ప్రజలు స్పందించనందునే విద్యార్ధులపై కన్నేసాయా?

  ఆంద్రప్రదేశ్ లో తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఎప్పటికయినా ముఖ్యమంత్రి అవ్వాలని తపించి పోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని పోరాడుతున్నారు. కానీ ప్రజల నుండి ఆశించిన స్పందన కనబడకపోవడంతో ఇప్పుడు వారి దృష్టి విద్యార్ధులపై పడింది. తమ రాజకీయ మనుగడ, లబ్ది కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపాలు ఏదో విధంగా విద్యార్ధులను రెచ్చగొట్టి తమ వైపు ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.    ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర రాష్ట్ర మంత్రులకు కోటి యస్.ఎం.యస్. మెసేజులు పంపే కార్యక్రమానికి చేప్పట్టిన కాంగ్రెస్ పార్టీ అందుకు విద్యార్ధుల మద్దతు కోరుతోంది. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడంతో రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రజలలో నెలకొన్న ప్రత్యేక హోదా సెంటిమెంటుని తట్టి లేపి దానిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ దుర్బుద్ధిని పసిగట్టిన ప్రజలు దానికి సహకరించకపోవడంతో ఇప్పుడు అది విద్యార్ధులను దువ్వుతోంది.   ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి, ఈ విషయంలో తమ పార్టీ కంటే కాంగ్రెస్ ముందుకు దూసుకుపోతున్న సంగతి పసిగట్టగానే ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెట్టేశారు. కానీ ఆయన కేంద్రంతో పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోరాడటం గమనిస్తే ఆయన చేస్తున్న పోరాటం దేనికోసమో అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్న జగన్ కూడా తిరుపతి యస్వీ యూనివర్సిటి, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటి విద్యార్ధులను కలిసి తను చేస్తున్న ప్రత్యేక హోదా కోసం పోరాటానికి మద్దతు ఇమ్మని కోరుతున్నారు.   ప్రత్యేక హోదా వలన రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. కనుక కొత్తగా పరిశ్రమలు, తద్వారా యువతకు ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం తధ్యం. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో రాష్ట్రంలో విస్త్రుత వ్యాపార అవకాశాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. అందుకే రాజధాని నిర్మాణానికి, మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందుకే దేశంలో వ్యాపారానికి అనుకూలమయిన రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ రెండవ స్థానం ఇచ్చింది.   నిజం చెప్పాలంటే గత ఆరు దశాబ్దాలలో ఆంద్రప్రదేశ్ లో ఎన్నడూ జరుగని అభివృద్ధి కార్యక్రమాలకి ఈ 14 నెలల్లో శ్రీకారం చుట్టిన సంగతి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఏదో అనర్ధం జరిగిపోతుందన్నట్లు కాంగ్రెస్, వైకాపాలు సమస్యని భూతద్దంలోంచి చూపిస్తూ ప్రజలను, విద్యార్ధులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రత్యేక ఉద్యమాలకి ప్రజలు స్పందించకపోవడం చేతనే ఇప్పుడు తమను ఆశ్రయిస్తున్నాయనే సంగతి విద్యార్ధులు కూడా గమనించాలి. వారి పోరాటాలలో అంతర్యం, చిత్తశుద్ధిని విద్యార్ధులు కూడా తరిచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణా విద్యార్ధుల లాగే వారు కూడా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు మెట్లుగా మిగిలిపోతారు.

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి...మాటలలో కాదు!

  దేశంలో వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ స్థానం, తెలంగాణాకు 13వ స్థానం ప్రపంచ బ్యాంక్ ఇవ్వడంపై మొదట చాలా ఆచితూచి మాట్లాడిన తెలంగాణా ఐటి మంత్రి కె. తారక రామారావు, నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన అక్కసునంత వెళ్ళగ్రక్కారు.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, చంద్రబాబు నాయుడుకి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం అనేక సమస్యలను సవాళ్ళను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా నడిపిస్తోందని కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ‘బిల్డప్ ఎక్కువ పని తక్కువ’ అని ఎద్దేవా చేసారు. తెరాస ప్రభుత్వం అధికారం చేప్పట్టిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేశామని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోకెల్లా అత్యంత నాణ్యమయిన పరిపాలన అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.   ఒకవేళ కేటీఆర్ చెప్పిందే నిజమనుకొంటే ప్రపంచ బ్యాంక్ తెలంగాణాకే 2వ స్థానం, ఆంద్రప్రదేశ్ కి 13వ స్థానం ఇచ్చి ఉండేది. కానీ అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ రాజధానిగా కలిగి దేశంలో రెండవ ధనిక రాష్ట్రమయిన తెలంగాణా కంటే అసలు రాజధానే లేని, ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రమే వ్యాపారానికి చాలా అనువయినదని ప్రకటించింది. కేటీఆర్ బాషలోనే చెప్పాలంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్ లో రెండు రాష్ట్రాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది.   చంద్రబాబు నాయుడు పరిపాలనకు అదే గీటురాయి వంటిది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సమస్యలు, సవాళ్లు, రాజకీయ కుట్రలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అయినా వాటన్నిటినీ ఒకటొకటిగా అధిగమిస్తూ చాలా దైర్యంగా, చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగుతోంది. తెరాసకి వడ్డించిన విస్తరి వంటి ధనిక రాష్ట్రం దక్కినప్పటికీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వం అనేక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు నడిపిస్తోందని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం.   చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ పని తక్కువని కేటీఆర్ అన్న మాటలు నిజానికి తమ తెరాస ప్రభుత్వానికే అన్వయించుకోవాలి ఉంటుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, వినాయక్ సాగర్ నిర్మాణం, దాని పక్కన మరో పెద్ద ఆకాశ హర్మ్య నిర్మాణం, ఎడ్యుకేషన్ సిటీ, ఎంటర్టెయిన్మెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం, సచివాలయ నిర్మాణం, ఉస్మానియా విశ్వద్యాలయంలో పేదలకు ఇళ్ళ నిర్మాణం, తెలంగాణా రాష్ట్రాలను డల్లాస్, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి ప్రపంచ నగరాల స్థాయికి అభివృద్ధి చెందేలా తీర్చిద్దిడం వంటి అనేక రంగుల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రజలకు చూపించారు. కానీ వాటిలో ఏ ఒక్క పనీ ఇంతవరకు మొదలుపెట్టలేదు కూడా. హడావుడిగా మొదలుపెట్టిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.   ఈ ఏడాదిన్నర కాలంలో పొరుగు రాష్ట్రంతో, కేంద్రప్రభుత్వంతో నిత్యం తగువులు, నిత్యం దేనికో దానికి కోర్టులో మొట్టికాయలు వేయించుకోవడం, పదవులు ఎర వేసి ప్రతిపక్ష నేతలను తెరాసలోకి ఆకర్షించడం, లేకుంటే స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపింగులు చేయడం, చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, ఎర్రగడ్డ ఆసుపత్రుల కూల్చివేత, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కల్లు, చీప్ లిక్కర్, బీర్ వెండింగ్ మిషన్ల ఏర్పాటు వంటి అనేక వివాదస్పద నిర్ణయాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది.   రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. ఆ సమస్యను చంద్రబాబు నాయుడు కేవలం3నెలల్లోనే తీర్చగా, తెలంగాణా ప్రభుత్వానికి 15నెలలు పట్టిందని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పుకొంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదం.   తెరాస ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్ చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ దేశంలో ఆంద్రప్రదేశ్ తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తుంటాయి. ఒకవేళ చేయకపోతే ప్రతిపక్షాలు ఎలాగూ నిలదీస్తాయి. దేశంలో కెల్లా చాలా నాణ్యమయిన పరిపాలన అందిస్తున్నామని చెప్పుకొన్న కేటీఆర్, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా తెలంగాణా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నందుకు సిగ్గుపడకపోగా, రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తీవ్రమయిన ఈ సమస్యని పరిష్కరించేందుకు వారి సలహాలు సూచనలు కూడా అడిగి ఉంటే బాగుండేది. కానీ ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసరంగా రాద్దాంతం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని తిరిగి వారినే విమర్శించడం సిగ్గుచేటు. పైగా 60 ఏళ్ల గబ్బు 15నెలల్లో ఎలాగ వదిలించగలము? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు రెచ్చగొడుతూ, రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వాలను నిందిస్తూ ఇంకా ఎంతకాలం కాలక్షేపం చేస్తారో? చూడాలి. మిగిలిన మూడున్నరేళ్ళ సమయంలో తెదేపా, తెరాస ప్రభుత్వాలలో ఏది ఎంత అభివృద్ధి సాధించింది అనే విషయం ఎన్నికల సమయంలో ప్రజలే తేల్చి చెపుతారు. కనుక ఇటువంటి మాటలతో కాలక్షేపం చేయకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే అందరికీ మంచిది.

అత్యాచార నేరానికి దౌత్యవేత్తలకు మినహాయింపు ఉంటుందా?

