'గ్రేటర్..' మాయలో 'ఆంధ్రోళ్ల' భజన

  తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలుగోళ్ల మధ్య లెక్కలు తెచ్చి.. ఆంధ్ర, తెలంగాణ అని ప్రతి విషయాన్ని ప్రాంతీయంగా విభజించి మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి తమ తీరును క్షణాల్లో మార్చేసినట్టు రాజకీయవర్గాల టాక్. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్రోళ్ల ఓట్లు కీలక౦. దీంతో ఆంధ్రోళ్లను ఆకట్టుకొనేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్, తెలంగాణా మంత్రి కేటీఆర్‌ వారి భజనను అందుకున్నారని రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.   ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్‌.. ఆంధ్రోళ్ల నామస్మరణం చేశారు. అంతేకాదు ఇక్కడ అందరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. టీఆర్ఎస్ ఇక తెలుగు రాష్ట్రసమితిగా మారబోతు౦దంటూ ప్రకటించారు. అలాగే తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పి..అక్కడికి వచ్చిన ప్రజలని ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు. అలాగే ఆంధ్రవారి గొప్పతనం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ పెదవి విప్పని కేసీఆర్ ..జాతీయ స్థాయి బిల్డర్ సదస్సులో మాత్రం ఆంధ్రవాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. నెల్లూరుకు చెందిన శీనయ్య కంపెనీ గొప్పతనాన్ని కీర్తించట౦ ఆశ్చర్యకరంగా వుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.   కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కాదు తెలంగాణ జిల్లాల మంత్రులంతా గ్రేటర్ లోని ఆంధ్రవాళ్ళ చూట్టూ చేరారట. తమకు కేటాయించిన నియోజక వర్గాలు, డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారట. ముఖ్యంగా ఆంధ్రవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారట. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెద్ద సంఖ్యలో ఉన్న..వివిధ కులాలకు చెందిన కుల సంఘాల సమావేశాల్లో సైతం పాల్గొంటున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. విభజనతో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ ఏర్పాటు దీనికి దోహదం చేసిందని ప్రచారంలో వివరిస్తున్నారట. ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండే వారంతా హైదరాబాదీలేనని, ఎవరి పట్లా ప్రభుత్వం వివక్ష చూపడం లేదని, అందరి కోసం పని చేస్తోందని చెబుతున్నారట. ఇదంతా జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.   మరి గ్రేటర్ ఎన్నికల మాయలో తెలంగాణ నేతలు చేస్తున్న 'ఆంధ్రోళ్ల' భజనకు వారు కరుణిస్తారా? గ్రేటర్ లోని ఆంధ్రవారి మనసు గెలుచుకొనేది ఎవరు ? ఈ సారి వారు ఎవరికి పట్టంకట్టబోతున్నారు? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!!   

నాన్న ప్రేమతో..మామ మోసంతో...!!

  అతను ఒంటరిగానే ప్రయాణం మొదలు పెట్టాడు. గుర్తింపు కోసం తపన పడ్డాడు. తన కుటుంబం నుంచి తన తల్లికి ప్రపంచం నుంచి ‘తనకి’ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని తపించిపోయాడు.. బాల్యమంతా అవమానాల బరువుని మోసాడు... ఏ తాత రూపం పుణుకి పుచ్చుకున్నాడో ఆ తాత ఒడి చేరటానికి పదకొండేళ్ళు ఎదురు చూడాల్సీ వచ్చింది. ఏ కుటుంబ రక్తం పంచుకున్నాడో ఆ కుటుంబం అక్కున చేరటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. అప్పటి వరకు పోరాటమే... తనతో తన చుట్టూవున్న ప్రపంచంతో... తనలోని ఒంటరితనంతో... పోరాడుతూనే వున్నాడు. చివరకి విజయం వరించింది. కుటుంబం అతని కలుపుకుంది. రూపంలో, నటనలో, వాక్చాతుర్యంలో, ఒకటేమిటి అన్నిటా తాతగారికి అసలుసిసలు వారసుడనిపించు కున్నాడు.   సంతోషం.... జీవితంలో అతను కోరుకున్న పెన్నిధి దొరికినందుకు సంతోషంతో పొంగిపోయాడు. చివరికి తన కుటుంబ పరువు ప్రతిష్టలకోసం ఆ కుటుంబంనడిపే పార్టీకోసం ఖాఖి బట్టలు తొడిగి తాతలా ఊరూరా , వాడవాడలా ఎండనక, వాననక తిరిగి... ప్రచారం చేసాడు. ఆ క్రమంలో... యాక్సిడెంటు అయ్యి ప్రాణాల మీదకి వస్తే కూడా చిరునవ్వుతో ... నా కుటుంబం వుండగా నాకెందుకు భయం అంటూ.. ఆ కష్టాన్ని దాటేసాడు. అంతా బావుంది అనుకున్న సమయంలో,  తను ఎంతో ప్రేమించే కుటుంబం అతనిని దూరం పెట్టడం మొదలు పెట్టింది.. తను ఎంతగానో ఆరాధించే బాబాయ్  క్రమక్రమంగా దూరమయ్యాడు. అతని అభిమానులు కూడా  ఇతనిని దూరం పెట్టారు. పార్టీ నుంచి దూరం.. కావల్సిన వారి నుంచి దూరం.... ఎక్కడ అడుగులు తడబడ్డాయి  ? ఎప్పుడు దానికి బీజం పడింది ? ఎవరు దీనికి కారకులు? యంగ్ హీరోల్లో దాదాపు అందరికంటే ముందుగానే ఓ ఇంటి వాడయ్యాడు మన రామయ్య! లక్ష్మీ కళ ఉట్టిపడే ప్రణతి మెళ్లో మూడుముళ్లు వేసినప్పుడు నందమూరి అభిమానులతో పాటూ సామాన్య జనం కూడా ఫుల్ గా సంతోషించారు! కాని, సింగమలై అక్కడే రాంగ్ సిగ్నల్ అందకున్నాడని తాజాగా తెలుస్తోంది! ఆ రాంగ్ సిగ్నల్ పేరే… నార్ని శ్రీనివాస రావు అదే మన యంగ్ టైగెర్ కి పిల్ల నిచ్చిన  మామ!   ఇక్కడ ఇతని కోసం కాస్త చెప్పుకోవాలి.. నార్ని శ్రీనివాసరావుది వార్నీ అనిపించే జర్నీ! సాదాసీదా స్థాయి నుంచీ సాధ్యం కానంత పెద్ద లెవల్ కి ఎదిగాడు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్! చంద్రబాబుకి ఒక విధంగా బంధువైన ఆయన ఎకరాలకు ఎకరాలు హైద్రాబాద్ లో కొనుగోలుచేసాడు ..తిరిగి  అమ్మకాలు కూడా బారీగానే చేశాడు. దీనికి రాజకీయంగా ఎంత సపోర్ట్ లభించిందో దేవుడికే తెలియాలి.. అసలు ఈయన జూనియర్ ని తన అల్లుడ్ని చేసుకుంటున్న విషయమేచంద్రబాబుకి తెలియదట అప్పట్లో! అందుకు తగ్గట్టే బాబు, హరి కృష్ణ ఎడ మొహం పెడ మొహంగానే ఎన్టీఆర్ పెళ్లి వేడుకులు జరిగాయి! నార్నీ శ్రీనివాసరావుతో బంధుత్వం ఏర్పడ్డాక నానా రకాల ప్రచారాలు, గాసిప్సు చక్కర్లు కొట్టి ఎన్టీఆర్ తన ప్రమేయం లేకుండానే టీడీపీకి, బాబుగారికి, టీడీపీ శ్రేణులకి దూరమయ్యాడు. ఇందుకు చాలా వరకూ శ్రీనివాసరావు జగన్ తో చేసిన రాజకీయ బేరసారాలు కూడా కారణం. చివరకు, టీడీపీతో పాటూ తారక్ కి వున్న నందమూరి అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆవిరైపోయింది! ఇప్పుడు బాలయ్య అభిమానులు జూనియర్ సినిమా చూడని పరిస్థితి. నార్నీ వారి అల్లుడయ్యాక సరైన హిట్ ఒక్కటీ కొట్టలేకపోతున్న మన బాద్షాకి…బాధలు ఇక్కడితో ఆగిపోలేదు. మామ నార్నీ శ్రీనివాసరావు మరీ దారుణంగా అల్లుడినే ఆర్దికంగా దెబ్బ తీసాడు. హైద్రాబాద్ లోని మణికొండలో వున్న ఒక ల్యాండ్ చూపించి ఎన్టీఆర్ వద్ద నుంచి 9కోట్లు తీసుకున్నాడు. దాని విలువ 15కోట్లకు తక్కువ కాదని బుకాయించి గిఫ్ట్ డీడ్ గా రెజిస్ట్రేషన్ కూడా చేయించాడు! నిజానికి 2389 గజాల ఆ భూమికి తారక్ 9 కోట్లు ఇవ్వటం నష్టమేం కాదు. మరింకేంటి అంటారా? అక్కడే వుంది ట్విస్ట్ ..అమ్మిన సదరు భూమి రాజ్ భవన్ రోడ్లోని ఐఓబీ బ్యాంక్ శాఖలో తనకాలో వుంది! తాకట్టు పెట్టి అప్పటికే 11 కోట్లు తీసుకున్నాడు అతని మామ. ఇక అంత కంటే బాధా కర విషయమేంటి అంటే వివాహసమయంలో తన కూతురుకి పసుపు కుంకుమ కింద 200 కోట్లు ఇస్తానన్న నార్నే శ్రీనివాసరావు అవి ఇవ్వకపోగా తన అవసరానికి అల్లుడు దగ్గర 9 కోట్లు తీసుకున్నాడు. అసలు కథ అంతా ఈ 9 కోట్లు తిరిగి ఇవ్వమని అల్లుడు అడిగినప్పుడే బయటపడింది. నిజానికి కొడుకు మొదటి పుట్టిన రోజుకి ఆ భూమిని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు ఎన్టీఆర్. కాని మామ చేసిన మోసంతో ఆపని చేయలేక, మోసపోయినందుకు బాధపడుతూ తన కొడుకు పుట్టినరోజు వేడుకలని జరపాల్సి వచ్చింది. ఇలా పిల్లనిస్తూ ఇస్తానన్న కోట్లు పోయే, తన కష్టార్జితమూ పోయే.   పాపం ఎంతో కష్టపడి బాల రాముడి స్థాయి నుంచి తారక రాముడి ఇమేజ్ దాకా ఎదిగాడు జూనియర్. నందమూరి కుటుంబం లక్ష్య పెట్టని స్థితి నుంచీ అందరి లక్ష్యం తానే అయ్యేలా చేసుకోగలిగాడు. ప్రచారంలో ఖాకీ చొక్కా వేసుకుని దుమారం రేపి టీడీపికి, చంద్రబాబుకి ఆప్తుడయ్యాడు. ఇలా అన్ని నిచ్చెనలూ ఎక్కేసి… చివరాఖరుకి… వైవాహిక వైకుంఠపాళిలో మామ మింగిన పావులా మళ్లీ కింద వరసకొచ్చేశాడు!   పిల్లనిచ్చిన మామే అతనిని ఇబ్బందులు పెడితే, స్వంత మామగారే ప్లాన్ చేసి మరీ అతనిని ఇరికిస్తే... అతనిని ఒంటరి వాడిని చేస్తే... పాపం తారక్ మాత్రం ఏం చేయగలడు. ఈ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ మధనపడటం తప్ప.

