పండుగలను మిస్ అవుతున్న ప్రధానప్రతిపక్షాలు

  పండగలంటే రాజకీయ నాయకులకు ఎంతో సంతోషం ఎందుకంటే కనీసం వారు ఆరోజన్నా కుటుంబ సభ్యులతో గడపవచ్చని అయితే పాదయాత్రలపేరుతో ప్రజల మద్యనున్న ప్రధాన ప్రతిపక్షాలయిన తెలుగుదేశం, వైకాపా లు పండుగకు దూరం అవుతున్నారు. ఈనెల 24 జరుగనున్న దసరా, 27న బక్రీద్, నవంబరు 13న దీపావళి, డిసెంబర్ 25న  క్రిస్మస్ జనవరి 14 తెలుగువారందరికి పెద్ద పండుగయిన సంక్రాంతికి వారు దూరమవుతున్నారు.  తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు దసరారోజు ఉదయం పార్టీనేతల అభినందనలతో మద్యాహ్నంనుండి కుటుంబసభ్యులతో గడపనున్నారు. ఇప్పటివరకు 380 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని మహబూబ్ నగర్ జిల్లాలో కాలుపెడుతున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజిగా వుండే చంద్రబాబు ఒక్క ఆదివారం మత్రమే కుటుంబసభ్యులతో గడుపుతారు. అయితే బాగా ముఖ్య కార్యక్రమాలు ఉన్న ఆదివారం సాయంత్రం పూట ఖచ్చితంగా ఇంట్లో వుండేలా చూసుకుంటారు. అయితే పాదయాత్ర సందర్భంగా ఆయన జనం మద్యనే ఉంటున్నారు. అయితే ఈసారి చంద్రబాబు పెద్దపండుగలన్నిటినే త్యాగం చేశారు. అన్నిటిని ఆయన ప్రజల మద్యనే జరుపుకోవలసి వస్తుంది. జనవరి 26 వరకు అదే పరిస్థితి కొనసాగనుంది.  వైకాపా తరుపున పాదయాత్ర చేస్తున్న షర్మిల తమ ముఖ్య పండుగలయిన క్రిస్మస్, జనవరి ఫస్టును  ప్రజల మద్యనే జరుపుకోనున్నారు. క్రిస్మస్ ను మామూలుగా అయితే బెంగుళూరు లో జరుపుకునేవారు. అయితే వైయస్ మరణానంతరం  ఇడుపుల పాయలో జరుపుకుంటున్నారు. మామూలుగా హిందూ పండుగలు ఆచరించని షర్మిల కుటుంబం పండుగ సందర్బంగా వచ్చే పార్టీనేతలను మాత్రం కలుస్తుంటారు.

గాలిలో దీపం.. ప్రజారోగ్యం

  రాష్ట్రంలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లాంటి విషజ్వరాలు ముసురుకొని ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. సంబంధిత శాఖామాత్యులు ఏం చేస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో తెలియదు. విషజ్వరాల బారినపడిన రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో దోమలు విజృంభించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటాయి. లార్వా దశలోనే వాటిని నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని, అమలు చేయడం కనీస కర్తవ్యం. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదు. దాని ఫలితమే ప్రస్తుత హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితి. దోమల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా సద్వినియోగం చేయడం లేదు. ప్రజారోగ్యం పట్ల మన నాయకులకు ఎంత చిన్నచూపో చెప్పడానికి ఇక్కడ ఒక ఉదాహరణ. లార్వా దశలో దోమల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో మండలానికి రెండున్నర లక్షల రూపాయలు కేటాయించింది. ఈ పథకం అమలుకు అవసరమైన సామగ్రి తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధి, తెలంగాణ ప్రాంతంలో ఒక మండలాధ్యక్షుడిని కలిశాడు. పథకం గురించి వివరించాడు. అప్పుడు ఆ నాయకుడినుంచి వచ్చిన స్పందన ఏమిటంటే... ‘పండక్కి బట్టలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు పంపించారు కానీ దోమలను చంపడానికి కాదు’ అని! వినగానే నవ్వు రావచ్చు కానీ, ఇది యదార్ధ సంఘటన.

