలను నడిరోడ్డు మీద విడిచిపెట్టేసి రాత్రికి రాత్రి తెలంగాణా నుండి ఆంధ్రాకు తరలిపోయిన విషయం అందరికీ తెలుసు. బహుశః మళ్ళీ మున్ముందు తెలంగాణాలో వైకాపా నేతలకు అటువంటి పరిస్థితే ఎదురయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా?

  తెలంగాణాలో జరిగిన రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటీ కాదు...రెండూ కాదు ఏకంగా 11 చార్జ్ షీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్, రేవంత్ వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుని కూడా ఏ-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేయడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. “త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది...మనకీ మళ్ళీ మంచిరోజులు వస్తాయి...మా పార్టీ అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాము,” అంటూ జగన్ తరచూ పలికే మాటల్లో ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన తాపత్రయం స్పష్టంగా కనబడుతోంది.   రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి పదవులు, అధికారం సంపాదించుకోవాలని ఆశ పడటం నేరమేమీ కాదు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు కూలిపోవాలని లేదా ఏదో విధంగా కూల్చివేయాలనుకోవడమే చాలా దారుణమయిన ఆలోచన. ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తానని బెదిరించి, చివరికి అన్నంత పనీ చేసి భంగపడిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః అటువంటి ప్రయత్నమే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నట్లున్నారు. అందుకే జగన్ తనకు అసలు సంబంధం లేని వ్యవహారంలో చాలా చురుకుగా కదిలి గవర్నర్ నరసింహన్ న్ని కలిసి, తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేసినట్లు అనుమానిస్తున్నారు.   జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే పార్టీని స్థాపించి విశ్వప్రయత్నాలు చేసారు. అయితే ఆయన తన నాయకత్వ లక్షణాలు చాటుకొని ప్రజలను మెప్పించి అధికారం కోసం ప్రయత్నించకుండా, తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని ఆకర్షణీయమయిన పధకాల గురించి చెప్పుకొని ఎన్నికలలో గెలవాలని ప్రయత్నించి భంగపడ్డారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా చంద్రబాబు కారణంగానే తన ఆశలు అడియాసలయ్యాయని ఆయనే స్వయంగా చాలాసార్లు నిసిగ్గుగా చెప్పుకొన్నారు. అప్పటి నుండే ఆయన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తన శత్రువులుగా భావిస్తూ పోరాటాలు మొదలు పెట్టారు. కనుక ఆయన చేస్తున్న ఈ సమర దీక్షలు...పోరాటాలు అన్నీ కూడా కేవలం తెదేపాపై ప్రతీకారేచ్చతో చేస్తున్నవే తప్ప నిజంగా ప్రజల కోసం చేస్తున్నవి మాత్రం కాదని చెప్పవచ్చును.   ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల కోసం, వారి సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న వారికి మద్దతు ఇచ్చి, వారితో చేతులు కలిపి ఉండేవారు కాదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకి, తన స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తునందునే ఆయన ఆవిధంగా చేస్తున్నారని అనుమానించక తప్పదు.   రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కదులుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నాలుగేళ్ల కాలంలో రాజధానికి రూపురేఖలు తీసుకువచ్చి, పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రాన్ని ఆర్ధిక సమస్యల నుండి  బయటపడేయగలిగినట్లయితే ఇక వచ్చే ఎన్నికలలో కూడా వైకాపా గెలిచే అవకాశాలు ఉండబోవని తేలికగానే ఊహించవచ్చును. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పాలుపంచుకోకపోవడానికి దానికి అడుగడుగునా అడ్డుపడటానికీ కారణం అదేనని భావించవచ్చును. బహుశః అందుకే ఆయన తన సమరదీక్షకు మంగళగిరిని వేదికగా ఎంచుకొన్నారని భావించవచ్చును..   అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు సహిస్తారు కానీ అధికార దాహంతో తాము ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎవరయినా కుట్రలు పన్ని కూల్చాలని ప్రయత్నించినా, రాష్ట్రాభివృద్దికి ఆటంకాలు సృష్టించినా సహించబోరనే విషయం గతంలో చాలాసార్లు రుజువు చేసారు. వైకాపా కూడా మళ్ళీ అటువంటి పొరపాటే చేస్తే అందుకు ఆ పార్టీయే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావలసిన తరుణంలో