పాక్ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరి సరయినదేనా?

  పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. కానీ ఆ వైఖరిని బీజేపీ మిత్రపక్షమయిన శివసేన తీవ్రంగా విమర్శించింది. నవాజ్ తో ఒక కప్పు టీ త్రాగినందుకు ఏడుగురు జవాన్లను బలి చేసుకోవలసి వచ్చిందని విమర్శించింది. గణతంత్ర దినోత్సవం రోజున మన ఆయుధాలను ప్రదర్శించుకోవడం తప్ప వాటిని ఉపయోగించి పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పలేకపోతున్నామని ఎద్దేవా చేసింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం బీజేపీ విధానం కాదు. ఇదివరకు యూపిఏ విధానాన్నే మోడీ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు మరియు మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత కూడా భారత్ ఇంకా పాక్ తో చర్చల గురించి ఆలోచించడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. కనుక తక్షణమే చర్చలను రద్దు చేసుకొని పాక్ పట్ల కటినంగా వ్యహరించాలని కోరారు. మోడీ లాహోర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పట్టింది కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం పాక్ పట్ల అనుసరిస్తున్న విధానాన్ని గట్టిగా విమర్శించలేదు. దీనిపై ఏదో మాట్లాడాలి గాబట్టి మాట్లాడుతునట్లుగా "పాక్ పట్ల పునరాలోచించుకొని అడుగు ముందుకు వేయమని" హెచ్చరించింది.   కానీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలపై, వ్యక్తులపై తక్షణమే కటినమయిన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం గమనిస్తే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సరయినదని రుజువు అయ్యింది. గతంలో ఎన్నడూ పాక్ ప్రభుత్వం ఈవిధంగా స్పందించలేదు. దాడి జరిగిన వెంటనే దానితో తమ దేశానికి ఎటువంటి సంబంధమూ లేదని వాదించేది. కానీ ఈసారి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఈ దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకొంటామని చెప్పడం ద్వారా తమ దేశంలోనే కుట్ర జరిగిందని అంగీకరించినట్లయింది. అది మోడీ ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానంలో ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చును.   పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మాటకు కట్టుబడి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొంటారా లేదా అనే విషయాన్నీ పక్కనబెట్టి ఆలోచిస్తే, భారత్ అనుసరించిన వైఖరి కారణంగానే పాక్ ప్రభుత్వంలో ఈ మార్పు సాధ్యమయిందనే విషయం స్పష్టం అవుతోంది. కానీ ఇది గమనించకుండా పాక్ తో చర్చలు రద్దు చేసుకొని, వీలయితే పాక్ పై దాడులు చేయాలని సూచించడం ఆత్మహత్యతో సమానమే. పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులు చేయడం భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంగానే భావించక తప్పదు. దాని వలన భారత్ అహం దెబ్బ తింది. కనుక పాక్ తో జరుగబోయే చర్చలను రద్దు చేసుకొని దానితో కటినంగా వ్యవహరించినట్లయితే పాక్ ఉగ్రవాదం వైపే మళ్లవచ్చును. దాని వలన మళ్ళీ భారతదేశమే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పాక్ తో చర్చలు రద్దు చేసుకొని, దానితో మళ్ళీ కొన్ని దశాబ్దాలపాటు ఘర్షణపడే బదులు దానితో చర్చలు కొనసాగిస్తూ, అక్కడి ప్రజా ప్రభుత్వం బలపడేందుకు వీలయినంత సహాయసహకారాలు అందిస్తూ పాక్ లోని ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి కృషి చేయడమే సరయిన విధానం. ఉగ్రవాదులను సమూలంగా మట్టుబెట్టాలంటే ఇంతకంటే మంచి మార్గం లేదని చెప్పకతప్పదు.

పాక్ అప్పుడే దారులు సిద్దం చేసుకొంటోందా?

  పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన తరువాత సహజంగానే అందరి వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి. ఈ సంఘటనను పాకిస్తాన్ కూడా ఖండించి సానుభూతి తెలిపింది. అంతటితో ఇక చేయవలసింది ఏమీ లేదన్నట్లుగా మౌనం వహించింది. ఇదివరకులాగ భారత్ తమని నిందించడంలేదనే సంగతి పాక్ గ్రహించే ఉంటుంది. కనుక ఈ వేడి చల్లార్చేందుకు పాక్ కూడా తన వంతుగా మరికొంత కృషి చేసి ఉంటే బాగుండేది. కానీ పాక్ తనకు బాగా అలవాటయిన ఎత్తులు వేయడం ఆరంభించింది.   ఈ దాడికి పాల్పడింది పాక్ లో శిక్షణ పొందిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని భారత్ దృడంగా నమ్ముతోంది. కనుక ఒకవేళ భారత్ వేలెత్తి చూపినట్లయితే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడకుండా తప్పించుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లుగా కనిపిస్తోంది. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి చెందిన యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే సంస్థ ఈ దాడికి పాల్పడింది తామేనని ఈరోజు ప్రకటించుకొంది. కానీ ఈ విషయం ప్రకటించడానికి అది మూడు రోజుల సమయం తీసుకొంది. బహుశః ఈ వ్యూహం సిద్దం చేసుకోవడానికి పాకిస్తాన్ కి మూడు రోజులు పట్టిందేమో? అప్పుడే హటాత్తుగా అది “యునైటెడ్ జిహాద్ కౌన్సిల్” ని ముందుకు తీసుకువచ్చిందేమోననే అనుమానం కలుగుతోంది. భారత్ కి బుద్ధి చెప్పేందుకే దాడికి పాల్పడ్డామని ప్రకటించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నపటికీ, అది ఖచ్చితంగా పాక్ ఎత్తుగడగానే అనుమానించవలసి వస్తోంది. దాని అధికార ప్రతినిధి సయ్యద్ సదాకత్ హుస్సేన్ మాటలు పాకిస్తాన్ పై ఈ నిందపడకుండా ఏదో విధంగా కాపాడుకోవాలన్నట్లుగా ఉన్నాయి.   “భారత ప్రభుత్వం మరియు భారత్ మీడియా రెండూ కూడా పాక్ ఫోబియాతో బాధపడుతున్నాయి. దేశంలో ఎక్కడ ఏ దాడి జరిగినా దానికి పాకిస్తాన్ నే వేలెత్తి చూపించడం వాటికి అలవాటుయిపోయింది. తద్వారా కాశ్మీరీ స్వాతంత్ర్య పోరాటంపై బురద జల్లాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ రెండున్నర దశాబ్దాలుగా అవి సఫలం కాలేకపోయాయి. కాశ్మీరీల పోరాటాలను అడ్డుకోలేకపోయాయి. కాశ్మీరీ వేర్పాటువాదులు భారత్ పై దాడి చేయదలిస్తే వారిని భారత్ లో ఏ శక్తి అడ్డుకోలేదని నిరూపించడానికే మేము “హైవే స్క్వాడ్” తో కలిసి ఈ దాడి చేసి భారత్ కి ఒక గట్టి హెచ్చరిక పంపాము. కనుక భారత్ మళ్ళీ యధాప్రకారం పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేసే బదులు గోడపై వ్రాసినట్లు స్పష్టంగా కనబడుతున్న మా ఈ సందేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకొని ఇక ఏ మాత్రం సమయం వృధా చేయకుండా కాశ్మీరీ ప్రజలకు తమ భవిష్యత్ ని నిర్ణయించుకొనేందుకు అంగీకరించాలి,” అని అన్నారు.   అతను చెపుతున్న మాటలు తమ పోరాటం గురించి చెపుతున్నట్లుగా లేవు. పాకిస్తాన్ పై నిందపడకుండా కాపాడుకోవాలన్నట్లుగా ఉన్నాయి. కాశ్మీర్ విషయంలో పాక్ ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తోందో సరిగ్గా అటువంటి వైఖరే అతను కూడా ప్రదర్శిస్తున్నాడు. కనుక అతని మాటలను పాక్ మాటలుగానే చూసినట్లయితే, ఈ సమస్య నుండి బయటపడటానికే పాక్ ఈ మార్గం సిద్దం చేసుకొంటున్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఒకవేళ అతను చెప్పినట్లు నిజంగానే ఆ సంస్థే ఈ దాడికి పాల్పడిందని రుజువయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత వాయుసేనలు దాడి చేసి ఆ సంస్థతో సహా అక్కడ తిష్టవేసుకొని కూర్చొన్న ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి, మళ్ళీ ఆ భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. అటువంటి ఆలోచన, ఆసక్తి ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది కూడా.   కనుక ఈ సమస్య నుండి బయటపడేందుకు పాక్ ఇటువంటి చవకబారు ఆలోచనలు చేయడం కంటే భారత్ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు భారత్ తో చేతులు కలిపితే మంచిదేమో? కానీ అటువంటి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొనే శక్తి పాక్ ప్రజా ప్రభుత్వానికి ఉందా? అంటే లేదనే చెప్పుకోవాలి. ఒకవేళ భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ దెబ్బ తింటే, మళ్ళీ కొన్ని దశాబ్దాలపాటు ఇరుదేశాల మధ్య ఈ శత్రుత్వం కొనసాగవచ్చును.