విజయమ్మ బైబిల్‌ పాఠాలు

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బైబిల్‌ పట్టుకుని సభలలో పాల్గొనడంపై మరో విడత వివాదం చెలరేగుతోంది. ఆమె మత ప్రచారం చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. బైబిల్‌ పట్టుకుని ఉపన్యసిస్తే.. ఆ వ్యక్తిని క్రిస్టియన్‌ ఫాదర్‌ అనే అనుకుంటారు. విజయమ్మ బైబిల్‌ పట్టుకొని సభలో పాల్గొనకూడదనే రూలేమీ లేదు. అయితే భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశం. విజయమ్మ ఒక సెక్యులర్‌ రాజకీయ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. అటువంటి హోదాలో వున్న వ్యక్తి ప్రత్యేకించి ఒక మత గ్రంథాన్ని చేతిలో ధరించి బహిరంగ వేదికలపై పాల్గొనడం ఆక్షేపణీయమే. తాను చర్చిలకే కాకుండా దేవాలయాలు, మసీదులను కూడా సందర్శిస్తుంటానని ఆమె చెప్పారు. అన్ని మతాలపై విశ్వాసం వుందని సెలవిచ్చారు. బైబిల్‌ పట్టుకుంటే ధైర్యంగా వుంటుందని, మైకు ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడేందుకు శక్తి వస్తుందని విజయమ్మ చెప్పుకున్నారు. ఆమెకు ఎలాగూ అన్ని మతాలపై విశ్వాసం వుంది కాబట్టి, మరింత ధైర్యం చేకూరేందుకు, మరింత వాగ్ధాటితో మాట్లాడే శక్తిని కూడగట్టుకునేందుకు విజయమ్మ బైబిల్‌తో పాటు భగవద్గీత, ఖురాన్‌లను కూడా చేతిలో పట్టుకొని సభలలో పాల్గొంటే ఎవరినుంచీ ఏ ఆక్షేపణా వుండదు కదా?

కిరణ్‌ వున్నట్టా లేనట్టా?

  అటు చంద్రబాబు కానీ, ఇటు షర్మిల కానీ పాదయాత్రల్లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై, దాని వైఫల్యాలపై దృష్టి పెట్టడం లేదు. కిరణ్‌ ప్రభుత్వం ఒకటి వున్నట్టుగా వారు భావించడం లేదు. విద్యుత్‌ సంక్షోభానికి చంద్రబాబు కారణమని షర్మిల ఆరోపిస్తే, వైఎస్‌ కారణంగానే ఈ సంక్షోభమని తెలుగుదేశం అధినేత విమర్శిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ సోదరి హోదాలో పర్యటిస్తున్న షర్మిలకు చంద్రబాబే టార్గెట్‌గా వున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల దృష్టిలో కూడా కిరణ్‌ ప్రభుత్వం ఉత్సవ విగ్రహమే. చివరికి రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ను లైట్‌గా తీస్కుంటున్నారు. ముఖ్యమంత్రితో ఓ మాట కూడా చెప్పకుండా ఎవరంతట వారు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు కలిసికట్టుగా ఢల్లీకి వెళ్లి అధిష్టానంతో సాగిస్తున్న మంతనాలు దీనికొక ఉదాహరణ.

కాంగ్రెస్‌కు కాపులు దూరం!?

  రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా అనే సందేహం ఇటీవలి పరిణామాలు చూస్తే కలుగుతుంది. మీకోసం వస్తున్నా పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు కాపుల నుంచి మంచి స్పందన లభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపున కాంగ్రెస్‌లో కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇది కాంగ్రెస్‌కు నష్టమని రాష్ట్ర మంత్రి రామచంద్రయ్య బాహాటంగానే ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడుతోందని ఆయన అన్నారు. చిరంజీవిని బలోపేతం చేస్తేనే కాంగ్రెస్‌ బలపడుతుందని ఆయన చెప్పారు. దీని అర్ధం.. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్‌ విస్తరణలో చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలని. రాజ్యసభ సభ్యుడిగా వున్న చిరంజీవికి కేంద్ర కేబినెట్‌ బెర్త్‌ ఇదివరకే రిజర్వ్‌ అయింది. అయితే రాంబాబు సినిమా వివాదాన్ని అడ్డం పెట్టుకొని, కాంగ్రెస్‌ నేతలు కొందరు అధిష్టానానికి చిరంజీవిపై చాడీలు చెప్పారని మాజీ ప్రజారాజ్యం నాయకులు అనుమానిస్తున్నారు. అందుకే రామచంద్రయ్య ఆ విధంగా మాట్లాడారని వినికిడి.

తెలంగాణలో బాబు గట్టెక్కుతారా?

  రాయలసీమలో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణలో కాలు మోపనున్నారు. వస్తున్నా... మీకోసం యాత్రలో ఇది కీలక ఘట్టం కానున్నది. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మండలంలో సుంకేశుల డ్యాం వద్ద పాదయాత్ర చేపట్టనున్నారు. తెలంగాణపై వైఖరి చెప్పకపోతే చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ విషయంలో పార్టీ ప్రకటించిన వైఖరి పట్ల తెలంగాణ వాదులు సంతృప్తి చెందడం లేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు పాదయాత్ర సాగనున్నది. నిజానికి పాలమూరుతో చంద్రబాబుకు చాలా అనుబంధం వుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా తెలంగాణలో బాగా వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాను చంద్రబాబు ప్రభుత్వం దత్తత తీసుకుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాలమూరు ప్రజలు బాబును ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.