  చమురు బావులతో సంపన్న దేశంగా మారిపోయిన సౌదీఅరేబియాలో నేటికీ రాజరిక వ్యవస్థే కొనసాగుతోంది. అక్కడ చట్టాలు చాలా కటినంగా అమలు చేస్తుంటారు. అందుకే అక్కడ నేరాలు, అవినీతి కూడా చాలా తక్కువే. అటువంటి దేశం నుండి డిల్లీకి వచ్చిన దౌత్యవేత్త మజీద్ హసన్ అసుర్ తన ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్న నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలను గత రెండు మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తను అత్యాచారం చేయడమే కాకుండా తన ఇంటికి వచ్చిన తన స్నేహితులకు కూడా ఆ మహిళలను అప్పజెప్పేవాడు. ఆ నేపాలీ మహిళలు ఇద్దరూ ఎలాగో అతికష్టం మీద తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ అతనికి దౌత్యపరమయిన రక్షణ ఉపయోగించుకొని అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు. సౌదీ ప్రభుత్వం అతనిని తక్షణమే స్వదేశానికి తిరిగి రప్పించుకొని అతనిని కాపాడింది.   ఒకవేళ ఇదే నేరం సౌదీఅరేబియాలోనే జరిగి ఉండి ఉంటే సౌదీ ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి మరణ దండన అమలుచేసి ఉండేది. కనుక భారత చట్టాల ప్రకారం తన దౌత్యవేత్తను కూడా శిక్షించేందుకు సౌదీ ప్రభుత్వం సహకరించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ దౌత్యవేత్తగ తన దేశ పేరు ప్రతిష్టలు ఇనుమడించేలా చాలా హుందాగా వ్యవహరించవలసిన అసుర్ చాలా తీవ్రమయిన నేరం చేస్తే, అతనిని కాపాడే ప్రయత్నం చేసి సౌదీ ప్రభుత్వం అంతకంటే పెద్ద తప్పు చేసినట్లయింది. తమ దేశంలో అమలు చేసే చట్టాలు, శిక్షలు కేవలం సామాన్య పౌరులకే కానీ మజీద్ హసన్ అసుర్ వంటి దౌత్యవేత్తలకి వర్తింపజేయదని చాటుకొన్నట్లు అయింది.   తమ దేశానికి చెందిన మహిళలపై భారత్ లోనే అత్యాచారం జరిగింది కనుక భారత్ చట్టాల ప్రకారం వారికి న్యాయం చేయాలని నేపాల్ కోరుతోంది. ఈ నేరం చేసిన సౌదీ దౌత్యవేత్తతో బాటు అతనితో ఈ నేరంలో పాల్గొన్న వారందరిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని నేపాల్ ప్రభుత్వం కోరుతోంది. నేపాల్ ఆ విధంగా కోరడంలో సహజమే. కానీ ఆ సౌదీ అసురుడు తనకున్న దౌత్య కవచాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటికే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇక అతనిని వెనక్కి రప్పించి శిక్షించడం దాదాపు అసంభవమేనని చెప్పక తప్పదు.   అనేక కారణాల వలన భారత్-నేపాల్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సౌదీ దౌత్యవేత్త, సౌదీ ప్రభుత్వం చేసిన ఈ తప్పుల వలన నేపాల్ ప్రభుత్వానికి భారత్ సంజాయిషీలు ఇచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇరు దేశాల సంబంధాలు దెబ్బ తింటున్నాయి. సౌదీ అరేబియా దేశంలో లక్షలాది భారతీయులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. కనుక భారత ప్రభుత్వం సౌదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగలేదు. అలాగని ఇంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిని ఉపేక్షించలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భారత్ ఉందిప్పుడు. దౌత్యవేత్తగా అతనికి వియన్నా ఒడంబడిక ప్రకారం రక్షణ కలిగి ఉంటాడు కనుక భారత్ అతనిని అరెస్ట్ చేయకూడదని సౌదీ వాదించింది. కానీ అటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తికి శిక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ భారత్ చట్టాలను మాత్రం అది గౌరవించాలనుకోవడంకోలేదు.

రసవత్తరంగా సాగుతున్న బీహార్ రాజకీయాలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలలో వామపక్ష కూటమి, జనతా పరివార్, దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, కొత్తగా హైదరాబాద్ కి చెందిన మజ్లీస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. జనతా పరివార్ నుండి బయటకు వచ్చేసిన ములాయం సింగ్ ని బీజేపీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటే, ఆయన ఎన్డీయే కూటమిలో సభ్యుడు ఉన్న మాజీ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీని తనవైపు ఆకర్షించేందుకు విఫల యత్నాలు చేసారు. అదే విధంగా బీహార్ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న మజ్లీస్ పార్టీని జనత పరివార్ లోకి ఆకర్షించేందుకు ఆ కూటమి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ములాయం సింగ్ కూడా మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.   అక్టోబర్ 12నుండి మొదలయ్యే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసుకొనే పనిలో పడ్డాయి. జనతా పరివార్ కూటమిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చెరో 100 సీట్లు పంచుకొని కాంగ్రెస్ పార్టీకి-40 సీట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఏ నియోజక వర్గంలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై వారి మధ్య చర్చ జరుగుతోంది. మూడు పార్టీలు తమకు బాగా పట్టున్న నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తాయి కనుక నియోజకవర్గాల పంపకాల విషయం కూడా మూడు పార్టీలు మధ్య అభిప్రాయభేదాలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చును. ఎందుకంటే ఈ ఎన్నికలలో నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందున ఆయన తమ పార్టీ పోటీ చేస్తున్న 100 సీట్లలో అత్యధికంగా గెలిచేందుకు అనువయిన నియోజక వర్గాల కోసం పట్టుబట్టవచ్చును. ఒకవేళ తన పార్టీకి తక్కువ సీట్లు వచ్చి, లాలూ నేతృత్వం వహిస్తున్న ఆర్.జె.డి.కి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే అప్పుడు లాలూ చెప్పినట్లు ఆడవలసి వస్తుంది. అదేవిధంగా లాలూ కూడా తనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తేలిపోయింది కనుక ఈ ఎన్నికలలో వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రభుత్వంపై పెత్తనం చేలాయించాలని అనుకొంటున్నారు కనుక తన పార్టీకి అనుకూలమయిన నియోజకవర్గాల కోసం పట్టుబట్టవచ్చును. కనుక ఈ ఆఖరి గండం కూడా గట్టెక్కగలిగితేనే జనతా పరివార్ మనుగడ సాగించగలదు. లేకుంటే ఎన్నికలకు ముందే విచ్చినం కాక తప్పదు. అదే జరిగితే ఇక బీజేపీ సగం విజయం సాధించినట్లే భావించవచ్చును.   ఎన్డీయే కూటమిలో బీజేపీయే అత్యధికంగా 160 సీట్లు ఉంచుకొంది కనుక దానికి ఇటువంటి సమస్య ఉండబోదు. ఈసారి వామపక్షాలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పటికీ అవి ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే కుల,మత, రాజకీయ సమీకరణాలను అధిగమించి అధికారం చేజ్జించుకోవడం అసాధ్యమేనని చెప్పవచ్చును. సమాజ్ వాదీ, మజ్లీస్ పార్టీలను తక్కువ అంచనా వేయలేము. మజ్లీస్ పార్టీ రాష్ట్రంలోని ముస్లిం ఓటు బ్యాంక్ పైనే ఆధారపడి 25స్థానాలకు పోటీచేస్తోంది. కనుక ఈసారి ముస్లింల ఓట్లలో మరింత చీలవచ్చును. వారి ఓటు బ్యాంకుపై ఆధారపడిన జనత పరివార్, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు తీవ్ర నష్టం జరుగవచ్చును. అదేవిధంగా మజ్లీస్, సమాజ్ వాదీ పార్టీల వలన జనతా పరివార్ కి ఎక్కువ నష్టం జరుగవచ్చును. కనుక ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగవచ్చును. ఒకవేళ బీహార్ ప్రజల ఓట్లు ఈ పార్టీలు, కూటముల మధ్య చీలిపోయినట్లయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చును. అదే జరిగితే ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన బీహార్ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్ పైనా అనుమానాలేనా?