బిహార్ ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెడుతున్న లాలూ ప్రసాద్

  బిహారు అసెంబ్లీ ఎన్నికలలో మోడీ, అమిత్ షాలను తట్టుకొని నిలబడి మళ్ళీ అధికారం దక్కించుకొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళివచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. ఆయన వ్యూహం ఫలించి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపినందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకొంటున్నారు.   లాలూ ఇద్దరు కొడుకులకు ఎటువంటి పరిపాలనానుభావం లేకపోయినా మంత్రి పదవులు అప్పగించవలసి వచ్చింది. అప్పటి నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం వ్యవహారాలలో లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఊహించిందే కనుక నితీష్ కుమార్ అందుకు మానసికంగా సిద్ధమయి ఉన్నారనుకోవలసి ఉంటుంది. లాలూ కొడుకులిద్దరికీ సరయిన విద్యార్హతలు, రాజకీయ, పరిపాలనానుభావం లేనందున వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వంలో తనకు విశ్వాసపాత్రులయిన ఐ.ఏ.ఎస్. అధికారులను తన కొడుకుల మంత్రిత్వ శాఖలకు ప్రధాన కార్యదర్శులుగా నియమింపజేసుకొన్నారు. కనుక సహజంగానే వారిరువురూ, వారి క్రింద పనిచేసే అధికారులు లాలూ ప్రసాద్ యాదవ్ కనుసైగలతో పనిచేస్తుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.   కానీ లాలూ ప్రసాద్ యాదవ్ అంతటితో తృప్తి చెందినట్లు లేరు. నితీష్ కుమార్ కి చురకలు వేయడం మొదలుపెట్టారు. బిహార్ లో శాంతిభద్రతల పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తోందని తన పార్టీ నేతల చేత ఆరోపణలు చేయించారు. భాదిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే వారు వచ్చి తనను కలవవచ్చని లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఆయన సమాంతర పరిపాలన ప్రారంభించినట్లే భావించవచ్చును.   ఆయనకి ఏ అధికారం లేనప్పటికీ, నిన్న పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ ఆసుపత్రిలో ఆకస్మిక తణికీలు నిర్వహించారు. అక్కడి నుండే ఆయన వైద్య ఆరోగ్యశాఖకు మంత్రిగా చేస్తున్న తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఫోన్ చేసి ఆసుపత్రిలో పరిస్థితి గురించి వివరించి తరచూ దానిని తనికీ చేస్తుండాలని సలహా ఇచ్చేరు. ఎందుకంటే తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ ఆసుపత్రికి చైర్ పర్సన్ కూడా కనుక. ఇంటర్మీడియేట్ పరీక్ష కూడా పాసవలేని అతను వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి అవడమే విచిత్రమనుకొంటే, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్, డైరక్టర్స్ బోర్డ్ కి చైర్ పర్సన్ అయ్యుండటం ఇంకా విచిత్రంగా ఉంది. ఆ విషయాన్ని అతని తండ్రి ఆసుపత్రి నుంచి ఫోన్ చెప్పడం ఇంకా విచిత్రంగా ఉంది.   లాలూ ప్రసాద్ యాదవ్ నేరుగా అధికారం చెలాయించే అవకాశం లేకపోయినప్పటికీ, ప్రభుత్వం ఆయన దయాదాక్షిణ్యాల మీదనే నడుస్తోంది కనుక ఆయన చేతులు ముడుచుకొని కూర్చొంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ మరీ ఇంత త్వరగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటారని ఎవరూ అనుకోలేదు. ఆయన ఆసుపత్రి తణికీలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఏ అధికారంతో ఆపని చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు తానేమీ పనిగట్టుకొని తణికీలు నిర్వహించడానికి రాలేదని ఆ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలిసిన వ్యక్తి ఒకరిని పరామర్శించడానికి వచ్చేనని, ఒకప్పుడు తన పర్యవేక్షణలో అద్భుతంగా నిర్వహించబడిన ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ ఏవిధంగా ఉందో చూసిపోదామని వచ్చేనని సర్ది చెప్పుకొన్నారు.   నిజానికి లాలూ ప్రసాద్ యాదవ్ “అవును నా కొడుకు మంత్రి కనుక నేను తణికీలు నిర్వహించడానికే వచ్చేను,” బహిరంగంగా చెప్పగలరు. కానీ చెప్పలేదంటే అది నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కనికరించినట్లే భావించవచ్చును. ఒకవేళ ఆయన ఆ విధంగా చెప్పి ఉంటే, అప్పుడు నితీష్ కుమార్ అందుకు సంజాయిషీలు చెప్పుకోలేక బాధపడవలసి వచ్చేది. అయన మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది కనుక ఆయనను ప్రశ్నించే సాహసం చేయలేకపోయేది. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా లౌక్యంగా జవాబు చెప్పి నితీష్ కుమార్ ప్రభుత్వానికి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవకుండా దయ తలిచారని అనుకోవలసి ఉంటుంది. అందుకే ఆయన తణికీల్పి నితీష్ కుమార్ ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు. బహుశః మున్ముందు ఇటువంటి చేదు అనుభవాలు ఇంకా చాలా ఎదుర్కోవలసి రావచ్చునేమో?

భారత్-పాక్ సంబంధాలపై పఠాన్ కోట్ ప్రభావం పడుతుందా?

  పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ దేశాలు రెండూ ఉలిక్కిపడ్డాయని చెప్పవచ్చును. ఎందుకంటే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ భారత్ కి చాలా కీలకమయిన వాయుసేన స్థావరం. ఈ ఎయిర్ బేస్ పాకిస్తాన్ సరిహద్దుకి కేవలం 25కిమీ దూరంలో ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చివరికి రాజధాని డిల్లీకి కూడా ఇక్కడి నుంచి కొన్ని క్షణాల వ్యవధిలో యుద్ద విమానాలు చేరుకోగలవు. అందుకే ఈ ఎయిర్ బేస్ లో ఎల్లప్పుడూ కొన్ని డజన్ల యుద్ధ విమానాలు, యుద్ద హెలికాఫ్టర్లు నిలిపి ఉంచబడతాయి. వీటిని బట్టి ఈ ఎయిర్ బేస్ ఎంత కీలకమయినదో అర్ధం చేసుకోవచ్చును. అటువంటి అత్యంత కీలక వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి సిద్దపడ్డారు. ఒకవేళ వారు తమ ప్రయత్నంలో సఫలం అయ్యుంటే బహుశః భారత్-పాక్ మధ్య ఆకస్మికంగా యుద్ధం మొదలయినా ఆశ్చర్యం లేదేమో. కానీ అదృష్టవశాత్తు భారత జవాన్లు ప్రాణాలకు తెగించి దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగారు.   ఈ దాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోందని పాకిస్తాన్ కూడా గ్రహించింది. అందుకే ఈ దాడి వార్తలు వెలువడగానే పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీముల్లా మీడియాతో మాట్లాడుతూ “ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిని మేము చాలా తీవ్రమయిన విషయంగా భావిస్తున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగినందుకు మేము భారత్ ప్రభుత్వానికి, ప్రజలకి, దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకి మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. వారు ఈ దురదృష్టకర సంఘటన తాలుక బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాము. ఆసియా ఖండం నుంచి ఉగ్రవాద నిర్మూలన కోసం మా దేశం భారత్ తో సహా ఇరుగుపొరుగు దేశాలతో కలిసి పని చేస్తుంది,” అని అన్నారు.   ఉగ్రవాదుల దాడులపై హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ మాట్లాడుతూ “మేము ఎల్లప్పుడూ శాంతినే కోరుకొంటాము. కానీ ఉగ్రవాదులు మాపై దాడులు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోబోము. వారికి గట్టిగా బుద్ధి చెపుతాము,” అని అన్నారు.   ఈ పరిణామాలతో ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురిస్తున్న భారత్-పాక్ మధ్య స్నేహ సంబంధాలు దెబ్బ తింటాయేమోననే భయం ఇరు దేశాలలో వ్యక్తం అయ్యింది. కానీ ఇదివరకులాగ భారత్ తక్షణమే పాక్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడలేదు. కనీసం అటువంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. ఉగ్రవాదులు చాలా కీలకమయిన వైమానిక స్థావరంపై దాడికి పాల్పడినప్పటికీ ఈసారి భారత్ చాలా సంయమనంతో వ్యవహరించిదని చెప్పక తప్పదు. కానీ ఉగ్రవాదులు మున్ముందు కూడా ఇటువంటి పరీక్షలు పెట్టే అవకాశం ఉండవచ్చును. కనుక అప్పుడు కూడా భారత్ ఇదేవిధంగా సంయమనంగా వ్యవహరించవలసి ఉంటుందనే విషయం స్పష్టం అవుతోంది.   భారత్ ఇవ్వాళ్ళ ప్రదర్శించిన ఈ సంయమనానికి ప్రతిగా పాక్ ప్రభుత్వం కూడా ఉగ్రవాద నిర్మూలనలో తన చిత్తశుద్ది నిరూపించుకొనే ప్రయత్నాలు చేయగలిగితే ఇరుదేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడుతుంది. ఇంతవరకు సరిహద్దులలో నిత్యం తుపాకుల మోతలు మారుమ్రోగుతుండేవి. నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ ల మధ్య సఖ్యత ఏర్పడినప్పటి నుంచి తుపాకులు గర్జించడం మానేశాయి. కానీ పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు నేటికీ భారత్ పై దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఈరోజు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.   అలాగే పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ. జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో గూడచర్యానికి పాల్పడుతోందని స్పష్టం అవుతోంది. ఈ దాడులకు ఐ.ఎస్.ఐ. చేస్తున్న గూడచర్యానికి మధ్య ‘లింక్’ ఏర్పడితే అప్పుడు కూడా భారత్ ఇదేవిధంగా సంయమనం పాటించడం చాలా కష్టం. కనుక పాకిస్తాన్ ఇటువంటివాటినన్నిటినీ అరికట్టే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు తెదేపా, బీజేపీలు సిద్దమేనా?