ఎలా పేలుతుందీ రాం‘బాంబు’?

  అన్ని కాన్సెప్టులు ఐపోయినట్టుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అమాంతం జర్నలిజంపై పడిపోయింది. మనకు నచ్చినదైనా, నచ్చకపోయినదైనా సరే, మన నోటినుంచి కాకుండా మరొకరి నోటినుంచి అనిపిస్తే దానికి కొంత విలువ వుంటుందనేది జనాభిప్రాయం. అదే మాటను ఒక జర్నలిస్టు నోటినుంచి అనిపిస్తే మరింత విలువ వుంటుందని జనాల గుడ్డి అభిప్రాయం. సినిమా విషయానికి వస్తే... అందులో అభ్యంతరకర సన్నివేశాలు వున్నాయని ఆక్షేపణ. అసలు ఏ పాత్రా దొరకనట్టు పవన్‌కళ్యాణ్‌ జర్నలిస్టు పాత్ర వేయడమే పెద్ద ఆక్షేపణ. దానికి తోడు ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ అనే టైటిల్‌ ఒకటి. కెమెరా పట్టుకున్నది గంగ అయితే కెమెరా వుమెన్‌ అనో, కెమెరా పర్సన్‌ అనో అనాలి కదా!? తెలుగు భాష ఎప్పుడో తగలడిపోయింది కాబట్టి దాని సంగతి వదిలేద్దాం. తగలడిపోయిన తెలుగుభాషలాగానే తెలుగువారి మధ్య ఐక్యత కూడా అంతగానే తగలడిపోయింది. ఐక్యత, సమైక్యత అనేవి తెలుగు నేలలో ఇప్పుడు బూతుపదాలు. విభజన, విచ్ఛిన్నత అనేవి పవిత్ర పదాలు. ఈ విభజనపు పవిత్ర పదాల ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమాకు అనేక నంది అవార్డులు లభించాయి... చివరికి జాతీయ సమైక్యతా అవార్డు సహా! ఒకే తెలుగుజాతి మధ్య అంతరాలు వున్నాయని చాటింపు వేసిన సినిమాకు జాతీయ సమైక్యతా అవార్డు దక్కితే, అదే తెలుగుజాతి వేర్వేరు కాదు.. సమైక్యం, సమాఖ్యం అని చాటిచెప్పే సినిమాకు ఎన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాలి? కర్ర వున్నవాడిదే బర్రె అన్న చందంగా నోరున్నవాడిదే రాజ్యంగా చెలామణి అయిపోతోంది. ఏది ఏమైనా సినిమాలు సాంస్కృతిక సాధనాలు. అవి బాగుంటే జనం ఆదరిస్తారు. లేదంటే ఛీత్కరిస్తారు. సమాజ హితానికి చేటు చేసే అంశాలు లేకుండా చూడడమే సెన్సార్‌ బోర్డు లక్ష్యం తప్ప రాజకీయ అంశాలు లేకుండా చూడడం కాదు. ఒక ప్రాంతంవారి మనోభావాలు దెబ్బతినేలా వున్నాయని సాంస్కృతిక శాఖ మంత్రి తీర్మానించి, సూపర్‌ సెన్సార్‌ కమిటీని నియమించడం సమంజసం కాదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనేక సినిమాలు వచ్చాయి. అనేక పాటలు, కళారూపాలు ప్రచారంలో వున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇలాగే సూపర్‌ సెన్సార్‌ కమిటీలు వేస్తారా మరి?

వై దిస్‌ కొలవరి లోకేష్‌!?