  భారతదేశంలో వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో గుజరాత్ ప్రధమ స్థానంలో దాని తరువాత ఆంద్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్న తెలంగాణాకి ఈ విషయంలో 13వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించడంపై తెరాస ప్రభుత్వ మంత్రులు, నేతలు షాక్ అయ్యారు. దానిపై తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాతిపదికన తమ రాష్ట్రానికి 13వ స్థానం కేటాయించిందో తెలియదు కానీ తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలే గీటురాయిగా నిలుస్తాయని” ఆ రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు అన్నారు.   ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి చేసి ఈ విధంగా ప్రకటింపజేసి ఉండవచ్చని తెరాస ఎంపీ నర్సయ్య గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేసారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు దేశ విదేశాల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షిస్తూ శరవేగంగా ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఝార్ఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యాపారానికి అనువుగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ చేత ర్యాంకులు ఇప్పించుకొందని అయన వాదిస్తున్నారు.   ఆంద్రప్రదేశ్ కి రెండవ స్థానం దక్కడాన్ని ఆయనతో సహా చాలా మంది తెరాస నేతలు పైకి మెచ్చుకొంటున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, వారి వాదనలు వింటుంటే ఆంద్రప్రదేశ్ కి రెండవ ర్యాంక్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంక్ తెలంగాణాకి 3 లేదా 4వ స్థానం ఇచ్చి, ఆంద్రప్రదేశ్ కి ఏ ఐదో,ఆరో స్థానం ఇచ్చి ఉండి ఉంటే వారు కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకుల గురించి గొప్పగా చెప్పుకొని ఉండేవారు. కానీ అన్ని విధాల చితికిపోయున్న ఏపీకి రెండవ స్థానం ఇచ్చి, తెలంగాణాకు 13వ స్థానం ఇవ్వడం వలననే వారు ఈ ర్యాంకులను అంగీకరించడం లేదని చెప్పవచ్చును.   ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల ప్రమేయం ఉన్న ఏ అంశంపైనైనా సానుకూల నిర్ణయం తీసుకొన్నట్లయితే, అవి వాటికి అమ్ముడుపోయాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటాయి. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి తొత్తులుగా మారిపోయి అవి ఆడించినట్లు ఆడుతున్నాయనే ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాము. అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత ర్యాంక్ ఇవ్వాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి ఏవిధంగా నిర్దేశించగలవు? ఒకవేళ తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు భారత్ ప్రపంచ బ్యాంక్ ని నిర్దేశించే పరిస్థితిలో ఉండి ఉంటే దేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేప్పట్టేందుకు రుణాల కోసం ప్రపంచ బ్యాంక్ ని ప్రాధేయపడవలసిన అవసరమే ఉండేది కాదు.   సాధారణంగా ఏ రాష్ట్రానికయినా ఇటువంటి ర్యాంకులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ విద్యుత్, నీటి సౌకర్యం, భూమి ఉపలబ్దత, రవాణా వ్యవస్థలు, మానవ వనరులు, సహజ వనరులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొంటుంది. అదే విధంగా రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న సంబంధాలు, రాష్ట్రాలపై వాటి ప్రభావం, సదరు రాష్ట్రంతో ప్రపంచ దేశాల ఏవిధంగా వ్యవహరిస్తున్నాయి? వంటి అనేక ఇతర అంశాలను కూడా పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తుంటుంది. దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా ధనిక రాష్ట్రం అయ్యి ఉండవచ్చును. కానీ నేటికీ విద్యుత్, సాగునీరు, త్రాగు నీరు వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాల కృషి చేస్తున్న మాట వాస్తవం. కానీ అవి ఇంకా పరిష్కరింపబడవలసి ఉంది.   ఇక తెలంగాణా-కేంద్రప్రభుత్వాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిని మెరుగుపరుచుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ గట్టిగా ప్రయత్నాలు చేయలేదు అనే కంటే అసలు వాటికి ఆయన ఎన్నడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చును. కేంద్రంపట్ల ఆయన ఎన్నడూ నిలకడగా ఒకే విధానం అవలంభించలేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు, ఆయన తెదేపా-బీజేపీల మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బలమయిన అనుబంధం గురించి నొక్కి చెప్పడం మరిచిపోరు. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కేంద్రప్రభుత్వం కూడా అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తుందని ఆయన కేంద్రప్రభుత్వం తరపున పూర్తి భరోసా ఇస్తుంటారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి భరోసా ఇవ్వలేరు. కారణం కేంద్రప్రభుత్వంతో అనిశ్చిత సంబందాలు నెలకొని ఉండటమే.   ఇక ఉద్యమ సమయంలో తెరాస నేతలు రాష్ట్రంలో సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలకు కల్పించిన తీవ్ర అభద్రతా భావం నేటికీ వారిలో యధాతధంగా నెలకొనే ఉంది. వారిలో నెలకొని ఉన్న ఆ అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తెరాస ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ అభద్రతా భావం కారణంగానే హైదరాబాద్ లో స్థిరపడిన సినీ ప్రముఖులు నేటికీ తరచూ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ ఆయనని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పరిపాలిస్తున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపించడం అందరూ ఎరిగిన విషయమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చివరికి మీడియా కూడా రాష్ట్రంలో మనుగడ సాధించలేదని నిరూపితమయింది. రాష్ర్టంలో ఇటువంటి అభద్రతా భావం నెలకొని ఉన్నప్పుడు అక్కడ వ్యాపారానికి అనుకూలమయిన పరిస్థితులు ఉండవని ఎవరయినా చెప్పగలరు. అదే ముక్క ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పినట్లు భావించవచ్చును.

ఆంద్రప్రదేశ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమయిన రాష్ట్రం: ప్రపంచ బ్యాంక్

  గుజరాత్ తరువాత తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. గుజరాత్ తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా వ్యాపారానికి అత్యంత అనువయిన రాష్ట్రమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణా 13వ స్థానంలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతవరకు గుజరాత్ తరువాత మహారాష్ట్ర చాలా విషయాలలో రెండవ స్థానంలో నిలిచేది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు చెరో అంశంలో మహారాష్ట్ర స్థానాన్ని ఆక్రమించాయి. బీహార్ రాష్ట్రం నుండి విడివడిన జార్ఖండ్ కూడా మహారాష్ట్రాని అధిగమించి మూడవ స్థానంలో ఉండటం మరో విశేషం.పెట్టుబడుల విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అన్నిటి కంటే చివరి స్థానంలో నిలిచింది.   తెలంగాణాకి అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ దక్కినందున అది దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా నిలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాలా ఘోరంగా దెబ్బతిని, కనీసం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఉన్న ఆంద్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యాపారానికి అత్యంత అనువయిన రాష్ట్రంగా స్థానం సంపాదించడం విశేషమే. ఈ ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెందుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే మంచి కార్యదక్షుడు, అనుభవజ్ఞుడు కలిగిన ఆయన మాత్రమే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలరని నమ్మకంతోనే ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురవుతున్న సమస్యలను ఆయన ధీటుగా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలలో, పారిశ్రామిక వ్యాపారవేత్తలలో భవిష్యత్ పట్ల మంచి నమ్మకం కలిగించగలిగారు. అందుకు తగినట్లుగానే నేటికీ అందరూ ఆయన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్ది మళ్ళీ వేగంగా అభివృద్ధి సాధిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర భవిష్యత్ పట్ల ప్రభుత్వానికి, ప్రజలకు, పెట్టుబడిదారులకు అందరికీ బలమయిన నమ్మకం కలిగి ఉండటం, ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వంపై అచంచలమయిన నమ్మకం కలిగి ఉండటం ఏ రాష్ట్రానికయినా, ప్రభుత్వానికయినా ఖచ్చితంగా చాలా సానుకూల అంశమే.   రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులని, జరిగిన తరువాత పరిస్థితులని, ప్రస్తుత పరిస్థితులని ఒకసారి బేరీజు వేసుకొని చూసినట్లయితే రాష్ట్రంలో చాలా సానుకూలమయిన పరిస్థితులు, మార్పులు కనబడుతున్నాయి. అందుకే ప్రపంచ బ్యాంక్ రాష్ట్రానికి రెండవ స్థానం ఇచ్చిందని భావించాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటి భారీ నిర్మాణ కార్యక్రమాలలో విదేశీ సహాయసహకారాలు తీసుకోవాలనుకోవడం కూడా ఇందుకు ఒక కారణమయి ఉండవచ్చును.   తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు కానప్పటికీ ఆంద్రప్రదేశ్ వ్యాపారానికి చాలా అనువయినదని ప్రపంచ బ్యాంక్ స్వయంగా ప్రకటించడం వలన దేశ విదేశీ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధతకి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన కాంప్లిమెంటుగా భావించవచ్చును. అదేవిధంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనిని ఒక వరంగా కూడా భావించవచ్చును. బహుశః ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ విదేశీ సంస్థలకు ఇదే విషయం నొక్కి చెప్పి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చును.

రసవత్తరంగా మారుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే నెల నుండి ఐదు దశలలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనతా పరివార్, ఎన్డీయే, వామపక్ష కూటములు పోటీ చేస్తున్నాయి. అవిగాక జనతా పరివార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ, జనతా పరివార్ నుండి విడిపోయి సమాజ్ వాదీ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఇవేగాక చాలా మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉంటారు. బీహార్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ కూడా 40 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.   బీహార్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ ప్రవేశం వలన ముస్లిం ఓట్లపై ఆధారపడే కాంగ్రెస్, జనతా పరివార్, సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా నష్ట పోవచ్చును. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాలలో ముస్లిం అభ్యర్ధులనే పోటీలో నిలబెట్టినప్పటికీ, మజ్లీస్ పార్టీ నూటికి నూరు పాళ్ళు ముస్లింల పార్టీ కనుక ముస్లిం ప్రజలు మజ్లీస్ పార్టీ వైపే మ్రోగ్గు చూపే అవకాశం ఉంది.   అలాగని మజ్లీస్ పార్టీతో జనతా పరివార్ పొత్తులు పెట్టుకోలేదు. ఎందుకంటే అందుకోసం తమ సీట్లలో దానికి కూడా వాటా పంచి ఇవ్వవలసి వస్తుంది. ఈ ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని తహతహలాడుతున్న నితీష్ కుమార్ తన ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే తనంతట తాను కనీసం 75-100 సీట్లు గెలుచుకోవడం చాలా అవసరం. అప్పుడే లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కనుక ఆయన తన పార్టీ కోసం అట్టేబెట్టుకొన్న 100 సీట్లలో మజ్లీస్ పార్టీకి పంచి ఇవ్వలేరు.   అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తను ముఖ్యమంత్రి కాలేకపోయినప్పటికీ వెనుక సీటులో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కనుక తను అట్టే బెట్టుకొన్న 100 సీట్లలో కనీసం 50-70 సీట్లయినా గెలుచుకోవలసి ఉంటుంది. కనుక లాలూ కూడా తన సీట్లలో మజ్లీస్ పార్టీకి వాటా పంచి ఇవ్వలేరు.   కనుక ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తుల కోసం మజ్లీస్ పార్టీ ప్రయత్నించవచ్చును. బీజేపీ ఎన్నడూ ముస్లిం ఓటు బ్యాంకు మీద ఆధారపడదు కనుక మజ్లీస్ ప్రవేశం దానిపై పెద్దగా నేరుగా ప్రభావం చూపకపోవచ్చును. కానీ ఒకవేళ మజ్లీస్-సమాజ్ వాదీ పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు లేదా స్నేహం కుదిరినట్లయితే బీజేపీ కూడా ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఏవిధంగా అంటే బీజేపీ కూడా సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు లేదా ఎన్నికల తరువాత మద్దతు కోసం ములాయం సింగ్ ని ద్రువ్వుతోంది.   ఒకవేళ ఆయన మజ్లీస్ పార్టీతో పొత్తులకి సిద్దపడినట్లయితే అప్పుడు ములాయం సింగ్ బీజేపీని దూరం పెట్టవచ్చును. మజ్లీస్-సమాజ్ వాదీ పార్టీలకి వామ పక్షాలు కూడా తోడయినట్లయితే బీహార్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతాయి. అప్పుడు మళ్ళీ బీజేపీ ఒక్కటీ ఒక్కవైపు, జనతా పరివార్+కాంగ్రెస్, వామపక్ష కూటమి+ సమాజ్ వాదీ పార్టీ+మజ్లీస్ మరో వైపు బరిలో నిలిచి పోటీపడవలసి ఉంటుంది.

కొత్త జిల్లాల ప్రతిపాదనని తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ పక్కన పెట్టిందా?

