వినూత్న ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగుతున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో పేరుకుపోయిన అవినీతిని, అనేక సమస్యలను తమ ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించుకొంటూ వస్తోందో సవివరంగా తెలిపారు. అనేక దశాబ్దాలుగా పేరుకుపోయున్న ఈ సమస్యలకు సాంప్రదాయ పద్దతులలో పరిష్కారించాలంటే అవి ఇంకా నానాటికీ పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎన్నటికీ పరిష్కారానికి నోచుకోవని గుర్తించి, తమ ప్రభుత్వం వాటిని వాస్తవిక దృక్పధంతో ఎదుర్కొని ఏవిధంగా పరిష్కరిస్తున్నదీ ఆయన ఉదాహారణలతో సహా వివరించారు.
ఉదాహరణకి ఇన్ని దశాబ్దాలుగా గ్యాస్ సబ్సిడీని సామాన్యులే కాకుండా దేశంలో ఉన్నత, అధికాదాయ వర్గాల ప్రజలు కూడా వినియోగించుకొంటున్నారు. కానీ ఆ సంగతి ఇంతవరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటి వారందరూ సామాన్య ప్రజల కోసం గ్యాస్ సబ్సీడీని వదులుకోమని ఇచ్చిన పిలుపుకి ఇంతవరకు సుమారు 20 లక్షల మంది తమ సబ్సీడీని స్వచ్చందంగా వదులుకొన్నారని, ఆ విధంగా ఏడాదికి రూ.15, 000 కోట్లు మిగులుతుందని ఆ సొమ్మునంతా సామాన్య ప్రజల కోసమే వినియోగిస్తామని మోడీ తెలిపారు.
ఇంతవరకు బొగ్గు గనులను, స్పెక్ట్రం వగైరా లైసెన్సులను కేంద్రప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలకు, వ్యక్తులకు నామ మాత్ర ధరలకే కేటాయించేవని కానీ తమ ప్రభుత్వం వాటన్నిటినీ వేలం ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఖజనాలో రూ.3 లక్షల కోట్లు జామా అయ్యాయని మోడీ తెలిపారు. బొగ్గు గనులనే కాక ఎఫ్.ఎం. రేడియో లైసెన్సులను కూడా వేలం వేస్తూ ప్రభుత్వానికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకొంటున్నామని తెలిపారు.
అదేవిధంగా ఇంతవరకు దేశంలో వివిధ రాష్ట్రాలలో గనుల నుండి వెలికి తీస్తున్న బొగ్గుని, విదేశాలలో నుండి దిగుమతి చేసుకొంటున్న బొగ్గును సుదూర ప్రాంతాలకు తరలించేవారని, తద్వారా మధ్య దళారులు, బడా సంస్థలు లాభపడుతుంటే ప్రభుత్వాలు, ప్రజలు ఆ నష్టాన్ని భరించవలసి వచ్చేదని, తమ ప్రభుత్వం ఆ పద్దతిని మార్చి ఎక్కడి బొగ్గును అక్కడి పరిసర ప్రాంతాలకు, సమీప రాష్ట్రాలు వినియోగించుకొనే విధంగా పద్దతులు, నియమనిబంధనలలో మార్పులు చేసామని, ఆ విధంగా కూడా ప్రభుత్వంపై భారం, నష్టాలు తగ్గించుకోగలిగామని తెలిపారు.
ఈ విధంగా సమకూర్చుకొంటున్న భారీ మొత్తాలతో దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిందని తెలిపారు. వాటిలో అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాలకి గ్యాస్ పైప్ లైన్లు వేయడం, రోడ్లు, విద్యుదీకరణ తదితర మౌలికవసతుల కల్పనకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69సం.లు అయినప్పటికీ అనేక రాష్ట్రాలలో మొత్తం 18,500 గ్రామాలు విద్యుత్ సదుపాయం లేక నేటికీ చీకటిలో మ్రగ్గుతున్నాయని, ఆ గ్రామాలన్నిటికీ మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో తప్పకుండా విద్యుత్ సదుపాయం కల్పించి తీరుతామని మోడీ తెలిపారు.
భారత సైన్యంలో ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ విధానం ప్రవేశపెట్టమని గత 52 సం.లుగా సైనికులు కోరుతున్నారని కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వమూ ఈ సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని కానీ తమ ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగానయినా పరిష్కరించేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోందని కనుక మువ్వన్నెల జెండా సాక్షిగా ఈ సమస్యను వీలయినంత త్వరలోనే పరిష్కరిస్తానని మోడీ హామీ ఇచ్చారు.
నల్లదనం గురించి కూడా మోడీ తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వాటి ఫలితాల గురించి తెలియజేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలలో పడిఉన్న నల్లదనం వెనక్కి రప్పించేందుకు వివిధ శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేసిందని, తమ ప్రభుత్వం నల్లదనాన్ని ఇంకా వెనక్కి రప్పించలేకపోయినా చాలా పటిష్టమయిన చట్టాలు తీసుకువచ్చి దేశంలో నుండి నల్లదనం బయటకి పోకుండా ఆపగలిగామని తెలిపారు. నల్ల కుభేరులకు తమ ప్రభుత్వం ఇచ్చిన గడువులో ఇప్పటికే చాలామంది ప్రభుత్వానికి తమ నల్లదనం వివరాలను తెలిపి దానికి జరిమానాలు చెల్లించడం మొదలుపెట్టినట్లు తెలిపారు.
దేశంలో చీడపురుగులా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల గురించి, వాటి ఫలితాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో సవివరంగా తెలిపారు. ఏడాదిన్నర పాలనలో తమ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడమే తమ నీతి నిజాయితీలకు, పారదర్శకతకు ఉదారణలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏమి చేసినా దేశంలో సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచి సుఖంగా బ్రతికేందుకు అవకాశం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రోగం ముదిరిపోయినప్పుడు బలమయిన మందులు, ఇంజక్షన్లు తీసుకొన్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అలాగే తమ ప్రభుత్వం చేపడుతున్న ఈ అవినీతి నిర్మూలన చర్యల వలన కూడా తమ ప్రభుత్వం అనేక సవాళ్ళను, ప్రతికూలతను ఎదుర్కోవలసివస్తోందని కానీ ఏమాత్రం జంకకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
వచ్చే నాలుగేళ్ళలో దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించడం తధ్యమని మోడీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీలు, విశ్లేషకులు తన ప్రసంగాన్ని రాజకీయ దృక్కోణం నుంచి చూస్తూ విమర్శలు చేయవచ్చని కానీ తను చెపుతున్న ఈ మాటలలో వాస్తవాలను గ్రహించాలని ఆయన కోరారు.