  రాష్ట్రంలో ఇప్పుడు యాత్రల సీజన్‌ జోరుగా నడుస్తోంది. అయితే ఇవి ఎబ్బెట్టు యాత్రలుగా జనంనుంచి నిరాదరణ ఎదుర్కొంటున్నాయి. ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు పాదయాత్ర చేస్తే ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో... మన రాష్ట్ర నాయకులు చేస్తున్న పాదయాత్రలు అంతే ఎబ్బెట్టుగా వున్నాయి. అధికార కుర్చీ మొహం ఎరగని రోజుల్లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారంటే దానికో అర్థం వుంది. కానీ తొమ్మిదేళ్లు అధికారంలో, దాదాపు అంతేకాలం ప్రతిపక్షంలో వున్న చంద్రబాబునాయుడు పాదయాత్ర చేయడంలో అర్థంలేదు. పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వుండి సమీక్ష చేయడానికి సర్వ సమగ్ర ఏర్పాట్లు వుండి కూడా, అధికార యంత్రాంగంపై అదుపుతప్పిన లోటును కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పల్లెబాట పట్టి వారంలో రెండు మూడు రోజులు అక్కడే గడిపి ‘ఇంటిపోరు’ తప్పించుకుంటున్నారు. తండ్రి తప్పిదాలకు వారసుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన పోరుయాత్రలు ఇప్పుడు జైలుయాత్రలుగా రూపాంతరం చెందాయి. రాష్ట్రంలోని మిగతా పార్టీలవి నిరంతర యాత్రలే. అయితే జగన్‌ తరఫున ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టడమే విశేషం. ఆమెను ‘బేబీ షర్మిల’ అని ముద్దుగా పిలుచుకోవడం కద్దు. ఏమీ తెలియని అమాయకురాలు అని అందులో అర్థం వుంది. షర్మిల పాదయాత్ర ఎందుకు ఉద్దేశించినదన్నది చెప్పడం కష్టం. రింగ్‌ మాస్టర్‌ జైలులో చాలాకాలంగా వుండడం వల్ల, ఇప్పట్లో బయటికి వస్తాడనే నమ్మకం ఎవరికీ లేనందువల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అయోమయం, అలసత్వం నెలకొన్నాయి. వీటిని పారదోలి మునుపటి ఉత్తేజం అందించడానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు శక్తిసామర్ధ్యాలు లేవు. చేతిలో బైబిల్‌ పట్టుకొని సాగించగలిగిన ప్రచారం, చేయగలిగిన జనాకర్షణకు చాలా పరిమితులు వున్నాయి. జగన్‌కు వున్న జనాకర్షణతో పోల్చితే ఆయన మాతృమూర్తి, స్వయాన వైఎస్‌ సతీమణి విజయమ్మకు ఆదరణ శూన్యమనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆకాశంలోంచి ఊడిపడిన ‘ఏంజిల్‌’ బేబీ షర్మిల!  ఆమె ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కేవలం వైఎస్‌ కుమార్తెగా ఆమె పాదయాత్ర చేస్తున్నారు. దీనివెనుక రాజకీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏమిటో ఎవరికెరుక!? ఈ నేపథ్యంలో చూస్తే.. చంద్రబాబు అనవసరంగా పాదయాత్ర చేపట్టారు. కొత్తగా ప్రజా సమస్యలు తెలుసుకోవలసింది, పరిష్కార మార్గాలు అన్వేషించవలసింది ఆయనకు ఏమీ లేదు. అనవసరంగా ఈ వయసులో ఆయాసం, అనారోగ్యం తప్ప. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు లోకేష్‌ పాదయాత్రకు పూనుకుని వుంటే అన్ని విధాలుగా ప్రయోజనం వుండేది. యువనాయకుడు కాబట్టి జనంలో కలిసి, వారితో మమేకమైతే అనేక సాధకబాధకాలు తెలుస్తాయి. వాటికి అనుగుణంగా పార్టీ విధానాలు రూపొందుతాయి. లోకేష్‌ పాదయాత్ర చేస్తే యువతరం అందులో భాగస్వామ్యం అవుతుంది. జగన్‌కు, సోదరి బేబీ షర్మిల యాత్రలకు ధీటుగా వుంటుంది. ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీపై ఒక ఆరోపణ వుంది. యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని. మూడు దశాబ్దాలుగా పాదుకుపోయిన వృద్ధ నాయకత్వమే మండల స్థాయినుంచి కేంద్ర స్థాయి వరకూ వుందని! ఈ ఆరోపణలను పటాపంచలు చేసి యువ నాయకత్వం సారధ్యంలో తెలుగుదేశం నూతన దిశానిర్దేశం చేయబోతోందంటూ ప్రజలకు కొత్త సందేశం ఇవ్వడానికీ వీలుండేది. పైగా షర్మిలలాగా లోకేష్‌ రాజకీయాలకు కొత్త కాదు. మునుపటి ఎన్నికలప్పుడు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈ సంధికాలంలో రైట్‌పర్సన్‌ లోకేష్‌ అనడంలో సందేహం లేదు.