  తెలంగాణా రాష్ట్రంలో 10 జిల్లాలను పునర్విభజించి కొత్తగా మరో 10-15 జిల్లాలు ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో చాలా సార్లు చెప్పారు. తెరాస అధికారంలోకి రాగానే ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఊహించని అనేక సమస్యలు ఎదురవడంతో ఆ ప్రతిపాదనని పక్కనబెట్టేశారు. కానీ కొన్ని రోజుల క్రితం మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ప్రస్తావించి, దాని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. వారు ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించగానే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడతామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మళ్ళీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.   కొన్ని జిల్లా కేంద్రాలను, జిల్లాలో ముఖ్య పట్టణాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరాసలోనే వ్యతిరేకత ఎదురయినట్లు తెలుస్తోంది. ముందు నియోజక వర్గాలను పునర్విభజించిన తరువాతనే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ఆలోచించమని తెరాస నేతలే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగినట్లయితే పరిపాలన వికేంద్రీకరణ జరిగి జిల్లాల పాలన చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ సదరు జిల్లాలలో పాతుకుపోయున్న రాజకీయ నాయకులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. తమకు బాగా పట్టున ప్రాంతాలు వేరే జిల్లాలోకి వెళ్ళిపోతే, జిల్లాలో మళ్ళీ తమ స్థానం సుస్థిరం చేసుకొనే వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తేడా వస్తే అది వారి రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చును. అందుకే అన్ని పార్టీల నేతలు కొత్త జిల్లాల ప్రతిపాదనను అంగీకరించలేకపోతున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుకి అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అసంభవం. కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనని మళ్ళీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకొన్న తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.   ప్రతీసారి హడావుడిగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించడం, సమస్యలు ఎదురయిన తరువాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. రాజకీయ శత్రుత్వం కారణంగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించవని భావిస్తున్నట్లయితే ఆయా రంగాలలో నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకొన్నా ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఒకేసారి అన్ని జిల్లాలను పునర్విభజించాలని ప్రయత్నం చేయడం కంటే ముందుగా ఏదో ఒక జిల్లాను ఎంచుకొని దానిని పునర్విభజించడానికి ప్రయత్నిస్తే దానిలో కష్ట నష్టాలు అర్ధం అవుతాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ తొందరపడలేదు. ముందుగా రాజధాని అమరావతిని కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే మంచిదేమో!

బలమయిన పునాది నిర్మించుకొంటున్న నారా లోకేష్

  తెదేపా యువనేత నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు చాలా అవకాశం ఉన్నప్పటికీ ఆయన తొందరపడటం లేదు. 2014లో జరిగిన ఎన్నికలలోనే ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలలో లేదా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ వహారాల గురించి చర్చిస్తూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. నేటి నుండి ఆయన పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను మొదట తిరుపతి నుండి మొదలుపెడతారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, తాడేపల్లిగూడెం, అరుకు తదితర ప్రాంతాలలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు.   గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ అనుబంధం పెంచుకొన్నట్లయితే వారి పూర్తి మద్దతు పొందవచ్చును. పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించవచ్చును. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేసుకోవచ్చును. ఏదో ఒకనాడు ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయం కనుక ప్రస్తుతం ఆయన చేస్తున్న కృషి వలన చాలా మంచి ఫలితాలే ఆశించవచ్చును. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా పార్టీ వ్యవహారాలపై పట్టు పెంచుకొని అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు.   ఒకవేళ లోకేష్ కూడా ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినట్లయితే అప్పుడు తెరాస పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలనే తెదేపా కూడా ఎదుర్కోవలసి వచ్చేది. తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నంత కాలం పార్టీ వ్యవహారాలకే పూర్తి సమయం కేటాయించిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత పార్టీ వ్యవహారాలు చూసేందుకు అసలు సమయం కేటాయించలేకపోతున్నారు. కనుక పార్టీ వ్యవహారాలను చూసుకొనేందుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొడుకు కె.టి.ఆర్. ని కానీ కూతురు కవితను గానీ నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారిరువురూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కనుక వారికీ ఇటువంటి ఇబ్బందే ఎదురవవచ్చును. పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.   కనుక ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ వ్యవహారాలు చూసుకోవాలనే లోకేష్ నిర్ణయం సరయినదేనని స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకొని, పార్టీ వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించి తెదేపాని మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలిగితే ఇక నారా లోకేష్ వెనక్కి తిరిగి చూసుకోనవసరం ఉండదు. అప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు స్వీకరించవచ్చును.

బీహార్ లో బీజేపీకే విజయావకాశాలు?

  బీహార్ రాజకీయ పరిణామాలపై ఆమాద్మీ బహిష్కృత నేత యోగేంద్ర యాదవ్ చాలా చక్కగా విశ్లేషించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జెడి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు అందరూ కలిసి జనతా పరివార్ అనే కూటమిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారు బీజేపీని చూసి భయపడుతున్నట్లు ప్రకటించుకొన్నట్లయిందని అన్నారు. ఆరు పార్టీల జనతా పరివార్ కూటమి, దానితో కలిసిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీజేపీ ఒక్కటే ఒకవైపు ఉండటంతో ఆ ఏడు పార్టీల కంటే బీజేపీయే చాలా బలమయిన పార్టీ అని, అది మాత్రమే రాష్ట్రంలో సుస్థిరమయిన పరిపాలన అందించగలదని లాలూ, నితీష్ స్వయంగా ప్రజలకి చాటి చెప్పుకొన్నట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. జనతా పరివార్ ఏర్పాటు చేసుకోవడం వలన రాష్ట్ర ప్రజలలో ఇటువంటి భావన ఏర్పడేందుకు లాలూ, నితీష్ కుమార్ అవకాశం కల్పించారని ఆయన అన్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ రాష్ట్ర ప్రజలు బీజేపీకే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు.   యోగేంద్ర యాదవ్ విశ్లేషణ నూటికి నూరు పాళ్ళు నిజమని భావించవచ్చును. ఎందుకంటే, అధికారం కోసం అర్రులు చాచే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ వంటివారందరూ ఒక్క కూటమిగా ఏర్పడినప్పుడే వారు ఎంత కాలం కలిసి పనిచేయగలరనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జనతా పరివార్ లో ఆరు పార్టీలని జేర్పించడానికే వారు చాలా ప్రయాసపడవలసి వచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి, సీట్ల సర్దుబాట్లు వంటి అనేక అంశాల మీద వారి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఆ కూటమి నుండి నితీష్ కుమార్ తప్పుకొంటున్నట్లు ప్రకటిస్తే, ఇంకోసారి ములాయం సింగ్ తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఒకవేళ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి ఉండి ఉంటే ప్రజలకి వారి పార్టీలపై ఇంతకంటే ఎక్కువ విశ్వాసం ఏర్పడి ఉండేదేమో? కానీ కప్పల తక్కెడ వంటి జనతా పరివార్ లో ఏ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు బయటకు దూకేస్తుందో ఎవరూ ఊహించలేరు.   ఈ జనతా కప్పల తక్కెడ నుండి మిగిలిన కప్పలు గెంతి బయటకు పోకుండా పట్టుకొని ఉంచడం కోసం వారిద్దరూ చాలా కష్ట పడవలసివస్తోంది. జనతా పరివార్ లో నెలకొన్న ఈ అనిశ్చిత పరిస్థితిని చూసి సహజంగానే ప్రజలు సుస్థిరమయిన పాలనను అందించగల బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అదీగాక కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యనే బీహార్ రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీ కూడా ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం కట్టబెడితేనే ఆ మొత్తం మంజూరు అవుతుంది. లేకుంటే నిత్యం కేంద్రంతో పోట్లాడే నితీష్ కుమార్ చేతిలో అంత భారీ మొత్తం కేంద్రం పోస్తుందని ఆశించడం కష్టం. కనుక బీజేపీని గెలిపించడం వలననే బీహార్ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ఒకవేళ బీజీపీని కాదని అధికార దాహంతో అలమటించిపోతున్న లాలూ, నితీష్ కుమార్ కూటమికి ఓటు వేసినా వారిద్దరి గత చరిత్రలు చూసినట్లయితే సుస్థిరమయిన పరిపాలన అందించలేరని రుజువు చేసుకొన్నారు. ఒకవేళ ఎన్నికల వరకు జనతా పరివార్ విడిపోకుండా ఉండగలిగితే, ఎన్నికలలో గెలిచిన మరుక్షణం నుండి లాలూ, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్లాడుకోవచ్చును. ఒకవేళ ముఖ్యమంత్రి కుర్చీని నితీష్ కుమార్ కి వదిలిపెట్టినా లాలూ ప్రసాద్ వెనుక సీట్లో కూర్చొని నితీష్ ప్రభుత్వాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేయడం తధ్యం. అప్పుడు వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యి ప్రభుత్వం కూలిపోవచ్చును.   బీహార్ ప్రజలు ఇప్పటికే నితీష్, లాలూ పరిపాలనలను రుచి చూసి ఉన్నారు. వారిలో నితీష్ కుమార్ పరిపాలన మొదట్లో కొంచెం మెరుగుగా కనిపించినా తరువాత ఆయనలో కూడా అన్నీ లాలూ లక్షణాలే ప్రస్పుటంగా కనిపించడం మొదలుపెట్టాయి. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బీహార్ ప్రజలు ఎవరితోను పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగుతున్న బీజేపీకే అధికారం కట్టబెట్టవచ్చును.

రాయలసీమ అభివృద్ధి పేరుతో స్వార్ధ రాజకీయాలు చేస్తే?