  ఒకప్పుడు తెరాస నేతలు హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల పట్ల తీవ్ర విద్వేషభావం ప్రదర్శించేవారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆంధ్రా ప్రజలలో అభద్రతాభావం కలిగేవిధంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు మంత్రి కె.టి.ఆర్. ఆ ఆంధ్రా ప్రజల ఓట్లతోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకొంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధానం చూసి చాలా మెచ్చుకొంటున్నారని కె.టి.ఆర్.అన్నారు.   తెరాస అధికారంలో ఉండటం వలన సహజంగానే కలిసివస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తోంది. ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. అలాగే మైనార్టీలను ఆకట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 60 రెసిడెన్షియల్ స్కూళ్ళని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అనేక కార్యక్రమాలను కూడా ప్రకటించింది. ఒకప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకాడిన తెరాస ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని పూర్తి ఆత్మవిశ్వాసం ప్రకటిస్తుండటం గమనించవచ్చును.   తెరాస నేతలు ఇప్పుడు జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ప్రసన్నం చేసుకొనే పనిలోపడగా, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకప్పుడు తెరాస నేతలు ప్రజలతో ఏవిధంగా అనుచితంగా వ్యవహరించారో గుర్తుకు చేసి తెరాసను దెబ్బ తీసి గెలవాలని భావిస్తున్నట్లు భావిస్తోంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంతో మంచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. అప్పుడే మేయర్ అభ్యర్ధి పేరును కూడా ఖరారు చేసేసామని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకి తెలిపారు. రేపు జరుగబోయే పార్టీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. డివిజన్ల వారిగా పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.   ఈ జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం తెదేపా, బీజేపీలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. జంట నగరాలలో బలంగా ఉండటం వలన బీజేపీ చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే, ఆంధ్రా ఓటర్లు తెరాసను వ్యతిరేకించడం తధ్యం కనుక వారి ఓట్లు తమకే పడతాయని ధీమాతో తెదేపా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలలో అపనమ్మకం కనబడుతోంది. అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలలో కనిపిస్తున్న ఉత్సాహం ఆ రెండు పార్టీలలో కనబడటం లేదు. అందుకు కారణాలు అందరికీ తెలుసు. కానీ మిగిలిన అన్ని పార్టీల కంటే ఈ ఎన్నికలలో గెలవలసిన అవసరం వాటికే ఉంది లేకుంటే మున్ముందు చాలా గడ్డు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయం తెదేపా, బీజేపీలకు తెలియదని అనుకోలేము. కనుక అవి కూడా అందుకు తగిన వ్యూహాలు సిద్దం చేసుకొని, ఈ ఎన్నికలలో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈనెల 4వ తేదీన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వబోతున్నట్లు సమాచారం.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

    2015సం.లో భారతదేశం, ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా అనేక ఆశలతో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. అలాగే ప్రతీ సంవత్సరంలాగే ఈసంవత్సరంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చును. ప్రపంచాన్ని అతలాకుతలం చేయగల ప్రకృతి విపత్తుల ముందు అందరూ తలవంచవలసిందే. ఈ ప్రపంచాన్ని సుఖమయం చేయడానికి అనేక అద్బుతాలు సృష్టించే మనిషే ఈ ప్రపంచానికి ఊహించని సమస్యలు, కష్టాలు కూడా తెచ్చిపెడుతుంటాడు. చివరికి ప్రకృతి విపత్తులకి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనిషే కారణమవడం విస్మయం కలిగిస్తుంది. డిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో నేటి నుండి సరి-బేసి సంఖ్యల పద్దతిలో వాహనాలను బయటకి అనుమతిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు కూడా నడుం బిగించాయి.   ఈ కాలుష్యం సరిపోదన్నట్లు రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. మన దేశంలో అయితే ఆ కాలుష్యం ఇంకా ఎక్కువగా ఉన్నట్లుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలలో కూడా ఈ రాజకీయ కాలుష్యం పెరిగిపోవడంతో సకల అవలక్షణాలను సంతరించుకొన్నాయి. ఆ కారణంగా అభివృద్ధి కేవలం హామీలకి, కాగితాలకే పరిమితమయిపోయింది. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు సర్వరాజభోగాలు అనుభవిస్తుంటే, వారికి ఆ అవకాశం కల్పించిన సామాన్య ప్రజలు జీవితాంతం త్యాగాలు చేయవలసి వస్తూనే ఉంది. ఈ పరిస్థితులలో మార్పు కలుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక చిన్న చిన్న సంతోషాలని విస్మరించకుండా వాటినే లెక్కబెట్టుకొంటూ ఈ సంవత్సరాన్ని కూడా ఉన్నంతలో ఆనందంగా లాగించేయాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కాంగ్రెస్ పార్టీ అల్ప సంతోషం!

  కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఎందుకు ఏర్పాటు చేసిందో అందరికీ తెలుసు. అయినా కూడా తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, ఆ తరువాత క్రమంగా కనుమరుగవుతుండటం అందరూ ఊహించిందే. కానీ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడం వలన కనుమరుగవుతుంటే, తెలంగాణాలో అధికార తెరాస చేపట్టిన ‘ఆకర్ష’ వలన బలహీనపడుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా తెరాస ధాటిని తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను, చివరికి ఎన్నికల అభ్యర్ధులను కూడా డబ్బు, పదవులు ఎర వేసి తెరాసలోకి ఆకర్షిస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని తెరాస ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయాలలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న జానారెడ్డి వంటి వ్యక్తి తెరాసను ఎదుర్కోలేక నిస్సహాయత వ్యక్తం చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో ఆ పార్టీలో మళ్ళీ కొత్త ఉత్సాహం కనబడుతోంది.   ఇతర పార్టీల అభ్యర్ధులను, మద్దతుదారులను నయాన్నో భయాన్నో లొంగదీసుకొంటున్న తెరాసకు కాంగ్రెస్ సాధించిన ఈ విజయం చెంప దెబ్బ వంటిదని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. ఇదే ఊపులో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని అన్నారు. డివిజన్లలో పార్టీ కార్యకర్తల అభీష్టం ప్రకారమే సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్దతిలో గ్రేటర్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు. అయన మొట్ట మొదటిసారిగా వైకాపాపై కూడా విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో ఆ పార్టీ తెరాసకు ఏజెంటుగా వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో పరోక్షంగా సహాయపడుతోందని ఆరోపించారు.   ఒకప్పుడు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత చిన్న విజయానికే సంబరపడిపోవడం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఒకానొకపుడు ఇటువంటి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ లెక్కలోకే తీసుకొనేది కాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పూర్తయ్యాయో కూడా తెలిసేవి కావు. వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం చాలా సర్వసాధారణమయిన విషయంగా అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఒక ఎంపిటిసి స్థానాన్ని గెలుచుకొన్నా పండుగ చేసుకొంటోంది.   నిజానికి ఈ విజయం కాంగ్రెస్ విజయంగా భావించలేము. పార్టీ అభ్యర్ధులు రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డిల స్వంత శక్తి సామర్ద్యాల కారణంగానే అది సాధ్యం అయ్యింది. ప్రస్తుత పరిస్థితులలో ఈ చిన్న విజయం పార్టీకి చాలా గొప్ప ఉత్సాహం కలిగిస్తోంది కనుక దాని నుండి ప్రేరణ పొందే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయం గురించి గొప్పగా చెప్పుకొంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో తమ పార్టీ బలహీనపడటానికి, తరచూ ఎన్నికలలో పరాజయం పాలవడానికి కారణాలను గ్రహించినట్లే ఉన్నారని ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. తమ పార్టీ బలహీనతలను, అధికార పార్టీ బలాన్ని ఆయన గుర్తించారు కనుక అందుకు అనుగుణంగా ఆయన చర్యలు చేప్పట్టినప్పుడే ఫలితాలు ఆశించవచ్చును.   కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకోవడం వలననే ఇతర పార్టీలు నెగ్గుతుంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటుంటారు. అది నూటికి నూరు పాళ్ళు నిజం కూడా. కానీ అదే సూత్రం ఇతర పార్టీలకు కూడా వర్తిస్తుంది. అటువంటప్పుడే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటుంది. కనుక అటువంటి అవకాశం దొరికే వరకు వేచి చూస్తుందా లేక తన బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకొని విజయం సాధిస్తుందా? అనేది జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తేలిపోతుంది.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణా 2015 డైరీ

  రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ అంచనాలతో అధికారం చేప్పటిన తెదేపా, తెరాస ప్రభుత్వాలు సుమారు ఒక సంవత్సర కాలం పాటు అంటే ఈ ఏడాది జూన్ నెల వరకు నిత్యం ఏదో ఒక అంశం మీద యుద్ధం చేసుకొంటూ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని చెప్పక తప్పదు. ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాల పోలీసులు కూడా కొట్టుకొనే పరిస్థితి కలిగింది. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో ఇరు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఆ యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. కానీ అంతే వేగంగా అది సమసిపోయింది.   ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సఖ్యత కనిపిస్తోంది. తత్ఫలితంగా ఇరు ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా బాగా తగ్గిపోయింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలుగుతున్నారు. అందుకు ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.   తెరాస ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పధకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడికతీత, వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతీ ఇంటికి మంచి నీళ్ళు సరఫరా, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం వంటి వాటి వలన తెరాసకు మంచి పేరు సంపాదించుకొంటోంది. కానీ విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కారణంగా తీరని అప్రదిష్ట మూటగట్టుకొంది. కేంద్రం సహకారంతో విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కగలిగింది.   ఈ ఏడాది తెరాసకు చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాస వరుసపెట్టి విజయాలు సాధిస్తోంది. కానీ అందుకు అది అనుకరిస్తున్న పద్దతులను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను తెరాసలోకి ఆకర్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా తెరాస అవేమీ పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిపోతోంది.   రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హుద్ హూద్ తుఫాను మరింత నష్టం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసం, కృషి పట్టుదల కారణంగా రాష్ట్ర అటువంటి సవాళ్ళను ఎదుర్కొని నిబ్బరంగా ముందుకు సాగుతోంది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించాల్సిన ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పేరిట రాష్ట్రానికి మరిన్ని అగ్ని పరీక్షలు పెట్టాయి. అయితే వాటి వెనుక ఉద్దేశ్యాలను గ్రహించిన రాష్ట్ర ప్రజలు అవి చేస్తున్న పోరాటాలకు ఆమోదం తెలుపకపోవడంతో వాటిని పక్కనపెట్టక తప్పలేదు.   కేంద్రప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ వంటి హామీలను అమలుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఈ ఒక్క ఏడాదిలోనే కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. ఐ.ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్. వంటి ప్రతిష్టాత్మకమయిన ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేసింది. వాటికి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖుస్థాపన చేసారు. ఎంపిక చేసిన తాత్కాలిక భవనాలలో వాటి తరగతులు కూడా మొదలవుతున్నాయి. ఇవి కాక మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి, అనంతపురం జిల్లాలో పాల సముద్రం వద్ద బెల్ సంస్థ, తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ కార్పోరేషన్ సంస్థ వంటి అనేక భారీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి.   ఇక విజయవాడ, విశాఖనగరాలలో మెట్రో రైల్ నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం భూమి చదును పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నెల నుండి అక్కడ నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది. అనంతపురం కర్నూలు పట్టణాలను రాజధానిని కలుపుతూ హైవే రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆలాగే రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలలో హైవేల నిర్మాణం, అభివృద్ధి కోసం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారి రూ. 60, 000 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించేరు. విజయవాడ ప్రజల చిరకాల కోరిక దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా మొదలయింది.   వీటన్నటిని మొత్తంగా కలిపి చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతుంది. అవన్నీ ఇంతవరకు శంఖుస్థాపనల వరకు వచ్చేయి. నూతన సంవత్సరంలో ఆ అభివృద్ధి పనులన్నీ మొదలయితే ప్రత్యక్షంగా చూడవచ్చును. కనుక 2015 కంటే రానున్న మూడు సంవత్సరాలు రాష్ట్రానికి చాలా కీలకమయినవిగా చెప్పుకోవచ్చును. వచ్చే మూడేళ్ళలో జరిగే అభివృద్ధిని బట్టి రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

2015లో జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు

  2015 సం. ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి ఒకసారి చెప్పుకొంటే బాగుంటుంది.   ఈ ఏడాది మొదట్లో డిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ రెండు ప్రధాన జాతీయపార్టీలయిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను చిత్తుగా ఓడించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అది ప్రజల పట్ల రాజకీయ పార్టీలు, నేతల తీరు మారవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇక బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ముఫ్తీ మొహమ్మద్ తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాల వలన బీజేపీ-పిడిపి పార్టీల మధ్య కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ నిలకడగా పరిపాలన సాగుతోంది.   మచ్చలేని నేతగా పేరొందిన మాజీ ప్రధాని. డా. మన్మోహన్ సింగ్ అక్రమ బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో చేతికి మసి అంటుకొంది. ఆయనను ఆకేసు విచారణ కోసం స్వయంగా హాజరు కావలసిందిగా కోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టించింది. కానీ సుప్రీం కోర్టు ఆయనకు ఆ కేసుల నుండి విముక్తి ప్రసాదించింది. ఇదే కేసులో మాజీ బొగ్గు శాఖ మంత్రి దాసరి నారాయణ రావుపై కూడా చార్జ్ షీట్ దాఖలయింది.   భూసేకరణ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించకపోవడంతో మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టాలని రాహుల్ గాంధీ తహతలాడినపుడు షీలా దీక్షిత్ వంటి సీనియర్ నేతలు నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడంతో ఆయన పార్టీపై అలిగి కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాజజకీయలకు శలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోవడం ఆయన, పార్టీ కూడా తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్నారు.   అక్రమాస్తుల కేసులో జయలలితని కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె మళ్ళీ ఉపఎన్నికలలో పోటీ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేరు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన దోషి రామలింగారాజుకి బెయిలు మంజూరు అవడంతో ఆయన జైలు నుండి విముక్తి లభించింది.   డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్-డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య అధికారుల నియామకం విషయంలో యుద్ధం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తాజాగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ-డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేజ్రీవాల్ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేశారు.   మళ్ళీ చాలా దశాబ్దాల తరువాత జూన్ తొమ్మిదవ తేదీన భారత్ భద్రతా దళాలు విదేశీ భూభాగంలోకి (మయన్మార్) ప్రవేశించి నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పన్నెండేళ్ళుగా సాగుతున్న వ్యాపం కుంభకోణంలో ఇంతవరకు 2,500 మంది అరెస్ట్ కాగా, ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కూడా ఈ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ తో సహా ఇంతవరకు 47మంది అనుమానాస్పదస్థితిలో మరణించారు. వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది.   బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న మహాకూటమి చేతిలో బీజేపీ ఓడిపోయింది. నితీష్ కుమార్ మళ్ళీ బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టారు. తొమ్మిదవ తరగతి కూడా పాస్ అవని లాలూ చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రి అయ్యేడు.   జూలై 27వ తేదీన పంజాబ్ లో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసారు. వారి దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించారు. సరిగ్గా అదే రోజున భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందారు. ముంబై దాడుల సూత్రధారి యాకూబ్ మీమన్ ని నాగపూర్ జైల్లో ఉరి తీశారు. ఆగస్ట్ ఆరవ తేదీన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ సజీవంగా పట్టుబడ్డాడు.   వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ వ్యవహారాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు, విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాలకు పట్టుబడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటుని స్తంభింపజేసాయి. మళ్ళీ ఆ తరువాత జరిగిన పార్లమెంటు సమావేశాలను మత అసహనం, నేషనల్ హెరాల్డ్ కేసుల కారణంగా స్తంభింపజేసింది.   సానియా మీర్జాకి ప్రతిష్టాత్మకమయిన ఖేల్ రత్న అవార్డు అందుకొన్నారు. బీసిసిసి మాజీ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూసారు. ఆయన స్థానంలో శాశాంక్ మనోహర్ అధ్యక్షుదిగా ఎన్నికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమం హింసాయుతంగా మారింది. ప్రస్తుతం అతని వివిధ పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నాడు.   పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ పోరాట యోధుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్ కి సంబంధించిన రహస్య ఫైళ్ళను బయటపెట్టింది. కేంద్రప్రభుత్వం తన అధీనంలో ఉన్న రహస్య ఫైళ్ళను కూడా బయటపెట్టబోతోంది. మాజీ సైనికులకు ఒకే హోదా-ఒకే పెన్షన్ పధకాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించింది.   మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో ఓడిడుకులు ఏర్పడ్డాయి. ఆ తరువాత అవి కొంత సర్దుకొన్నప్పటికీ, నేటికీ అవి అప్పుడపుడు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నల్లదనం వెలికితీత పధకంలో భాగంగా విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారు అనేకమంది స్వచ్చందంగా ఆ వివరాలను ప్రకటించి రూ. 3370 కోట్లు జరిమానాలు చెల్లించారు. నిర్భయ కేసులో బాలనేరస్తుడు విడుదలయ్యాడు. అందుకు ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపడంతో బాల నేరస్తుల వయసును 18 నుండి 16కి తగ్గిస్తూ బాలనేరస్థుల చట్టానికి సవరణలు చేసి పార్లమెంటు ఆమోదించింది.   జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని రూ.80,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేసారు. అంతకు ముందు బిహార్ కి రూ.1.25 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ, ఆ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేసారు. 2015సం. తమిళనాడుకి ఒక పీడ కలని మిగిల్చింది.   కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన బారీ వర్షాలలో చెన్నై నగరం నీట మునిగింది. అనేక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సుమారు 542 మందికి పై ప్రజలు మరణించారు. దేశంలో ఉన్నత విద్యావంతులయిన యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థలలో చేరేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. భారత్ తొలి బులెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్-జపాన్ దేశాల మధ్య ఒప్పందం జరిగిందిఅమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళిన 14మంది భారత్ విద్యార్ధులను అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపేశారు. ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్ళడం చాలా సంచలనం సృష్టిస్తోంది. రూ.10 లక్షల వార్షికాదాయం గలవారికి జనవరి 2016 నుండి గ్యాస్ సబ్సిడీ ఇవ్వరాదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

పొరుగింటికి అంటుకొన్న మంటలను అందరూ కలిసి ఆర్పివేయడమే మంచిది లేకుంటే...