జీవవైవిధ్య సదస్సుతో ఒరిగిందేమిటి

జీవవైవిధ్యానికి ముందు 10 వేల మంది ప్రతినిధులు 138 దేశాలనుండి వస్తారని, దానిలో 15 దేశాల ఫ్రధానులు వస్తారని ప్రచారం జరిగింది కాని ఏ ప్రధానులూ రాలేదు. మన దేశం నుండి రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కాని అలాంటిదేమీ జరగలేదు సరికదా ప్రధాని వచ్చి ప్రసంగంచి వెళ్లిపోయారు తగినంత సమయం కాని, హామీలు కానీ ఏవీలేవు, 225 కోట్లరూపాయలు జీవవైవిధ్యానికి కెటాయించామన్నారు అది ఎన్ని ఏళ్లకో చెఫ్పనేలేదు. ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేయాలి కాని జరిగింది వేరు. కేవలం మేధావులు ప్రసంగాలు చేసి వెళ్లిపోయారు. అమలు ఎంతమేరకు చేస్తారనేది ప్రశ్నార్ధకమే. మనిషి స్ధిర జీవనం ఏర్పరుచుకున్న దగ్గర నుండి ఈ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 30 ఏళ్లలో మనిషి ప్రకతిని వికతిగా మార్చేశాడు. ఇప్పటికే ఈ విషమ పరిస్థితులకు గానూ 10 కోట్లమంది చనిపోయారు. 2050 నాటికి పరిశ్రమలు 10 రెట్లు పెరుగుతాయని మేధావులు అంచనా వేస్తున్నారు. అంటే భావితరాల భవిశ్వత్తు ప్రశ్నార్ధకమే నన్నమాట..... ఎందుకంటే దానివల్ల కార్బన్ ఉద్ఘారాలు పెరుగుతాయి. మనిషి జీవనం అతలాకుతలమవుతుంది. ఇంత చేటున్న అగ్రరాజ్యాలు తమకేమీ పట్టవన్నట్లు చూస్తున్నాయి.  ఈ సమావేశాలకు జర్మనీ, బ్రిటన్ అమెరికా, ప్రాన్స్ దేశాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సమావేశాలుకు వెళ్లే దేశాలు మొదటి సమావేశంలో  అమలు జరపవలసిన విధివిధానాలనే అమలు చేయాలేదు. మరి ఎందుకు జరిపినట్టు  ఈ సమావేశాలు రాబోయే తరాలకు ఏం సమాధానం చెబుతారో............

ప్లైట్లకంటె పచ్చ బస్సులే నయం

  మనం ఏదన్నా ఊరు వెళుతున్నామనుకొండి మద్యలో మనం ఎక్కిన బస్పు ఆగిపోతే కండక్టరు మరొక బస్సును ఆపి ఎక్కించే అవకాశం ఉంది లేదా డిపోకు ఫోను చేసి మరొక బస్సును రప్పించి ఎక్కించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మద్య సమయాన్ని ఆదాచేయాలని వేలుపోసి ఎయిర్ బస్ లో టికెట్టు రిజర్వేషన్ చేయించుకుంటే టైము రాకపోవడపో లేదంటే పూర్తిగా క్యాన్సిల్ చేయడమో జరుగుతుండటంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. ప్రయాణీకులు సమయానికి విలువనివ్వడం పెరిగిన తరువాత ప్రవేటు ఎయిర్ బస్లు తామర తంపరగా పుట్టుకొచ్చాయి. అయితే నాణ్యమైన సేవలు అందించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రభుత్వం రంగంలో పనిచేసే విమానాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఏది ఏమైనా ప్రయాణీకులను యాతన పెట్టటంలో ఎవరికి వారే సాటి. అందుకు ఉదాహరణగా నిన్న అబుదబినుండి కొచ్చికి రావలసిన విమానం ప్రయాణీకులకు వాతావరణం బావుండలేదని తెలియపరచకుండా అత్యవసరంగా తిరువనంతపురంలో ల్యాండ్ చేసి ప్రయాణీకులను అసహనానికి గురిచేసింది. దాంతో ప్రయాణీకులలో ఒకరు ఎందుకు ఇంకా గమ్యస్థానాన్ని చేరుకుంటానికి లేట్ అవుతుందో తెలుసుకుందామని కాక్ పిట్ లో ప్రవేశించగానే పైలెట్ విమానంలోకి ఉగ్రవాది ప్రవేశించాడంటూ ఎయిర్ పోర్టు అధికారులకు అత్యవసర సందేశం పంపడం జరిగి గందరగోళానికి కారణమయ్యింది. ఎట్టకేలకు 7 గంటలు ఆలస్యంగా ప్రయాణీకులను గమ్యస్ధానానికి చేర్చింది.