  మాజీ మంత్రి టి.జి. వెంకటేష్ ఎన్నికలకు ముందు తెదేపాలో చేరినప్పటికీ, ఎన్నికలలో ఓడిపోవడంతో మళ్ళీ ప్రభుత్వంలో చేరి చక్రం తిప్పాలనే ఆయన ఆశ నెరవేరలేదు. బహుశః అందుకే ఆయన మొదటి నుండి తెదేపాతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. త్వరలోనే తెదేపాని వీడి స్వంత కుంపటి పెట్టుకోబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ గా వ్యవహరిస్తున్న టి.జి.వెంకటేష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ “త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి. ఒకవేళ ఇదే తీరుకొనసాగితే రాయలసీమ ప్రత్యక రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెడతాము,” అని ప్రకటించారు.   “రాయలసీమకు న్యాయం జరగాలంటే ఇక్కడ రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి. రాయలసీమ జిల్లాలకు సాగునీటి సౌకర్యం, పారిశ్రామిక అభివృద్ధి చేయవలసి ఉంది. కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలి. అదే విధంగా ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కూడా 6 జిల్లాలుగా విభజించాలి. కర్నూలులో ఉన్న భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడాన్ని మేము నిరసిస్తున్నాము. వృధాగా పడున్న ఆ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు నెలకొల్పడానికి కేటాయించాలి తప్ప పారిశ్రామికవేత్తలకు కాదు. గత ప్రభుత్వం ఆమోదించిన సుంకేశుల డ్యామ్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి,” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   టి.జి.వెంకటేష్ నిజంగానే రాయలసీమ అభివృద్ధిని కోరుకొంటున్నట్లయితే ఆయన అధికార పార్టీలోనే ఉన్నారు కనుక ఈ సమస్యలన్నిటినీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేయవచ్చును. కానీ మంత్రి పదవి లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నందునే ఆయన రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతున్నారని అర్ధం అవుతోంది. తనకు అధికారం దక్కకపోవడంతో రాయలసీమకి అన్యాయం జరిగిపోతోందని వాదిస్తూ అందుకోసం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించడం చాలా శోచనీయం. ఒకవ్యక్తి స్వార్ధం కోసం రాష్ట్రాన్నే విభజించాలని కోరుకోవడం చాలా దురదృష్టకరమయిన ఆలోచన అని చెప్పక తప్పదు.   రాయలసీమ అభివృద్ధి జరగాలని చెపుతున్న టి.జి.వెంకటేష్ పరిశ్రమల స్థాపనకు వృధాగా పడున్న ప్రభుత్వ భూములను ఇవ్వడాన్ని వ్యతిరేకించడం గమనార్హం. అదేవిధంగా అసంభవమని తెలిసి కూడా రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. కనుకనే సీమ జిల్లాలపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఆయనని నిలదీసేందుకు జగన్ ఉండనే ఉన్నారు. కనుక రాయలసీమ నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశమే లేదు.   కృష్ణా-గుంటూరు జిల్లాలలో రాజధాని ఏర్పాటు అవుతోంది కనుక అక్కడ మిగిలిన జిల్లాల కంటే వేగంగా అభివృద్ధి జరుగవచ్చును. కానీ అంతమాత్రాన్న మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందడం లేదని ప్రజలలో అపోహలు సృష్టించడం సరికాదు. శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద జపాన్ సంస్థ సహకారంతో అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏర్పాటు, చిత్తూరులో ఉన్నత విద్యాసంస్థలు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటుకి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయనే సంగతి ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ నేర్పిన గుణపాఠంతో ఇప్పుడు రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని జిల్లాలను సమానంగా సమగ్రాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్దం చేసి అమలుచేయడం మొదలుపెట్టింది.   రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతుంటే, అందరూ కలిసి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించకుండా అధికార దాహంతో ఈవిధంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం చాలా శోచనీయం. ఒకవేళ మళ్ళీ రాష్ట్ర విభజన ఆందోళనలు మొదలయితే ఇక ఆంద్రప్రదేశ్ మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేదనే వాస్తవం అందరూ గ్రహించి అటువంటి ప్రయత్నాలు చేయాలనుకొంటున్న స్వార్ధ రాజకీయ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలి.

బీహార్ రాజకీయాలలో ఊహించని పరిణామాలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికే అధికార జెడియు, ప్రతిపక్ష ఆర్.జె.డి. సమాజ్ వాదీ పార్టీ తదితర ఆరు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. కానీ ఆ కూటమికి అధ్యక్షుడయిన ములాయం సింగ్ కి చెప్పకుండా నితీష్ కుమార్, లాలూ ఇద్దరూ కలిసి మొత్తం అన్ని సీట్లు పంచేసుకోవడంతో ఆయన ఆగ్రహం చెంది కూటమి నుండి తప్పుకొని ఒంటరి పోరుకి సిద్దం అయ్యారు. ఆయనని వెనక్కి రప్పించేందుకు నితీష్, లాలూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి పరిణామం వారికి ఎదురుదెబ్బే. కానీ అది వారి స్వయంకృతపరాధమే.   సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీహార్ రాజకీయాలలో ఊహించని మరో పరిణామం ఏర్పడింది. ఇంతవరకు ఏదో ఒక ప్రధాన పార్టీ వెనుక తిరిగే వామపక్షాలన్నీ కలిసి వామపక్ష కూటమిని ఏర్పాటు చేసుకొని, బీహార్ ఎన్నికలలో జనత పరివార్, బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రత్యర్ధులను డ్డీ కొంటామని ప్రకటించాయి. ఈ వామపక్ష కూటమిలో సి.పి.ఐ., సి.పి.ఎం., సి.పి.ఐ.(ఎం.ఎల్.), ఎన్.యు.సి.ఐ., ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్.ఎస్.పి. భాగస్వాములుగా ఉంటాయి.   బీహార్ రాష్ట్రాన్ని ఇంతవరకు పరిపాలిస్తున్న భూస్వామ్య, కుల శక్తులను, రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న బీజేపీని, కార్పోరేట్ శక్తులను ఎదుర్కొని బీహార్ రాష్ట్రంలో ప్రజాహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వామపక్ష కూటమి నేతలు చెపుతున్నారు. బీహార్ రాజకీయాలలో ఇంతవరకు కుల సమీకరణలే నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వచ్చాయి. కానీ నక్సల్స్ పీడిత బీహార్ రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం కూడా చాల అధికంగానే ఉంది. కానీ ఇంతవరకు వామపక్షాలు కూటమిగా ఏర్పడకపోవడంతో రాష్ట్ర రాజకీయాలలో వాటి ఉనికి పెద్దగా కనబడలేదు. రాజకీయాలపై ప్రభావం చూపలేకపోయాయి. అవిప్పుడు సంఘటిత శక్తిగా అవతరించడంతో జనతా పరివార్, బీజేపీలకు ఎన్నికలలో సవాలు చేస్తున్నాయి. కానీ కుల ప్రభావం చాలా అధికంగా ఉండే బీహార్ రాజకీయాలలో వామ పక్షాలు కూటమిగా ఏర్పడినప్పటికీ ఎన్నికలలో గెలిచి స్వయంగా అధికారం చేప్పట్టే అవకాశం లేదనే భావించవచ్చును. కానీ ఈసారి ఎన్నికలలో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు బీజేపీ, జనతా పరివార్, వాటితో జత కట్టిన కాంగ్రెస్, ఒంటరిగా బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయినట్లయితే, ఈసారి బీహార్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చును.   ఈ ఎన్నికలలో ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ కనుక ఎక్కువ స్థానాలలో గెలవగలిగితే అదే ‘కింగ్ మేకర్’ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన ఏ పార్టీ లేదా కూటమి వైపు మ్రోగ్గితే దానికే అధికారం దక్కవచ్చును. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకొన్నందునే జనతా పరివార్ ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ఆరోపించారు. ఒకవేళ జైరామ్ ఆరోపణలు నిజమనుకొంటే బీహార్ రాష్ట్రంలో బీజేపీ లేదా బీజేపీ మద్దతుతో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ బీహార్ రాజకీయ పార్టీలన్నీ అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందాయి. కనుక ఏ క్షణంలో ఎవరు ఏ ఏ పార్టీతో ఉంటారో, ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరూ ఊహించలేరు. కనుక అక్కడ ఎప్పుడూ ఏమయినా జరుగవచ్చును.

ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!