  గత ఆరు దశాబ్దాలుగా భారత్ పట్ల మారని పాక్ వైఖరి ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మిక పర్యటనతో మారిపోతుందని ఎవరూ భ్రమలలో లేరు కానీ పాక్ తో సంబంధాలు మెరుగుపడటానికి ఇది ఎంతో కొంత వరకు సహాయపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, సైనిక పెత్తనం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్, మంటలు అంటుకొన్న పొరుగిల్లు వంటిది. ఆ సెగ ఇప్పటికే మనకి చాలా తగిలింది. ఇంకా దానిని పట్టించుకోకుండా వదిలివేస్తే ఏదో ఒకనాడు ఆ మంటలు భారత్ కి కూడా అంటుకోకమానవు.   కొన్ని రోజుల క్రితం “అవసరమయితే భారత్ పై అణుబాంబు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోము,” అని పాక్ సైన్యాధ్యక్షుడు అన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా, పాక్ సైనికాధికారుల యుద్దోన్మాదానికి, ఉగ్రవాదులు, మత చాందసవాదులు కూడా తోడయి ఉన్నప్పుడు వారి చేతిలో అణుబాంబు ఉండటం ఎంత ప్రమాదమో తేలికగానే ఊహించవచ్చును. “పాక్ అణుబాంబు ప్రయోగిస్తే, భారత్ కూడా ప్రయోగించలేదా? పాక్ ప్రయోగించిన అణుబాంబుని అడ్డుకోలేదా?” అని ప్రశ్నించవచ్చును. కానీ అణుబాంబుల ప్రయోగం వరకు వెళితే అది వినాశనానికే దారి తీస్తుంది తప్ప విజయానికి కాదనే సంగతి గ్రహించాల్సి ఉంటుంది.   కనుక పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం బలంగా ఉండటం భారత్ కి అన్నివిధాలా చాల అవసరం. అందుకోసం యిష్టం ఉన్నా లేకపోయినా దానితో బలమయిన స్నేహ సంబందాలు కలిగి ఉండటమే ఇరువురికీ మంచిది. పాకిస్తాన్ కి నిలకడ ఉండని మాట నిజమే. కానీ దానికి కారణం పాక్ ప్రభుత్వంపై యుద్ధోన్మాదంతో తహతహలాడిపోతున్న సైనికాధికారుల పెత్తనం, ఉగ్రవాదులు, మత చాందసవాదుల నుండి వస్తున్న ఒత్తిళ్ళే కారణమని చెప్పవచ్చును.   అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రజా ప్రభుత్వానికి భారత్ అండ చాలా అవసరం ఉంది. ఒకవేళ భారత్ సహకారంతో పాక్ ప్రభుత్వం గట్టిగా నిలబడగలిగితే పాకిస్తాన్ లో క్రమంగా పరిస్థితులలో మార్పు రావచ్చునని ఆశపడటం తప్పేమీ కాదు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అంటూ అమెరికా ప్రతీ ఏటా పాకిస్తాన్ కి కొన్ని లక్షల డాలర్లు ఇస్తోంది. ఇస్తోంది అనే కంటే చెల్లిస్తోంది అని చెప్పడమే సమంజసంగా ఉంటుందేమో? అందుకు చాలా చాలా కారణాలు ఉండవచ్చును.కానీ వాటిలో ప్రధానమయినది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు, మత చాందసవాదులను అదుపు తప్పకుండా నియంత్రించడం కూడా ఒకటని చెప్పవచ్చును. లక్షల డాలర్లు కప్పం చెల్లించి చేస్తున్న అమెరికా పనినే, ప్రధాని నరేంద్ర మోడి దౌత్యపద్దతుల ద్వారా సవరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును.   పాక్ లో తిష్టవేసిన ఉగ్రవాదులు, మత చాందసవాదులు ఈ ప్రయత్నాలని ఎంత కాలం సాగనిస్తారో తెలియదు. కానీ ఈ ప్రయత్నాలు ఏమాత్రం సఫలమయిన ఖచ్చితంగా పాకిస్తాన్ అంతర్గత పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు రావచ్చును. అదే జరిగితే భారత్ పట్ల పాక్ వైఖరిలో కూడా తప్పకుండా మార్పు రావచ్చునని ఆశించవచ్చును.   నిన్న మోడీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసినప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన బాష్యం వారు చెప్పారు. కానీ ఇరు దేశాల ప్రజలు, ముఖ్యంగా పాక్ ప్రజలు మోడీ దౌత్యాన్ని చాలా హర్షించడం గమనార్హం. అంటే పాక్ ప్రజలు భారత్ తో స్నేహం కోరుకొంటునప్పటికీ, ప్రభుత్వాల వైఖరే ప్రజల వైఖరిగా పైకి ప్రదర్శించబడుతోందని స్పష్టం అవుతోంది. వివిధ కారణాల చేత ఇరు దేశాల ప్రభుత్వాలు ఘర్షణ పడుతుంటే అదే ఇరుదేశాల ప్రజల వైఖరి కూడా అని భావించడం పొరపాటని, ఇరు దేశాల ప్రజల స్పందన చూసినట్లయితే అర్ధమవుతుంది.   ముందే చెప్పుకొన్నట్లు పొరుగిల్లు తగలబడుతుంటే అందరూ కలిసి ఆ మంటలు ఆర్పాలి. ఆ ప్రయత్నంలో ఆ మంటలు అదుపులోకి రావచ్చును లేదా ఇంకా పెరగవచ్చును. కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఊరుకొంటే? అందుకే మోడీ పర్యటనకి ఎవరు ఎన్ని బాష్యాలు, కారణాలు చెప్పుకొన్నా అదొక మంచి ప్రయత్నమే కనుక అందరూ సమర్ధించడమే మంచిది.

మోడీ లాహోర్ పర్యటన: ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం

  ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తునప్పుడు ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసిరావడం ఇరుదేశాల ప్రజలను ఆశ్చర్యపరిచింది కానీ అందరూ ఆయన చర్యను అభినందించారు. దౌత్య పద్దతులను, నియమ నిబంధనలను పక్కనబెట్టి ఒక ప్రధాని మరొక దేశ ప్రధానిని కలవడం చాలా అరుదు. కానీ ప్రధాని నరేంద్ర మోడి తీసుకొన్న నిర్ణయం వలన భారత్-పాక్ సంబంధాలకు ఒక కొత్త ఊపు తీసుకు వచ్చినట్లయింది. ఇంతవరకు ఇరుదేశాలు ఏదో ఒక కారణంతో ఒకదానిని ఒకటి ద్వేషించుకోవడమే తప్ప ఈవిధంగా స్నేహపూర్వకంగా మెలగలేదు. ఇరువురు ప్రధానుల మధ్య ఏర్పడిన ఈ సత్సబందాల వలన ఇరు ప్రభుత్వాల వైఖరిలో గత కొన్ని రోజులుగా గణనీయమయిన మార్పులు కనబడటం మొదలయ్యాయి. అందుకే ఇరు దేశాల నేతలు, ప్రముఖులు, విదేశాంగ నిపుణులు, ప్రజలు అందరూ కూడా మోడీ చర్యను స్వాగతిస్తున్నారు. సమర్ధిస్తున్నారు.   దీనిపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ “దౌత్యపరంగా ఇది చాలా ముఖ్యమయిన, మంచి నిర్ణయం,” అని అన్నారు. “ప్రధాని లాహోర్ పర్యటన వలన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఇరుదేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది,” అని రక్షణరంగ నిపుణుడు ఖమర్ ఆఘ అభిప్రాయం వ్యక్తం చేసారు. “ప్రధాని మోడీ సరయిన దిశలో ఒకడుగు వేశారని” జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. “అయితే ఏదో ఆర్భాటం కోసం కాక ఇరుదేశాల మధ్య సబందాలు బలపడేందుకు గట్టిగా, నిలకడగా ప్రయత్నాలు సాగించాలని” ఒమర్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కి చెందిన చాలా మంది ప్రముఖులు ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తూ, మోడీ ఆకస్మిక పర్యాటనని స్వాగతించారు.   “ఇది ఎవరూ ఊహించలేని మంచి ప్రయత్నం. చాలా మంచి ఆలోచన. దీని వలన ఇరుదేశాల ప్రజలకు మంచి సంకేతం పంపినట్లయింది” అని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అన్నారు.   కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం యధాప్రకారం కోడిగుడ్డుకి ఈకలు పీకే పనిలో పడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ, “భారత్-పాక్ మధ్య సంబంధాలు ఇంకా బలపడనపుడు, మోడీ మధ్యలో పాక్ లో ఎందుకు దిగారో తెలియడం లేదు. అటువంటి అతి ముఖ్యమయిన సమాచారాన్ని మనం ట్వీటర్ ద్వారా తెలుసుకోవలసి రావడం దురదృష్టకరం. ఈమధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసాయి. ఆయన పాకిస్తాన్ వెళ్ళదలచుకొంటే వెళ్ళవచ్చును. కానీ పార్లమెంటుకి కూడా తెలియజేయాలనుకోలేదు,” అని అన్నారు.   మరో సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ “ఇది ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చును. ఆయన చేసిన ఈ సాహసం దేశభద్రతకు సవాలు విసురుతోంది. అంత సాహసం చేసినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించలేము. అంత ఆకస్మికంగా ఆయన లాహోర్ ఎందుకు వెళ్ళారో అర్ధం కావడం లేదు,” అని అన్నారు.   “మోడీ, పాక్ ప్రధాని నివాసం చేరుకొనేసరికి అక్కడ ఒక ప్రముఖ పాక్ వ్యాపారవేత్త ఉన్నారు. మరి మోడీ పర్యటన ఆకస్మిక పర్యటన అని ఎలాగ చెప్పగలము?” అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఇక డిల్లీలో యువజన కాంగ్రెస్ నేతలు అందరి కంటే చాలా వికృతంగా ప్రవర్తించారు. మోడీ లాహోర్ పర్యటనని నిరసిస్తూ వారు డిల్లీలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.   కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ “మా ప్రభుత్వం ఏమి చేసినా విమర్శించడమే కాంగ్రెస్ నేతల పని. వారికి దేనిలోనూ మంచి కనబడదు. మోడీ వేసిన ఒక చిన్న అడుగు వలన భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడుతుంటే అందుకు హర్షించకపోగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ముందు పాకిస్తాన్ పట్ల మేము కటినంగా వ్యవహరిస్తే తప్పు పట్టారు. ఇప్పుడు దానితో స్నేహంగా వ్యవహరిస్తే దానిని కూడా తప్పు పడుతున్నారు. అసలు వాళ్ళు ఏమి కోరుకొంటున్నారో కూడా తెలియదు. ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శిస్తున్నట్లుంది తప్ప వారి విమర్శలలో అర్ధం లేదు."   "ఎంతో కాలంగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటువంటి ఒక్కడుగు వేయలేదు. కానీ మోడీ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే విమర్శిస్తున్నారు. ఆయన పర్యటన గురించి లోకం ఏమనుకొంటోందో ఒకసారి విన్నాక కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బాగుంటుంది,” అని వెంకయ్య నాయుడు చురకలు వేశారు.   మోడీ పర్యటన వలన ఏవో అద్భుతాలు జరిగిపోతాయని అనుకోనవసరం లేదు. కానీ ఇటువంటి మంచి ప్రయత్నాల వలననే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. సరిగ్గా క్రిస్మస్ పండుగ రోజునే మోడీ పాకిస్తాన్ కి ఇటువంటి శాంతి సందేశం తీసుకు వెళ్ళడం కాకతాళీయమే కానీ సత్ఫలితాలను ఇవ్వవచ్చును.