వేయడానికి వేలు తీయడానికి వందలు

  రాష్ట్రంలోని కారు యజమానులందరికీ పెద్ద చిక్కొంచిపడింది. అదేమంటే కార్ల సైడ్ అద్దాలకు ఉన్న బ్యాక్ ఫిలింని తీయించడానికి వారం రోజులే ఉండటం.  కారుల్లో ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలు జరుపుతున్నా కనబడటం లేదని అందువల్ల వాహన దారులు వాటిని తొలగించాలని పోలీసులు ఉత్తర్యులు జారీ చేయడమే ఇందుకు కారణం. కొద్దిరోజులు మాత్రమే గడువు వుండటంతో నాలుగు చక్రాల వాహక చోదకులంతా బ్లాక్ ఫిలింలను తీయడానికి గానూ షాపులముందు పడిగాపులు పడవలసి వస్తుందని వారు వాపోతున్నారు. దానిని వేయించడానికి వేలు ఖర్చు పెట్టామని అయితే పోలీసు వారి హెచ్చరికల మేరకు వాహన దార్లు వాటిని తీయించడానికి వందలు గుంజుతున్నారని ఆగ్రహిస్తున్నారు. ముందుగానే రవాణా శాఖ, పోలీసు శాఖ  ఒక అవగాహనకు వచ్చి వుంటే తమకు  మేలుగా ఉండేదని, సమయమూ,, డబ్బూ రెండూ ఆదా అయ్యేయని వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

పోలీసు సేవలు భేష్ అన్న విద్యార్ధులు

  సికింద్రాబాద్ లో శుక్రవారం స్కూలు పిల్లల కోసం హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఏర్పాటు చేసిన వివిధరకాలయిన  గన్స్, పిస్టల్స్ ఎగ్జిబిషన్ పిల్లలను ఆకర్షించింది. ఎప్పుడూ సినిమాల్లో చూసే వెపన్స్ ను సిపి అనురాగ్ శర్మ ధగ్గరుండి చూపటంతో విద్యార్దినీ విద్వార్ధులకు సంతోషం కలిగించింది. గన్స్ లో రకాలు అవి పని చేసే తీరు, ఎక్కుపెట్టవలసిన విధానం పిల్లలకు పోలీసులు వివరించారు. అలాగే ఆందోళనలు చెలరేగినప్పుడు వారు ఉపయోగించే పద్దతులను కూడా మాక్ డ్రిల్ ద్వారా చూపడం కళ్లకు కట్టినట్లుందని విద్యార్దులు ఆనందం వ్యక్తం చేశారు. ఆందోళనాకారులు రాళ్లు విసురుతున్నప్పుడు పోలీసుల రకణ కవచంగా ఉపయోగించే షీల్టు, దాని ఉపయోగం కూడా వారు తెలుసుకున్నారు. అలాగే విద్యంసం జరిగినప్పుడు పోలీసులు అవలం భించే విధానంతో పాటు ఆందోళనాకారులను ఏలా తరిమి కొడతారో చూపారు.  వాటర్ క్యాన్యను ఉపయోగించే పద్దతిని మక్ టెస్టులతో పోలీసులు వివరించడం వల్ల విద్యార్ధుల్లో పోలీసులపై అవగాహన పెరిగిందని విద్యార్ధులు తెలియ చేశారు. విధ్యార్ధుల్లో పోలీసులపై అవగాహన పెరగటానికి భవిష్యత్తులో విద్యార్దులు పోలీసు ఉద్యోగాలను ఎంచుకోవడానికి ఉపకరించాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించి నట్లు కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

మంత్రి పదవి తోటకు అందని ద్రాక్షేనా?

  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ఊరిస్తున్న మంత్రి పదవి అందని ద్రాక్షేనా? ఈ ప్రశ్న నియోజకవర్గంలోని అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రత్యేకించి మంత్రి పదవి కోసమే త్రిమూర్తులు గెలిచారని ద్రాక్షారామ భీమేశ్వరుని ముందు అభిమానులు నమ్మబలికారు. దీంతో తోట కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి తోటకు పెద్దగా మద్దతు లభించటం లేదు. ఎందుకంటే తాను పీఆర్పీ అని తోటే చెప్పుకుంటున్నారు. పైగా, ఎన్నికల్లో అసలు ప్రచారం వద్దనుకున్న చిరంజీవి వెనుక ఆయన నిలుస్తున్నారు.  చిరంజీవికే కేంద్రమంత్రి పదవి విషయంలో సీరియస్‌గా వ్యవహరించిన కాంగ్రెస్‌ ఆయన అనుచరునికి అంత త్వరగా కొరుకుడు పడుతుందా? వాస్తవానికి అంత శ్రమ లేకుండానే మంత్రి పదవి తోటకు వచ్చి ఉండేది. కానీ, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భావించినట్లు తోట నడుచుకోవటం లేదు. దీంతో ఆయన కూడా వెనుకడుగు వేశారు. చిరంజీవి వర్గంగా తోటకు పబ్లిసిటీ బాగా జరుగుతున్నందున కిరణ్‌ మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఆలోచిద్దామని ఈ విషయాన్ని పక్కన పెట్టారు. పైగా, మంత్రి పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినందున ఎక్సయిజ్‌ మంత్రి పదవి తోటకు ఇవ్వాలని చిరంజీవి రికమెండ్‌  చేశారు. గెలిచిన రెండుస్థానాల్లోనూ కాంగ్రెస్‌ సహకారం లేకపోతే ఈ పీఆర్పీ అభ్యర్థులు లేరన్న వాస్తవాన్ని చిరంజీవి గ్రహించకపోవటం వల్లే ఈ మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్‌ వెనుకడుగువేస్తోందని సమాచారం. లేకపోతే శాఖలు ఖాళీగా ఉన్నా మొత్తం భారం సిఎం మోయటానికి ఎప్పుడూ ఇష్టపడని కాంగ్రెస్‌ అస్సలు ఈ విషయం మాట్లాడటమే లేదు. ఒక్క మంత్రిని కూడా నియమించేందుకు తోట లాబీయింగ్‌ వల్ల ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

అందని ఆయుర్వేదం?