  సుమారు నాలుగు దశాబ్దాలుగా వన్ ర్యాన్ వన్ పెన్షన్ అమలుచేయమని భారత మాజీ సైనికులు ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే ఇంత కాలం వారి గోడుపట్టించుకొనేవారే లేరు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన 15నెలల్లోనే వారి సమస్యను తన శక్తిమేర పరిష్కరించారు. రక్షణమంత్రి మనోహర్ పర్రికర్ శనివారం ఈ వన్ ర్యాన్ వన్ పెన్షన్ విధానాన్ని జూలై 1, 2014 నుండి అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిననాటి నుండి అన్నమాట. ఈ పెన్షన్ విధానంలో ముఖ్యాంశాలు:   1. తక్షణమే అమలులోకి వస్తున్న ఈ పెన్షన్ విధానం జూలై 1, 2014 నుండి వర్తింపజేయబడుతుంది.   2. మాజీ సైనికులు, సైనికాధికారుల వితంతువులకు మరియు అమరవీరులయిన సైనికుల, అధికారుల భార్యలకు జూలై 1, 2014 నుండి నేటి వరకు ఎర్రియర్స్ ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించబడుతుంది.   3. మాజీ సైనికులు, అధికారులకు మాత్రం ఈ ఎర్రియర్స్ రెండు మూడు వాయిదాలలో చెల్లించబడుతుంది.   4. ఈ పెన్షన్ విధానం సైన్యంలో పూర్తి కాలం పనిచేసి పదవీ విరమణ పొందినవారికి మాత్రమే వర్తిస్తుంది. వివిధ కారణాల చేత స్వచ్చందంగా పదవి విరమణ చేసిన వారికి ఇది వర్తించదు.   5. ప్రతీ ఐదేళ్ళకు ఒకసారి ఈ పెన్షన్ పెంచబడుతుంది. ఎంత అనేది అప్పటి పరిస్థితులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయిస్తుంది.   6. ఒకే హోదాలో ఒకే నిర్దిష్ట కాలంపాటు పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికులకు, సైనికాధికారులకు ఒకే విధంగా పెన్షన్ చెల్లించబడుతుంది. ఉదాహరణకి కొత్తగా పదవీ విరమణ చేస్తున్న సైనికుడు నెలకి రూ. 15, 000 పెన్షన్ అందుకొంటున్నట్లయితే, పదేళ్ళ క్రితం అదే హోదాలో అంతే సమయం పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికుడుకి ఒకవేళ నెలకి రూ.8500 అందుకొంటున్నట్లయితే, జూలై 1, 2014 నుండి ఆ సైనికుడికి కూడా నెలకి రూ. 15, 000 పెన్షన్ చెల్లింపబడుతుంది. ఈ నూతన పెన్షన్ విధానం వలన చాలా కాలం క్రితం పదవీ విరమణ చేసిన సైనికులు, సైనికాధికారులు, వితంతువులకి పెన్షన్ ఒకేసారి చాలా భారీగా పెరుగుతుంది. అందుకే మాజీ సైనికులు ఈ ఒకే హోదా-ఒకే పెన్షన్ కోసం చిరకాలంగా ప్రభుత్వాలని అడుగుతున్నారు.   7. ఈ నూతన పెన్షన్ విధానం 2013 సం.లో గరిష్ట మరియు కనిష్ట పెన్షన్ల ఆధారంగా లెక్క వేయబడుతుంది.   8. దీని కోసం ఒక మాజీ న్యాయమూర్తితో కూడిన జ్యూడిషియరీ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విధానంలో లోటుపాట్లలను, ఎదురయ్యే సమస్యలపై అధ్యయనం చేసి ప్రతీ అరు నెలలకి ఒకసారి ఆ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇస్తుంటుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ నూతన పెన్షన్ విధానాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తుంటుంది.   9. జూలై 1, 2014 నుండి నేటి వరకు మాజీ సైనికులకు చెల్లించాల్సిన ఎర్రియర్స్ సుమారు రూ. 10,000-12, 000 కోట్ల వరకు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ తెలిపారు. ఈ ఆర్ధిక సం.లో మాజీ సైనికులకు పెన్షన్ కోసం బడ్జెట్ లో కేటాయించిన రూ.58, 000 కోట్లకు ఇది అధనం అవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి ఇది కొంచెం భారమే అయినప్పటికీ సైనికులు దేశానికి చేసిన, చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్రికర్ తెలిపారు.

ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?

  బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు పార్టీలు కలిసి జనత పరివార్ పేరుతో చేతులు కలిపాయి. వాటికి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ని అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. ఆయన పాత్ర అంతవరకే పరిమితమన్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా తలో వంద సీట్లు పంచేసుకొని, మిగిలిన 43 సీట్లలో 40 కాంగ్రెస్ పార్టీకి మిగిలిన3 సీట్లు ములాయంకి వదిలేశారు.   అధ్యక్షుడయిన తనకు తెలియజేయకుండా, తన పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించకుండా నితీష్, లాలూ, కాంగ్రెస్ ముగ్గురూ కలిసి తనను మోసం చేసారని ములాయం సింగ్ తీవ్ర ఆగ్రహం చెందారు. జనతా పరివార్ కాడిని వదిలేస్తున్నట్లు ప్రకటించేశారు. అంతేకాదు ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా ప్రకటించేసరికి నితీష్, లాలూ ఇద్దరూ కంగుతిన్నారు. వెంటనే ఇద్దరూ హడావుడిగా డిల్లీ వెళ్లి ములాయం ముందు వాలిపోయారు. జనత పరివార్ విడిపోతే అందరం నష్టపోతామని, బీజేపీ అధికారం ఎగరేసుకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన వాటా సీట్లు తనకు పంచి ఇస్తే గానీ తిరిగి రానని ములాయం కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తాజా సమాచారం.   ములాయం సింగుకి కూడా సీట్లలో వాటా పంచి ఇవ్వాలంటే నితీష్, లాలూ తమ సీట్లలో కొన్నిటిని వదులుకోవలసి ఉంటుంది. అలాగ చేస్తే అప్పుడు జనతా పరివార్ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినా వారికి ప్రభుత్వంపై పూర్తి పట్టు దొరకదు. అప్పుడు ఎవరో ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. నితీష్ కుమార్ జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరును ప్రకటింపజేసుకొన్నందున అందుకు అంగీకరించకపోవచ్చును. కనుక లాలూ తన సీట్లలో కొన్నిటిని త్యాగం చేయవలసి ఉంటుంది. కానీ అలాగ చేస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి వీలుపడదు. కనుక లాలూ కూడా తన సీట్లను త్యాగం చేసేందుకు ఇష్టపడకపోవచ్చును.   అప్పుడు ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. అదేమీ జనత పరివార్ లో భాగస్వామి కాదు. ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేకనే జనతా పరివార్ ని పట్టుకొని వ్రేలాడుతోంది. కనుక దానికిచ్చిన 40సీట్లను లాక్కొని దానిని బయటకి గెంటేసినా దాని వలన పెద్దగా నష్టం ఉండదు. కనుక ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఓ ఐదో పదో సీట్లతో అది సర్దుకుపోయేందుకు ఇష్టపడితే దానినీ తమతో ఉంచుకోవచ్చును. లేకుంటే ముగ్గురూ కలిసి నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ ని బయటకి గెంటేయవచ్చును. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. కనుక కాంగ్రెస్ వారితో సర్దుకుపోయేందుకే రెడీ అవవచ్చును.   ఒకవేళ వారి మధ్య సీట్ల సర్దుబాటు కాకపోతే మాత్రం బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ముక్కలు చెక్కలయిన జనతా పరివార్ తో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఎన్నికలలో కబాడీ ఆడేసుకొంటారు.

రాజకీయ నేతల మాటల ప్రభావం వల్లనే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయా?

  ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో రాష్ట్రంలో నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకొంటున్నారు. కానీ వారు ప్రత్యేక హోదా గురించి కొందరు రాజకీయ నాయకులు చెపుతున్న మాటల ప్రభావానికి లోనయినందునే ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన తరువాతనే పైకి వచ్చింది. అప్పుడూ దాని గురించి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలు పెట్టి ‘ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు...మీ పిల్లలకు ఉద్యోగాలు రావు...వారి భవిష్యత్ అంధకారం అయిపోతుంది’ అని పదేపదే నొక్కి చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండే రాష్ట్రంలో ఆత్మహత్యలు మొదలయ్యాయి. పేద, దిగువ మధ్య తరగతికి చెందినవారి ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కనుక వారు నిత్యం కష్టాలు, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి వారిపై ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు పెను ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నేతలు ప్రజలకు వారి భవిష్యత్ పట్ల ఆశ, భరోసా కల్పించకపోగా తమ మాటలతో వారిని తీవ్ర ప్రభావితం చేసి వారు ప్రాణాలు తీసుకొనేందుకు ప్రోత్సహిస్తున్నట్లుంది. వారు తమ మాటలతో సమాజాన్ని ముఖ్యంగా నిరుపేదలని ‘మాస్ హిప్నటైజ్’ చేస్తున్నారని చెప్పవచ్చును. ప్రజలకు సరయిన మార్గ దర్శనం చేయగలిగినవాడే నాయకుడు తప్ప ప్రజలని మృత్యు మార్గం పట్టించేవాడు కాదు.   ప్రజలు కూడా ఇప్పుడు పార్టీల వారిగా చీలిపోతున్నారు. కనుక వారిపై సదరు పార్టీ నేతలు మాటల ప్రభావం సహజంగానే మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకే చెందిన మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమే. కానీ అది రానంత మాత్రాన్న ప్రళయం రాదనే సంగతి ప్రజలు కూడా తెలుసు. అటువంటప్పుడు రాజకీయ నేతలు తమ పార్టీల ఉనికిని కాపాడుకోవడానికో లేక తమ పార్టీలో నేతలు, కార్యకర్తలు వేరే పార్టీల వైపు చూడకుండా పట్టి ఉంచుకోనేందుకో లేకపోతే ప్రజలకు, అధికార పార్టీకి తమ శక్తి ప్రదర్శించడానికో చేస్తున్న పోరాటాలు, మాట్లాడుతున్న మాటలను నమ్మి ఆత్మహత్యలు చేసుకోవడం అవివేకం. దాని వలన వారి కుటుంబాలే రోడ్డున పడుతాయి. కానీ వారి ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తూ పార్టీలు మరింత బలపడే ప్రయత్నాలు చేస్తుండటం మన కళ్ళ ముందే జరుగుతోంది. కనుక ప్రజలు భావోద్వేగాలకు లొంగి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం వలన సాధించేదేమీ ఉండదని గ్రహించాలి.   రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడూ ఆంధ్రా ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు రాలేదు. అన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. కానీ అప్పుడు ఎవరూ ఈవిధంగా వరుసపెట్టి ఆత్మహత్యలు చేసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేని మాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి వలన ఇప్పటికే చిత్తూరు, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాలలో చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ సిటీ, కృష్ణపట్నం వద్ద అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీలు, ప్రోత్సాహకాల వలన అక్కడ చాలా పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. నిజం చెప్పాలంటే రాష్ట్ర విభజన తరువాతే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకొంది. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు అయితే అది మరింత వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది. అంతే!   రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొత్తగా ఎన్ని, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి? వాటి వలన ఎంత మందికి ఉపాధి దొరకబోతోంది? ఇంకా మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టబోతోంది? దాని వలన ప్రజలకు, ముఖ్యంగా యువతకు, నిరుపేదలకు ఏవిధంగా ప్రయోజనం కలుగబోతోంది? అనే విషయాల గురించి ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేయడం ద్వారా ఈ ఆత్మహత్యలను నివారించవచ్చును.   ఈ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా చేసుకొంటున్నప్పుడు, ప్రభుత్వం కూడా దానిని ఒక రాజకీయ, సామాజిక సమస్యగా పరిగణించి అంతే ధీటుగా ఎదుర్కొనవలసి ఉంది. లేకుంటే ప్రత్యేక హోదా వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో తెలియని రమణయ్య వంటి అమాయకులు ప్రాణాలు తీసుకొంటూనే ఉంటారు. వారు ఆత్మహత్యలు చేసుకొంటున్నకొద్దీ ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.

