కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ర్ట విభజనకు ఆలోచిస్తోందా?
విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, "తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోయాయి. అలాగే సామాజిక వర్గాల మధ్య అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్దిని, అధికారాన్ని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్న కారణంగానే ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. కానీ ఆయన ఎవరి మాట వినే పరిస్థితిలో లేరిప్పుడు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సామాజిక అసమానతలు, కొన్ని వర్గాల మధ్య సమతుల్యత దెబ్బ తింటోంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని ఏకధాటిగా పదేళ్ళపాటు పరిపాలించింది. తెలంగాణా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని కాంగ్రెస్ హయాంలోనే ఉద్యమాలు ఊపందుకొని చివరికి కాంగ్రెస్ స్వహస్తాలతోనే రాష్ట్ర విభజన చేయవలసివచ్చింది. ఇప్పుడు ప్రాంతీయ అసమానతల గురించి మాట్లాడుతున్న రఘువీరా రెడ్డి, అప్పుడు మంత్రిగా ఉండేవారు. కానీ ఆయన అప్పుడు వాటి గురించి మాట్లాడలేదు? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకటి రెండు సామాజిక వర్గాలతో కూడిన ప్రభుత్వమేనని అందరికీ తెలుసు. రఘువీరా రెడ్డికి అప్పుడు ఈ సామాజిక అసమానతలు గుర్తుకు రాలేదు?
అధికారంలో ఉంటే ఒకలాగ, లేకపోతే మరొకలాగ మాట్లాడటం రాజకీయ నేతలందరికీ అలవాటే. కాకపోతే కాంగ్రెస్ నేతలకి మరికొంచెం ఎక్కువ అలవాటు. ఎందుకంటే వారికి పదవులు, అధికారం వాటి కోసం రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ద, రాష్ట్రాభివృద్ధిపై లేదు. తమ రాజకీయ అవసరాలను చూసుకొనే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మరోమారు అదే తప్పు చేయడానికి సిద్దపడుతున్నట్లుంది. అందుకే ప్రాంతీయ అసమానతలు, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడుతూ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలో రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ శక్తికి మించిన పనే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందుతున్నందున ఈ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకొని శరవేగంగా రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు. ఒకవేళ ఈ మూడేళ్ళలో రాజధానికి రూపురేఖలు తీసుకురాలేకపోయినట్లయితే ఆ తరువాత రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలాగా ఉంటాయో ఎవరికీ తెలియదు కనుక రాజధాని నిర్మాణం దశాబ్దాల తరబడి సాగవచ్చును. ఏ రాష్ట్రాభివృద్ధి అయినా దాని రాజధానికి ఉన్న ఆర్ధిక చోదక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ ని గమనిస్తే అది అర్ధమవుతుంది. తెలంగాణా ఆర్దికశక్తికి, అభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ వంటిది. కానీ ఏపీకి అసలు ఎప్పటికీ రాజధానే లేకపోతే?
రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అవుతున్న మాట వాస్తవమే. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ 15నెలల కాలంలోనే అనేక పారిశ్రామిక, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. వాటిలో కొన్నిటికి అప్పుడే నిర్మాణపనులు మొదలవగా, మరికొన్ని వివిధ దశలలో ఉన్నాయి. ఐ.ఐ.టి.,ట్రిపుల్ ఐ.టి., ఐ.ఐ.ఎం. వంటి ఉన్నత విద్యా సంస్థలకు భవన నిర్మాణాలు మొదలుకాక మునుపే తాత్కాలికంగా ఆ జిల్లాలోనే వేరే కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో శిక్షణా తరగతులు కూడా మొదలయిపోయాయి.
కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళలో చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి కేవలం 15నెలలో చేసి చూపిస్తోంది. వారు ఇదే స్పీడుతో దూసుకుపోతే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కోలుకోలేదనే భయంతోనే రఘువీరా రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారని భావించవచ్చును.