  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం గొల్లపాలెంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించారు.  ఆ ఆసుపత్రిలో వైద్యుడు మాత్రం అందుబాటులో లేడు. ఈ ఆసుపత్రిని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రారంభించారు. ప్రభుత్వసాయంతో ఆయుష్‌ ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి గ్రామీణుల దీర్ఘకాలికవ్యాధులకు పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రికి వైద్యుడ్ని మాత్రం మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయుర్వేదం విషయంలో ప్రభుత్వాధికార్లు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్లక్ష్యానికి పరాకాష్టగా వైద్యుల నియామకం మాత్రం ప్రభుత్వం వేగవంతం చేయటం లేదని విమర్శలూ ఎక్కువయ్యాయి. దీనికి నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం చూపుతున్నారని సమాచారం.

రైతులకు మొబైల్‌లో వాతావరణ సమాచారం?

  రంగారెడ్డి జిల్లా రైతాంగానికి మొబైల్‌లో వాతావరణ సమచారం అప్‌డేట్‌గా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా పట్టు పరిశ్రమ, హార్టికల్చర్‌, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు వేల మంది రైతులకు తెలుగులో వాయిస్‌మెసేజ్‌లను పంపించనున్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ప్రయత్నాలు సాగుతాయి. దీని కోసం ప్రభుత్వం ఎయిర్ టెల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.  ముందుగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం అయిన చేవెళ్లలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రతీ మండలంలోనూ మూడు వేల మంది రైతులను ఎంపిక చేసి వారికి ఈ మెసేజ్‌లు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈ మెసేజ్‌లు కూడా తెలుగులో ఉండటం వల్ల వెంటనే రైతులు అప్రమత్తం అయ్యే అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన హైబ్రిడ్‌ వంగడాలు గురించి కూడా సమాచారం అందజేస్తామని అంటున్నారు. భూసారం ఆధారంగా వ్యవసాయం చేస్తే వచ్చే ప్రయోజనాలూ విశదీకరిస్తామని వివరించారు. ఇప్పటికే మోడల్‌ఫామ్స్‌ను గుర్తించి వ్యవసాయాభివృద్థికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చేనేతల ఆకలికి నిరసనగా ‘బాబు’ ఉపవాసం

  చేనేత కార్మికుల ఆకలి కేకలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.  ముందస్తుగా తన నిరసన తెలిపేందుకు ఒక పూట ఉపవాసం చేస్తానని ప్రకటించి ఆ ప్రకారం ఉపవసించారు. తన హయాంలో సిరిసిల్లలో చేనేత వస్త్రాల ఎగుమతికి చేసిన ప్రయత్నాలు ఆయన గుర్తు చేసుకున్నారు. 13మంది నేతకార్మికుల బలవన్మరణాలకు బాబు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పోకడ వల్ల కొన్ని జీవితాలు ఆరిపోతున్నాయని వాపోయారు. తన మానవత్వాన్ని చాటుకునేందుకు ఉపవాసం ప్రకటించారు. అలానే చేనేత కార్మికులకు అన్నివేళలా అండగా ఉంటానని చెబుతూ తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రూ.1000కోట్ల ఆర్ధికప్యాకేజీ అమలు చేస్తామన్నారు. వైఎస్‌ హయాంలో ప్రారంభమైన కాంగ్రెస్‌ పతనం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మరింత దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈ తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలన ప్రజలకు కష్టాలనే రుచిచూపిందన్నారు. చివరిగా తన వంట బాధ్యత వహించే సిబ్బందిని పిలిచి రాత్రికి ఏ ఆహారం అవసరం లేదని తెలిపారు. దీంతో బాబు ఉపవాసం చేసి ప్రభుత్వవైఖరిపై నిరసన ప్రకటించారు.

కామ్రెడ్స్‌ ‘కోత’లపై ఉద్యమాలు చేయరా?