  ఈరోజు తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణా ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు అందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకొంటున్నారు. చిరకాల పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకొన్నారు కనుక తెలంగాణా ప్రజలందరికీ ఈరోజు నిజంగానే చాలా శుభదినమే. కానీ తెలంగాణా ఏర్పాటు కోసమే జరిగిన రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ కూడా ఈరోజే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంతోషంగా నిర్వహించుకోలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఆంద్రప్రదేశ్ ప్రజల మీద బలవంతంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని రుద్దిన కారణంగానే రాష్ట్రం ఏర్పడింది తప్ప తెలంగాణా ప్రజలలా పోరాడి సాధించుకొన్నందున ఏర్పడినది కాదు. కాంగ్రెస్ పార్టీ స్వార్ధానికి, చేసిన తప్పులకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసివస్తోందిపుడు. కాంగ్రెస్ చేసిన పాపానికి రాష్ట్రం కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిలబడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో వేడుకలు నిర్వహించుకోవడం అంటే మనల్ని మనమే పరిహసించుకోవడమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుని నవ నిర్మాణ దీక్షా దినంగా పాటిస్తోంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నాటి ఇంతవరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలని నిర్వహించుకోకుండా మానింది లేదు. కానీ మొట్ట మొదటిసారిగా అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోతున్నాము. అందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక గడ్డు సమస్యలని, పరిస్థితులని అధిగమించి మళ్ళీ ఎప్పుడు సగర్వంగా తలలెత్తుకొని నిలబడగలదో అప్పుడే రాష్ట్రానికి నిజమయిన పండుగ రోజు. అటువంటి రోజు కోసం రాష్ట్ర ప్రజలందరినీ కార్యోన్ముఖులను చేసి ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పాలు పంచుకొనేలా చేసేందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష మొదలు పెట్టింది.   కానీ దురదృష్టమేమిటంటే, ఇటువంటి మహత్కార్యంలో పాలుపంచుకోవలసిన ప్రతిపక్షాలు దీనిని కూడా రాజకీయం అంటగట్టడం. ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కటినంగా శిక్షించినప్పటికీ, నేటికీ ఆ పార్టీ నేతల్లో పశ్చాతాపం ఏ కోశాన్న కనబడటం లేదు. తమ పార్టీ చేసిన తప్పుకి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ అంధకారంగా మారినందునే బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడి వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా భ్రమలలోనే జీవిస్తూ, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం విచిత్రమే.   ప్రజాభీష్టానికి విరుద్దంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసి రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్దరించినట్లు, తామిచ్చిన ఆ హామీని తెదేపా, మోడీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని మొసలి కన్నీళ్లు కార్చుతోందిపుడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏనాటికయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనే ఉంటే ఈవిధంగా మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదాపైనో లేదా మరొక అంశమో పట్టుకొని రాజకీయాలు చేయడం మాని రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకొంటే ఏదో ఒకనాడు రాష్ట్ర ప్రజల మనసులు కరుగక మానవు. తమ పార్టీ చేసిన ఈ చారిత్రికమయిన తప్పిదానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రాయశ్చితం చేసుకోకపోతే వారు ఎన్నిబకెట్లు మొసలి కన్నీళ్లు కార్చినా ప్రజలు కూడా పట్టించుకోరనే సంగతి గ్రహిస్తే మంచిది.   ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా అధికార తెదేపాతో ఉన్న రాజకీయ వైరం కారణంగా, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తన శత్రువుగా భావిస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి అవరోధాలు కల్పిస్తుండటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాసకు, తెలంగాణా ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తుండటం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆ పార్టీ తన వంతు సహాయ సహకారాలు అందించకపోయినా పరువాలేదు కానీ అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రం ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కాంగ్రెస్, వైకాపాలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా శోచనీయం.   రాష్ట్ర ప్రజల, మోడీ ప్రభుత్వ సహాయ సహాకారాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏటికి ఎదురీదుతూ మరీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రమిస్తోంది. బహుశః రానున్న రెండు మూడేళ్ళలోనే రాష్ట్రం మళ్ళీ స్వయం సంవృద్ది సాధించి తన కాళ్ళ మీద తను నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ తాము పునర్నిర్మించుకొన్న రాష్ట్రాన్ని చూసుకొని సగర్వంగా పండగ చేసుకోవచ్చును. కానీ అందులో ప్రతిపక్షాలకు కూడా భాగం కావాలనుకొంటే, రాష్ట్రాభివృద్దికి అడుగడుగునా అడ్డం పడటం మాని తమ వంతు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.