ఒక వివాదం నుండి మరో వివాదానికి నిరంతర ప్రయాణం

  తెలంగాణాలో గుడుంబాని అరికట్టేందుకే చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నామని చెప్పుకొన్న తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ఆలోచనని విరమించుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలిపారు. ఎప్పుడూ ఎవరివో మెడలు వంచుతానని చెప్పుకొనే కేసీఆర్ మెడని తామే వంచామని ప్రతిపక్షాలు చెప్పుకొంటున్నాయి. ఒకవిధంగా అది నిజం కూడా. సచివాలయ నిర్మాణం కోసం ఎర్రగడ్డలో ఉన్న ఆసుపత్రులను, వాటితో బాటే పక్కనే ఉన్న చారిత్రాత్మక కట్టడాన్ని కూల్చివేయాలనుకోవడం, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల్లో పేదలకు ఇళ్ళు కట్టించాలనుకోవడం, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయాలనుకోవడం, తెలంగాణా వ్యాప్తంగా కల్లు, చీప్ లిక్కర్, మైక్రో బ్రూవరీ (బీర్ వెండింగ్ మెషిన్లు) లను ఏర్పాటు చేయాలనుకోవడం ఇలాగ చెప్పుకొంటూ పోతే ఆ లిస్టు చాంతాడంతవుతుంది. ఆ నిర్నయాలన్నిటినీ వెనక్కు తీసుకొనేలా చేసింది ప్రతిపక్షాలే.   ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ఏదో ఒకటి ఆర్భాటంగా ప్రకటించడం, దానిని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం తరువాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. అనేక కేసుల విషయంలో కూడా తెలంగాణా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన తరచూ కోర్టుల చేత అక్షింతలు వేయించుకోవలసి వస్తోంది. ఇదంతా తెలంగాణా ప్రభుత్వానికి గౌరవప్రదం కాదనే సంగతి గ్రహిస్తే మంచిది. చీప్ లిక్కర్ పై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరో వివాదస్పద నిర్ణయం ప్రకటించారు.   జి.హెచ్.యం.సి. పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల వలన కలిగే నష్టాన్ని జి.హెచ్.యం.సి.యే భరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే అది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లేనని చెప్పవచ్చును. నిధుల కొరత వలన జి.హెచ్.యం.సి. పరిధిలో రోడ్లు, మురికి కాలువలు, మంచి నీళ్ళు, వీధి దీపాలు వగైరా సరిగ్గా నిర్వహించలేకపోతున్నట్లు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అటువంటప్పుడు ఎప్పుడూ నష్టాలలోనే కొనసాగే ఆర్టీసీ భారాన్ని కూడా జి.హెచ్.యం.సి.మీద మోపడం ఏవిధంగా సమర్ధించుకొంటుంది? అసలు తెలంగాణా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆర్టీసీ భారాన్ని జి.హెచ్.యం.సి. నెత్తిన ఎందుకు రుద్దాలనుకొంటోంది? అనే సందేహం కూడా కలగక మానదు. జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాస విజయావకాశాలపై బహుశః నమ్మకం లేనందునే ప్రతిపక్షాల చేతిలోకి వెళ్లబోయే జి.హెచ్.యం.సి.పై ఆ భారం మోపాలనుకొంటోందా? అనే అనుమానం కలగడం సహజం. కనుక నేడో రేపో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ పోరాటాలు ఆరంభించినా ఆశ్చర్యం లేదు.   ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకొని నష్టాల నుండి బయటపడేయాలని కోరుతుంటే, ప్రభుత్వం వారిని జి.హెచ్.యం.సి.కి అప్పగిస్తే వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ జి.హెచ్.యం.సి. ఆ భారం మోయలేకపోతే అప్పుడు దానిని ఎవరు భరిస్తారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలే కాదు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, జి.హెచ్.యం.సి. కూడా వ్యతిరేకించినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ అప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తీసుకొంటుందేమో? అందుకేనేమో అడుసు త్రొక్కనేల...కాలు కడుగనేల? అని పెద్దలు అన్నారు.

ఆనాడు సమైక్యం ఈనాడు ప్రత్యేకం...

  రాష్ట్ర విభజన చేసినందుకు ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతికించుకొనేందుకు ఆ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. బహుశః కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితిని ముందే పసిగట్టి దానిని తిరిగి బ్రతికించుకోవడానికే బహుశః ఈ ప్రత్యేక ఆయుధాన్ని ముందే రూపొందించిందేమో? బహుశః అందుకే అసాధ్యమని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తున్నట్లు ఆనాడు డా. మన్మోహన్ సింగుతో పార్లమెంటులో ప్రకటింపజేసిందేమో?   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని మళ్ళీ బలపడే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, దానిని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పసిగట్టడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చును. అందుకే ఆయన ఇంతకాలం ఆ ప్రసక్తే ఎత్తలేదు. కానీ రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా విఫలం అవడంతో ఆ పార్టీ నిర్వహించాల్సిన బాధ్యతని తమ పార్టీ నిర్వర్తిస్తోందని చెప్పడంతో ఉలిక్కిపడిన జగన్ ఆనాటి నుండే ఈ ప్రత్యేక పోరాటాలు మొదలుపెట్టిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.   రాహుల్ గాంధీ విమర్శలు చేసిన కొన్ని రోజులకే జగన్ హడావుడిగా డిల్లీ వెళ్లి ధర్నా చేసి రావడం, తరువాత మొన్న 29న దీని కోసం రాష్ట్ర బంద్ నిర్వహించడం, అసెంబ్లీలో దీనిపై రభస చేయడం, త్వరలో ఆమరణ నిరాహార దీక్ష అన్నీ కూడా ప్రత్యేక హోదా పోరాటంలో తను ఛాంపియన్ అనిపించుకొని ప్రజల మెప్పు పొందడానికేనని స్పష్టం అవుతోంది. ఇదివరకు సమైక్యాంధ్ర ఛాంపియన్ అనిపించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డితో పోటీ పడ్డ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్నారు. అప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తే ఇప్పుడు తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని దెబ్బ తీసేందుకు ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నట్లున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని జగన్ యుద్ధం చేస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వంపై పల్లెత్తు మాటనడం లేదు. ప్రశ్నించడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమయితే ఆయన చంద్రబాబుని నిలదీయడం, ఆయనకి 15రోజులు గడువు విధించడం గమనిస్తే ఆయన పోరాటం దేని కోసమో ఎవరి మీదనో అర్ధం అవుతోంది.   ఈనెల 15లోగా ప్రత్యేక హోదా సాధించలేకపోయినట్లయితే 16 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని జగన్ నిన్న ప్రకటించారు. అయితే ఆయన డిల్లీలో ఐదు గంటలపాటు చేసిన ధర్నాపై మోడీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు కూడా. మరి ఆయన దీక్ష చేసి ఏమి సాధించగలిగారు? అంటే మీడియాని, తద్వారా రాష్ట్రప్రజలని ఆకట్టుకొని “ప్రత్యేక ఛాంపియన్” అనిపించుకోవడం తప్ప సాధిందేమీలేదనే చెప్పవచ్చును. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఆ తరువాత బంద్, మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దపడుతున్నట్లుంది.   వైకాపాకి ఈ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే దీని గురించి పోరాటం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి, నటుడు శివాజీకి ఎందుకు బేషరతుగా మద్దతు ఈయలేదు? అనే సందేహం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తే ఆ క్రెడిట్ అంతా ఆ పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా సినిమా హీరో శివాజీకి మద్దతు ఇస్తే ఆయన ప్రజల్లో నిజమయిన హీరోగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని జగన్ ఆశిస్తున్న కారణంగానే వారి పోరాటాలకి మద్దతు ఇవ్వలేదని భావించవచ్చును. వారి ప్రత్యేక పోరాటాలను హైజాక్ చేసిన తరువాత ఇప్పుడు తనే ప్రత్యేక ఛాంపియన్ గా ప్రజలలో గుర్తింపు సంపాదించుకోనేందుకే జగన్ ఆరాటపడుతున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   చేసే పనిలో చిత్తశుద్ది లోపిస్తే దాని కోసం ఎంత కష్టపడినా వృధాయేననే సంగతి నేటికీ జగన్ గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకు ముందు జగన్ వంటి రాజకీయ నాయకులు చాలా సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేసారు. చివరికి అవి ఏవిధంగా ముగుస్తాయో ప్రజలకీ అర్దమయిపోయింది. అయినా జగన్ మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి పూనుకొంటున్నారంటే ‘ప్రత్యేక ఛాంపియన్’ అనే గుర్తింపు కోసమేనని సర్దిచెప్పుకోక తప్పదు.

చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు తెచ్చారు?