ముఖ్యమంత్రి తన మతాచారాలను అమలుచేసుకోవచ్చా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అట్టహాసంగా చేస్తున్న ఆయుత చండీయాగానికి అయ్యే మొత్తం ఖర్చు అంత తనే భరిస్తున్నట్లు చెప్పుకొన్నారు. ఈ యాగానికి సుమారు ఏడు కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ దాని కోసం ఏర్పాటు చేసిన భారీ పోలీస్ బందోబస్తు, యాగం జరుగుతున్న ఎర్రవల్లి గ్రామం వరకు దారి పొడవునా రోడ్లు, కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, యాగశాల నిర్మాణం, రుత్విక్కుల బారీ ఫీజులు, యాగానికి వచ్చిన వారందరికీ భోజనవసతి సదుపాయాలు వంటి ఏర్పాట్లకు, వి.ఐ.పి.ల కోసం హెలికాఫ్టర్లు, అవి దిగేందుకు హెలీప్యాడ్ల నిర్మాణం, రాష్ట్రపతి మొదలు పీటాదిపతుల వరకు అందరినీ స్వయంగా ఆహ్వానించడం కోసం కేసీఆర్ విమాన, హెలికాఫ్టర్ ఖర్చులను కలిపి చూసినట్లయితే కనీసం వంద కోట్లు వరకు ఉండవచ్చని ప్రతిపక్షాలు లెక్క కట్టాయి.   దేశం, రాష్ట్ర శ్రేయస్సు కోరే ఈ చండీయాగం  చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఒకవైపు తెలంగాణాలో రైతులు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకొంటుంటే, దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఈవిధంగా ఖర్చు చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిపడుతోందని వారు ప్రశ్నిస్తున్నారు.   ఈ యాగానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదని అనుకోలేము. దీనికోసం ప్రభుత్వంలో చాలా శాఖలు రేయింబవళ్ళు పనిచేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఉదారణకి పోలీస్ శాఖ ఒకటే చాలు. అటువంటివి ఇంకా చాలా శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ యాగం కోసం పనిచేస్తున్నారు. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా యాగశాలకే అంకితమయిపోయారు. మరి ఈ యాగం వలన ప్రభుత్వం దాదాపు స్తంభించిపోయింది. అటువంటప్పుడు ప్రభుత్వంతో దానికి లేదని ఏవిధంగా అనగలము? కేసీఆర్ ఇంత అట్టహాసంగా యాగం చేస్తుండటంతో, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ పౌరుడిలాగ యజ్ఞాలు, యాగాలు చేసుకోవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు.   కేసీఆర్ అధికారం లేనప్పుడు వ్యక్తిగత హోదాలో ఇటువంటి యాగాలు, యజ్ఞాలు ఎన్ని చేసుకొన్నా ఎవరూ ఆయనను అభ్యంతరం పెట్టలేరు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత మతాభిప్రాయలకు అనుగుణంగా ఈ విధంగా యాగాలు చేయడమే తప్పు అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దేశంలో, రాష్ట్రంలో హిందువులు అధికశాతం ఉన్నారు కనుక ఆయన యాగం చేయడాన్ని ఎవరూ తప్పుగా భావించకపోవచ్చును. కానీ ఒకవేళ అదే ఒక ఇతర మతస్తుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, అతను తన మతాచారాల ప్రకారం ఇటువంటి కార్యక్రమమేదో చేసేందుకు పూనుకొంటే అప్పుడు కూడా అందరూ ఇలాగే స్వాగతించగలరా? ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

తప్పులు కప్పి పుచ్చుకోనేందుకే మరిన్ని తప్పులు చేస్తుంటే...

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగియడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైకాపా ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసుని ఈరోజు శాసనసభ కార్యదర్శికి అందజేయబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ నిన్న ప్రకటించారు. ఈ తీర్మానానికి రోజా సస్పెన్షన్ కి సంబంధం లేదని తెలిపారు. సభలో కేవలం 57మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే కలిగి ఉన్న వైకాపా తను ప్రతిపాదిస్తున్న ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకోలేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయించుకొందదంటే కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించేనని స్పష్టం అవుతోంది.   ఈసారి శాసనసభ సమావేశాలకు సరిగ్గా కొన్ని రోజుల ముందే కాల్ మనీ, కల్తీ మద్యం కేసులు బయటపడటంతో శాసనసభలో అదికార పార్టీని కడిగిపడేయాలని జగన్మోహన్ రెడ్డి తహతహలాడారు. కానీ ఆయన అనుకొన్నది ఒకటి. సభలో జరిగింది మరొకటి. వైకాపా ఎమ్మెల్యే రోజా సభలో ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడటంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అంతవరకు కాల్ మనీ వ్యవహారంలో వైకాపా విమర్శలను తిప్పికొట్టడానికే పరిమితమయిన తెదేపా సభ్యులు రోజా అందించిన ఆ అవకాశం అందిపుచ్చుకొని ఎదురుదాడి చేయడంతో వైకాపా ఆత్మరక్షణలో పడింది. కనీసం అప్పుడయినా జగన్మోహన్ రెడ్డి ఆమె చేత క్షమాపణలు చెప్పించి ఆమెపై సస్పెన్షన్ వేటు పడకుండా జాగ్రత్తపడి ఉండాలి. కానీ ఆమెను వెనకేసుకువచ్చి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకువచ్చేరు. ఒకవేళ రోజా చేత క్షమాపణలు చెప్పించి ఉంటే, అప్పుడు తెదేపా సభ్యులు కూడా ఇక ఆ వ్యవహరంపై మాట్లాడలేకపోయేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆమెను వెనకేసుకొని రావడమే కాకుండా, ఆమె కోసం సభను బహిష్కరించి వెళ్లిపోయారు.   ఒక పొరపాటుని వెంటనే సరిదిద్దుకొనే బదులు వరుసగా మరిన్ని పొరపాట్లు చేయడంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ మరో పెద్ద పొరపాటు చేస్తున్నట్లున్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గించుకోలేమని ఖచ్చితంగా తెలిసి ఉన్నా నోటీసు ఇవ్వడం ఒక పొరపాటు అనుకొంటే “రోజాని సస్పెండ్ చేసినందుకు మేము స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు” అని ప్రకటించుకోవడం మరో పెద్ద పొరపాటనే చెప్పాలి. ఆవిధంగా చెప్పుకోవడం వలన సరయిన, బలమయిన కారణం ఏదీ లేకపోయినా కేవలం తమ తప్పులను కప్పి పుచ్చుకొని స్పీకర్ ని, అధికార పార్టీని అప్రదిష్టపాలు జేసేందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తునట్లు స్వయంగా చాటుకొన్నట్లయింది. ఆ తీర్మానం కూడా సమావేశాలు జరుగుతున్నపుడు పెట్టకుండా, సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ఆగి ఇవ్వాళ్ళ నోటీస్ ఇవ్వడం చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.   ఈ అంశంపై నేటి నుండి మళ్ళీ సమావేశాలు జరిగేవరకు తమ స్వంత మీడియాలో చర్చిస్తూ, అధికార పార్టీయే తప్పులు చేసిందనే భావన ప్రజలకు కల్పించవచ్చునని వైకాపా ఉద్దేశ్యం కావచ్చును. ఇటువంటి విపరీత ఆలోచనలు, ధోరణి కారణంగానే వైకాపా తరచూ ఎదురు దెబ్బలు తింటోంది. కానీ అందుకు వైకాపా నేతలను తప్పు పట్టలేము. వారికి శల్యసారధ్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డినే అందుకు తప్పు పట్టవలసి ఉంటుందేమో? పార్టీలో ఉన్న సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చాలా తొందరపాటుతో తీసుకొంటున్న నిర్ణయాల వలననే ఆ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని చెప్పక తప్పదు.

శాసనసభకు అందుకే వస్తున్నారు..అందుకే బహిష్కరిస్తున్నరేమో?

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి. అనేక ప్రజా సమస్యలపై చర్చించవలసి ఉన్నప్పుడు కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించడాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా తప్పు పట్టింది. కానీ కనీసం ఆ ఐదు రోజులు కూడా సభకు హాజరుకాలేకపోయింది. శాసనసభలో ఆరు ముఖ్యమయిన బిల్లులపై చర్చించాల్సి ఉందని తెలిసి ఉన్నప్పటికీ, వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి నిరాకరించినందుకు, కాల్ మనీపై చర్చకు స్పీకర్ అనుమతించనందుకు నిరసనగా సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆయనతో బాటే వైకాపా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు.   ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి ఆ అవకాశం ఉన్నా కూడా సభను బహిష్కరించి వెళ్ళిపోవడంతో ఆయనకు వాటిపై చర్చించే ఆసక్తి లేదని, కేవలం తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి అవకాశం ఉన్నంతవరకే ఆయన సభలో ఉంటారని స్వయంగా చాటుకొన్నట్లయింది. అంతే కాదు సభలో తెదేపా అమలుచేసిన వ్యూహానికి ప్రతివ్యూహం అమలుచేయడంలో విఫలమయ్యినట్లు స్వయంగా అంగీకరించినట్లయింది. శాసనసభ సమావేశాలు జరిగిన ప్రతీసారి జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు ఇదే విధానం అవలంభిస్తున్నారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శించడం పూర్తవగానే ప్రభుత్వం గురించి తను చెప్పదలచుకొన్నదేదో నాలుగు ముక్కలు చెప్పేసి, ఏదో ఒక సాకుతో సభను బహిష్కరించి బయటకి వెళ్లిపోవడం ఆనవాయితీగా పాటిస్తున్నట్లున్నారు.   ఆయనకు సభలో ఉండే ఆసక్తి, ఓపిక లేకపోతే కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలనయినా సభలో ఉండనిచ్చి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ బిల్లులపై జరిగే చర్చలో పాల్గొనేందుకు అనుమతించి ఉంటే బాగుండేది. కానీ వైకాపా తరపున సభలో మాట్లాడితే తను ఒక్కడు మాత్రమే మాట్లాడాలి మరెవరూ మాట్లాడకూడదనే ధోరణి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. అది మంచి పద్ధతి కాదు. ఆయన ఒక్కడి కోసం మిగిలిన వైకాపా సభ్యులు అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా సభను బహిష్కరించి బయటకి రావలసి వస్తోంది. దాని వలన వారికీ తమ నాయకుడు వైఖరి పట్ల అసంతృప్తి కలగవచ్చును. జగన్ అనుసరిస్తున్న ఈ వైఖరి వలన అంతిమంగా నష్టపోయేది వైకాపాయే తప్ప తెదేపా కాదని గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శాసనసభకి జగన్మోహన్ రెడ్డి శలవు!