  తినటానికి తిండి కరువు. ఉండటానికి గూడు కరువు. కట్టుకోటానికి బట్టల కరవు. ఈ కరువు కాలంలో సబ్సిడీల్లో కోత, ప్రజలకు వాత తప్పటం లేదు.  అంతలా కోత విధించినా ఇంకా చాలదని ప్రభుత్వాలంటున్నాయి. ఒకవైపు గ్యాస్‌ తక్కువగా ఉందని కొత్త సిలెండర్ల మంజూరు ఆపేశారు. అంతటితో ఆగకుండా పేదలకు పంపిణీ చేసే ప్రజాపంపిణీ వ్యవస్థలోని చౌకబియ్యం వంటి వాటిలో కోత విధించింది.  ఈ కోతతో పాటు కిరోసిన్‌ వంటివాటిని బ్లాక్‌లోకి నెట్టేశాయి. చిట్టచివరికి విద్యుత్తు సరఫరాలోనూ రాష్ట్రం అంధకారంలో మగ్గుతోంది. గ్రిడ్‌పై భారం పడుతోందని నాలుగు డిస్కంల సిఎండిలతోనూ సమన్వయకమిటీ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండి హీరాలాల్‌ సమారియా చెప్పారు. అంటే భవిష్యత్తులో మరింత కోత తప్పదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. గ్రిడ్‌ను కాపాడుకునేందుకు కోత పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో గ్రామీణప్రాంతాల్లోనూ నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అసమర్ధతకు ఈ కోతలే అద్దం పడుతున్నాయి. ఈ కోతల నుంచి తప్పిస్తే ప్రభుత్వసమర్ధత ప్రజలు అర్ధం చేసుకోవచ్చు. కానీ, రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కోతలు అనుభవించక తప్పదు. మరి ఇన్ని కోతలు అమలు చేస్తుంటే కామ్రేడ్లు ఏమి చేస్తున్నారు? ప్రతిపక్షం ఈ గ్రిడ్‌ సమస్యపై ఎందుకు స్పందించటం లేదు? ఉద్యమం కూడా పొదుపుగా చేయాలని కామ్రేడ్లు అనుకుంటున్నారా? వంటి పలు ప్రశ్నలు రాష్ట్రంలో ఉద్భవిస్తున్నాయి.

అక్రమనిల్వలతో పప్పుధాన్యాల ధర పెంచుతున్న వ్యాపారులు?

  అక్రమంగా పప్పుధాన్యాలను నిల్వ చేసి వాటి ధర పెరగటానికి వ్యాపారులు కారణమవుతున్నారు. డిమాండు`సప్లయ్‌ సూత్రాన్ని తలకిందులు చేసి తమ వ్యాపారంలో ప్రజాప్రయోజనాల పాళ్లు తగ్గిస్తున్నారు. స్వార్ధంతో లాభాలు పెంచుకునేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు సివిల్‌సప్లయ్‌శాఖ చాలినంత సహకారం అందిస్తోంది. అధికారులు మారినప్పుడు మాత్రం వీరు ఈ నిల్వల గురించి మరిచిపోతుంటారు. అప్పుడే వచ్చిన అధికారులు తమ గుర్తింపుకోసం విజిలెన్స్‌ దుమ్ము వదులుస్తారు. దీంతో వీరు దాడులు చేసి నిల్వలను గుర్తిస్తారు. వ్యాపారులపై ఆ సమయంలో కేసులు కూడా నమోదు చేస్తారు. ఇదంతా ఓ సినీఫక్కీలో జరుగుతున్న సామాన్యపరిశీలకులు సైతం అంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్ల ఉదంతం దీనికి అద్దం పడుతోంది. దాదాపు 2కోట్ల రూపాయల విలువైన పప్పుధాన్యాలను నిల్వ చేసి వ్యాపారులు దాడిలో అడ్డంగా దొరికిపోయారు.

జైలులో జగన్‌ ఎవరెవరికి ఫోను చేశారు?

  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి ఎవరెవరికి ఫోను చేశారు?  అన్న విషయం తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండు చేస్తున్నారు.  ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్‌ జైలు సిబ్బంది సెల్‌ఫోనులను వినియోగించుకుంటున్నారన్న వార్త లీకైంది. దీంతో సిబ్బంది సెల్‌ నుంచి జగన్‌ ఎవరెవరికి ఫోనులు చేశారో తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు. ఆ నేతల తరుపున యనమల రామకృష్ణుడు జైళ్ల శాఖ డిజిపికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జగన్‌ ఇంత వరకూ ఎవరెవరికి ఫోనులు చేశారో వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండు చేశారు. అధికారుల సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల బయట ఉన్నప్పుడు చేసే కార్యకలాపాలు ఏవీ ఆగలేదనటానికి ఈ సెల్‌ వినియోగమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అందువల్ల అధికారులు ఆ వివరాలు వీలైనంత త్వరగా బయటపెట్టాలని డిజిపిని కోరారు.