  ఈరోజు ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ప్రత్యేక హోదా అంశంపై వైకాపా రాద్దాంతం చేస్తుందని ప్రభుత్వం ముందే ఊహించింది. ఊహించినట్లే జగన్ తెదేపా, బీజేపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ అధిష్టానం-జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రస్తావన చేసి జగన్ బండారాన్ని బయటపెట్టారు.   అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై ఏకంగా 11 చార్జ్ షీట్లు నమోదు చేయబడ్డాయి. ఒకవేళ ఆ సమయంలో రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు జరగకపోయినట్లయితే బహుశః ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉండేవారేమో కూడా. తెలంగాణాలో ఉద్యమాలు ఉదృతం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొంది. అయితే కేవలం ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గే తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సిద్దపడిందని అనుకోవడానికి లేదు. మోడీ ప్రవేశంతో కేంద్రంలో తిరిగి అధికారం నిలబెట్టుకొనే అవకాశాలు సన్నగిల్లాయనే వాస్తవాన్ని చాలా ముందే పసికట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక వ్యూహం అమలుచేయడం ద్వారా తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలనుకొంది.   ఆ ప్రయత్నాలలో భాగంగానే రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ విజయం సాధించవచ్చని భావించింది. కానీ రాష్ట్ర విభజన చేసినట్లయితే ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని గ్రహించడంతో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను జగన్ కి అనుకూలంగా మలిచి ఎన్నికల అనంతరం వైకాపా మద్దతు పొందవచ్చని ఎత్తు వేసింది.   కాంగ్రెస్ అధిష్టానం-జగన్ మధ్య రహస్య అవగాహన కుదరడం వలననే జగన్ పై 11 చార్జ్ షీట్లు నమోదు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అకస్మాత్తుగా మహారాష్ట్రాకి బదిలీ అయిపోయారు. ఆయన బదిలీ అయిపోవడం, తరువాత జగన్ తో సహా అందరికీ బెయిలు మంజూరు అవడం, ఆ కేసులను ఎక్కడో చెన్నైలో సీబీఐ అధికారికి బదలాయించడం, క్రమంగా అవన్నీ అటకెక్కడం, ఎన్నికలు జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి.   కాంగ్రెస్-వైయస్సారో కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో డ్డీ కొనబోతున్న తరుణంలో కూడా “జగన్ నా కొడుకు వంటివాడు,” అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్ అనడం గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య అవగాహనా ఉందని అర్ధమవుతోంది. అలాగే “ఎన్నికల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది,” అని వైకాపాలో చేరాలనుకొన్న సబ్బం హరి విస్పష్టంగా ప్రకటించడం మరో ఉదాహరణ. కానీ ఆయన తమ రహస్య అవగాహనని బయటపెట్టడంతో, ప్రజలలో కాంగ్రెస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత తన పార్టీకి ఎదురవుతుందనే భయంతో సబ్బం హరికి పార్టీలో రాకముందే తలుపులు మూసేశారు.   చివరికి కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. తెరాస, వైకాపాలు రెండూ హ్యాండిచ్చాయి. వైకాపా వ్యూహం కూడా బెడిసి కొట్టింది. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారం నిలబెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఆ రెండు పార్టీలు ఇప్పుడు యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉండేవేమో? కానీ కాంగ్రెస్ ఓడిపోవడంతో రహస్య ఒప్పందాలన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఈ రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీయే చివరికి అన్ని చోట్లా ఓడిపోగా అందులో పాల్గొన్న తెరాస, వైకాపాలు లబ్ది పొందాయి.   కానీ కాంగ్రెస్ అధిష్టానంలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా కొంచెం అతి తెలివితేటలు, అతి విశ్వాసం ప్రదర్శించడంతో ఎన్నికలలో బోర్లాపడ్డారు. కానీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చాలా తెలివిగా పావులు కదుపుతూ విజయం సాధించగలిగారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం బలయిపోయింది. కానీ సరిగా ఆ కారణంగానే జగన్ జైలు నుండి విముక్తి పొందడమే కాకుండా, కాంగ్రెస్ కోరుకొన్నట్లే దాని ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకొని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదగగలిగారు. కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోలేకపోయారు. దానికి చంద్రబాబు నాయుడు సైందవుడిలా అడ్డుపడ్డారనే దుగ్ధతో అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొంటూ ఆయనపై ప్రయోగిస్తున్నారు.   ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయనని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో జగన్ నిర్వాకాన్ని ఎండగట్టారు. పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసివేసి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుని ఆమోదిస్తున్నప్పుడు జగన్ ఎక్కడ దాకొన్నారు? అని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న రహస్య ఒప్పందం లేదా అవగాహన కారణంగానే, అత్యంత ముఖ్యమయిన సమయంలో జగన్ పార్లమెంటుకి వెళ్ళకుండా డుమ్మా కొట్టారని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. రాష్ట్ర విభజనకి పరోక్షంగా కారకుడయిన అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఉద్యమించడం, దాని ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని భావించిన చంద్రబాబు నాయుడు కూడా క్రమంగా మరుగునపడుతున్న కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన ఈ తెరచాటు వ్యవహారాన్ని ఆయనకు శాసన సభ సాక్షిగా మరొక్కమారు గుర్తు చేసారు.

ఈ ప్రత్యేక పోరాటాలు దేని కోసం?

  ప్రత్యేక హోదా కోరుతూ ఈరోజు ఏపీ రాష్ట్ర బంద్ నిర్వహిస్తోంది వైకాపా. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, అందరూ కలిసి పోరాటాలు చేస్తే కేంద్రమయినా, చంద్రబాబు నాయుడయినా దిగిరాక తప్పదని జగన్ వాదిస్తున్నారు. తమ పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ ని అడ్డుకొన్నవారు చరిత్రహీనులు అవుతారని శపిస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వస్తాయని యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే, హోదా అక్కరలేదు ప్యాకేజి చాలని ముఖ్యమంత్రి అంటున్నారని, దాని వలన యువత తీవ్రంగా నష్టపోతారని జగన్ వాదిస్తున్నారు.   రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇటువంటి సమయంలో చాలా సంయమనం పాటించాల్సిన ప్రతిపక్షాలు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అధికార పార్టీపై రాజకీయ కక్ష తీర్చుకొనేందుకు ప్రత్యేక హోదా పేరుతో చేస్తున్న ఈ ధర్నాలు, బంద్ ల వలన ఇప్పటికే దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మరింత దిగజారడం తధ్యం. వాటి ఆందోళనలు, ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చూసి రాష్ట్రానికి రావాలనుకొంటున్న పరిశ్రమలు కూడా వెనక్కి మళ్ళిపోయే ప్రమాదం ఉంది. “రాష్ట్రాభివృద్దికి సహకరిస్తాము” అని చెపుతున్న వైకాపా అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా పేరిట రాష్ట్రంలో బందులు ధర్నాలు చేస్తూ రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం సృష్టిస్తూ, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూసేందుకే భయపడేలా చేస్తోంది.   ఒకప్పుడు తెలంగాణాలో తెరాస పోషించిన పాత్రనే ఇప్పుడు ఆంధ్రాలో వైకాపా పోషిస్తోందని చెప్పవచ్చును. ఆనాడు తెరాస చేసిన పొరపాట్లకు తెరాస ప్రభుత్వం ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కలలు సాకారం చేసుకోవడానికి జరుపుతున్న పోరాటాలకి రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడమే ముఖ్యం తప్ప అది ప్రత్యేక హోదా ద్వారా జరగాలా లేక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా జరగాలా అనేది ముఖ్యం కాదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకుపోయే పరిస్థితులు లేవని గ్రహించి, ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని వైకాపా పట్టుబట్టడం చూస్తుంటే ఆ పార్టీకి ప్రత్యేక హోదా అనేది తమ పోరాటాలను కొనసాగించేందుకు ఒక వంక మాత్రమేనని అర్ధం అవుతోంది.   ఈ అంశం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. కానీ జగన్ కేంద్రాన్ని నిలదీయకుండా ఎంతసేపూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం గమనిస్తే అయన పోరాటం ఎవరి మీదో, ఎందుకోసమో అర్ధం అవుతుంది. అలాగే మరో మూడేళ్ళలో తెదేపా ప్రభుత్వం కూలిపోవడం తధ్యమని, తమ పార్టీ అధికారంలోకి రావడం, తను ముఖ్యమంత్రి అవడం తధ్యమని ఆయన పదేపదే చెప్పుకోవడం గమనిస్తే ఆయన చేస్తున్న ఈ పోరాటాలన్నీ అందుకేనని అర్ధం అవుతోంది.   నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, కొన్ని వారాల క్రితం రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చినప్పుడు వైకాపా కంటే తమ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా గురించి గట్టిగా పోరాడుతోందని ప్రకటించగానే, మేల్కొని పోరాటం ఆరంభించిన సంగతి ప్రజలు చూస్తూనే ఉన్నారు. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే తమ పార్టీ వెనుకబడిపోయిందనే దుగ్ధ తప్ప ప్రత్యేక హోదా కోసం కాదని అర్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకొంటే అప్పుడు ఆ పార్టీని కూడా వైకాపా ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితి కలుగకూడదంటే, దానికంటే ఉదృతంగా ఉద్యమాలు చేసి ప్రజలు తనవైపు ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. బహుశః అందుకే జగన్ ప్రత్యేక హోదా కోసం అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టినట్లుంది.   కానీ దాని వలన రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతుందని తెలిసినా, భావోద్వేగాలకు లోనయి ప్రజలు ప్రాణాలు తీసుకొంటున్నారని తెలిసినా వైకాపా ఈవిధంగా బందులు, ధర్నాలు చేయడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చూస్తే జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఉన్న తేడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. “ప్రత్యేక హోదా గురించి మోడీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొంటారని ఆశిస్తున్నాను. కనుక దేశ మరి కొంత కాలం వేచి చూద్దాం. అప్పటికీ న్యాయం చేయకపోతే ఏమి చేయాలో అప్పుడు ఆలోచిద్దామని” ట్వీట్ మెసేజ్ పెట్టారు. అలాగే ఇంతకు ముందు పోస్ట్ చేసిన ట్వీట్ మేసేజులో రాజకీయ పార్టీలకు ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఉండాలని తెలిపారు. కానీ వైకాపా చేస్తున్న ఈ ధర్నాలు, బంద్ ల వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇంకా దిగజారిపోయి, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని జగన్ భావిస్తున్నట్లున్నారు. కనుక ఆయన ముఖ్యమంత్రి కలలు నెరవేర్చుకోవడానికి చేస్తున్న ఈ పోరాటాలలో పాల్గొనాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవలసి ఉంటుంది.