  శాసనసభ సమావేశాలలో ఒకసారి ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తే మరొకసారి ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోతుంటారు. ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా అరిటాకుకే నష్టం అంటారు. కానీ ప్రతిపక్షాలకి ఆ సూత్రం వర్తించదనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసినా, ప్రతిపక్ష సభ్యులే శాసనసభని బాయ్ కాట్ చేసి బయటకి వెళ్లిపోయినా తప్పంతా అధికార పార్టీదేనని వాదిస్తుంటాయి. మొన్న వైకాపా సభ్యులందరినీ సభ నుంచి రెండు గంటల పాటు సస్పెండ్ చేసినపుడు అది చాలా అన్యాయమని వాదించారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని జగన్ చాలా ఆవేదన పడిపోయారు. ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా? కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చిస్తారా? లేదా అని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ని ప్రశ్నించారు. ఆయన నిరాకరించడంతో “అయితే ఇక శలవు” అంటూ జగన్ తన ఎమ్మెల్యేలతో సహా సభను బహిష్కరించి బయటకి వెళ్ళిపోయారు.   సభ నిర్వహణకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందరూ దాని ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. కానీ శాసనసభలో కార్యక్రమాలు తను ఆశించినట్లు జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకొంటున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం ఆయనకీ తెలుసు. సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ అందుకు కారణం అధికార పార్టీ నిరంకుశ వైఖరేనని ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి సభను తమకు ఇష్టం వచ్చినట్లు నడిపించుకొంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే కాల్ మనీ వ్యవహారంలో సభలో జగన్ గంటల తరబడి ధాటిగా మాట్లాడిన విషయం మరిచిపోయినట్లున్నారు.   ఈరోజు శాసనసభలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విదేశీ మద్యం సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, మెట్రో పాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బిల్లులపై చర్చ జరుగబోతోంది. ఆ చర్చలో పాల్గొని వాటిలో లోటుపాట్లను ఎత్తి చూపించవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా మీద ఉంది. కానీ ఆ చర్చలో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయి తిరిగి ప్రభుత్వాన్నే నిందిస్తోంది.   ఇంతకు ముందు సమావేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే తొందరపాటు ప్రదర్శించి సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ఆవిధంగా చేసినందుకు ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో మళ్ళీ సభకు తిరిగి వచ్చేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం. కనుక తన జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకే సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారని అప్పుడే మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనుక మళ్ళీ రేపు సభకు తిరిగి వస్తారేమో?   తెదేపా ప్రభుత్వం ఈసారి శాసనసభ సమావేశాలను కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకొన్నప్పుడు వైకాపా దానిని తప్పు పట్టింది. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరుగవలసి ఉండగా కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడం సరికాదని, కనీసం మరో వారం రోజులయినా పొడిగించాలని డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఈ ఐదు రోజుల సమావేశాల్లోనే ఒకరోజు సస్పెండయ్యి బయటకు వెళ్ళగా, ఈరోజు వైకాపాయే సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయింది. అయితే ఈ ఒక్కరోజుకే సభను బహిష్కరించి వెళ్ళిపోతున్నారా లేక రేపు శాసనసభ సమావేశాలు ముగిసేవరకు బహిష్కరించబోతున్నారో జగన్ చెప్పలేదు. కనుక వైకాపా సభ్యులు రేపు సభకు వస్తారో రారో తెలియదు. మరి ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు శాసనసభ సమావేశాల నిర్వహణ కోసం వైకాపా పట్టుబట్టడం దేనికో?

మన దేశంలో న్యాయానికి ఒక లెక్క ఉంటుంది...

  నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధిలకు డిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అటువంటి నేరారోపణలు ఎదుర్కోవలసి వచ్చినందుకే సిగ్గుతో తల దించుకోవలసిన వారు, ఏదో ఘనకార్యం చేయడానికి బయలుదేరుతున్నట్లు మంది మార్బలాన్ని వెనకేసుకొని పాటియాలా హౌస్ కోర్టుకి తరలివెళ్ళడం, జైలుకి వెళ్ళవలసిన దుస్థితి కలిగినందుకు చింతించవలసిన వాళ్ళు బెయిలు మంజూరయినందుకు పండుగ చేసుకోవడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. వారిలో సోనియా గాంధీకి బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా పేర్కొనబడిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పూచీకత్తు ఇవ్వడం మరో విశేషం. ఆ కేసులో ఆయన కోర్టులో హాజరు కావలసివచ్చినపుడు, సోనియా గాంధీ తదితరులు పాదయాత్ర చేసి ఆయనకు సంఘీబావం ప్రకటిస్తే, ఇప్పుడు ఆయన ఆ ఋణం తీర్చుకొంటున్నట్లుంది. ఇంత కాలం దేశాన్ని తమ కనుసైగలతో శాశించిన తమ అధిష్టాన దేవతలకి బెయిలు మంజూరు కావడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం ఇంకా బాగుంది.   అయితే నేటి రాజకీయాలలో ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ దానిని రాజకీయ కక్ష సాధింపులు ఖాతాలో వ్రాసుకొనే సదుపాయం ఒకటి ఏర్పడింది కనుక అటువంటి మహా నేతలకి, జననేతలకి వారి పార్టీలు, చివరికి చాలా మంది ప్రజలు కూడా నీరాజనాలు పట్టడం కూడా సర్వసాధారణమయిపోయింది. కనుక జరిగిన ఈరోజు డిల్లీ దర్బారులో జరిగిన ఈ సంఘటనలకి మరీ ఎక్కువగా ఆశ్చర్యపోనవసరం లేదు. డబ్బు, అధికారం, పరపతి, మంది మార్బలం అన్నీ ఉన్నవారు నేరం చేసినా అది ప్రజలకు ఒక వార్త అవుతోందే తప్ప నేరంగా చూడటం లేదు. ఎందుకంటే నేరం నిరూపించబడనంత వరకు మనం ఎవరినీ నేరస్తులనలేము. అలాగే వారి నేరం అప్పటికీ నిరూపించడం మన దేశంలో ఎన్నడూ సాధ్యం కాదు వారందరూ ఆణిముత్యాలే మనకి.   పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా న్యాయంలో ఇటువంటి వారి కోసం "స్పెషల్  న్యాయం" మన దేశంలో అమలవుతున్నందుకు మనం అందరం చాలా సంతోషించాలి. 2జి, బొగ్గు కుంభకోణం, దాణా కుంభకోణం, అక్రమాస్తులు, హిట్ అండ్ రన్ కేసులు వంటి కేసులన్నిటిలో “స్పెషల్ న్యాయం” చేసుకోగలిగాము. ఇంకా మున్ముందు ఇలాగ న్యాయం చేసుకొంటూనే ఉంటామని స్పష్టం అయ్యింది కనుక అందుకు భారత్ ప్రజలందరూ చాలా సంతోషించాలి. తప్పదు.   ఎ. రాజా, కనిమోలి, లాలూ ప్రసాద్ యాదవ్ మొదలుకొని జయలలిత, సల్మాన్ ఖాన్ ఇప్పుడు సోనియా రాహుల్ గాంధీల వరకు అందరూ కూడా తమను తాము బాదితులుగానే చెప్పుకొంతున్నారు. ప్రజలు కూడా సవినయంగా అంగీకరిస్తున్నారు. అయితే ఈ బాధితులు అందరికీ న్యాయం చేకూర్చవలసిన బాధ్యత మన న్యాయస్థానాలపైనే ఉంది కనుకనే ఒకవేళ క్రింద కోర్టులో వారికి అన్యాయం జరిగినట్లయితే పై కోర్టులు వారికి న్యాయం చేస్తుంటాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో చివరికి న్యాయమే గెలుస్తుందని సోనియా గాంధీ అందుకే అన్నారేమో?   అంత పెద్దవాళ్ళు అంతమంది లాయర్లను అంతమంది అతిరధ మహారధులను కోర్టుకి వెంటబెట్టుకొని వస్తే వారిని ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు కనుక కేవలం ఐదే ఐదు నిమిషాలలో బెయిలు మంజూరు చేసేసి సాదరంగా వారిని పంపించేసారు. మళ్ళీ రెండు నెలల వరకు కోర్టు గడప తొక్కనవసరం లేకుండా ఫిబ్రవరి 20వ తేదీకి కేసును వాయిదా వేసేశారు. బహుశః అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందేమో? ఈ మాత్రం దానికి వాళ్ళని బలవంతంగా కోర్టుకి రప్పించడం దేనికో తెలియదని జనాలు గొణుకొంటే అది వారి అజ్ఞానమే తప్ప మరొకటి కాదని సరిపెట్టుకోవాలి. తప్పదు.