రామకోటేశ్వరరావు డ్రామాలాడుతున్నాడు.. వివరాలు రేపు చెప్తా.. తలసాని

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారం 2013 నుండి కొనసాగుతోంది.. రామకోటేశ్వరరావు డెవలప్ మెంట్ కోసం 53 ఎకరాలను ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కు ఇచ్చారు.. ఆరుసార్లు మాట్లాడుకున్నాకే ఈ బప్పందం జరిగింది.. దానం నాగేందర్ ఇంట్లో కూడా రెండుసార్లు చర్చించాం.. ముందు అడ్వాన్స్ గా రూ.13 కోట్లు తీసుకున్నారని, గడవు పెరగడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరామని, 'అప్పుడిస్తాము ఇప్పుడిస్తా'మంటూ కాలయాపన చేశారని అన్నారు. నిన్న మళ్లీ పదిరోజుల సమయం కావాలని కోరారని.. నమ్మలేం అంటే మరో భూమి పత్రాలు ఇచ్తారని అన్నారు. ఇప్పుడు అనవసరంగా తన కొడుకుపై కిడ్నాప్, బెదిరింపు ఆరోపణలు చేస్తున్నారని.. ఇది సరికాదని అన్నారు. ఈ వ్యవహారం మొత్తం తాజ్ కృష్ణ లాన్ లోనే జరిగింది.. మా వాళ్లు బెదిరించినట్టయితే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవచ్చు.. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారన్నది అవాస్తవం.. డబ్బులు ఎగ్గొట్టేందుకే రామకోటేశ్వరరావు డ్రామాలాడుతున్నారని అన్నారు. రేపు  మధ్యాహ్నానికి పూర్చి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

చొక్కా లేకుండా అసెంబ్లీలోకి... ఓ ఎమ్మెల్యే నిర్వాకం

  ఆ మధ్య ఆస్ట్రేలియా పార్లమెంటులోకి ఒకాయన పైజమా మీద వచ్చాడని చెప్పుకుని ప్రపంచమంతా నవ్వుకుంది. అలాంటి ఘటన మన దేశంలో జరగలేదని సంతోషిస్తుండగా, మధ్యప్రదేశ్‌ నుంచి ఈ వార్త వచ్చింది. అక్కడి హార్దా నియోజకవర్గానికి చెందిన రామ్‌ కిషోర్ అనే ఎమ్మెల్యేకి తన ప్రాంతానికి నీరు వదలడం లేదని కోపం వచ్చింది. అంతే! ఆ విషయాన్ని ప్రస్ఫుటం చేసేందుకు అసెంబ్లీకి చొక్కా లేకుండా వచ్చారు. సాక్షాత్తూ ఎమ్మెల్యేనే ఇలా అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో మిగతా సభ్యులంతా నివ్వెరపోయారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్న చోట ఈ ప్రవర్తన ఏమిటంటూ మండిపడ్డారు.   ఎమ్మెల్యే ప్రవర్తన మీద తీవ్ర వాగ్వాదం జరగడంతో, అసెంబ్లీ కాస్తా వాయిదాపడింది. కాగా రామ్‌ కిషోర్‌ మాత్రం తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు. మహాత్మాగాంధి సైతం ఇలాగే తిరిగేవారు కదా! అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. రామ్‌ కిషోర్ ప్రవర్తనతో కంగుతిన్న స్పీకరు, ఆయనను తన ఛాంబర్‌లోకి పిలిపించుకుని మాట్లాడారు. సంబంధిత శాఖతో మాట్లాడి రామ్‌ కిషోర్‌ ప్రాంతానికి నీటి వసతిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరే దాకా తాను ఇలాగే చొక్కా లేకుండా తిరుగుతానని రామ్‌ కిషోర్‌ పేర్కొనడం కొసమెరుపు.

తలసాని కొడుకు నన్ను బెదిరించాడు.. ఎంపీ భర్త

  ఎట్టకేలకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు భర్త కిడ్నాప్ డ్రామా ముగిసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పిన ఆయన.. బెదిరింపులు మాత్రం ఎదురయ్యాయని మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ భూమి వ్యవహారంలో మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్, మరో వ్యక్తి రామకృష్ణతో చర్చించడానికి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లామని.. అక్కడ సాయి యాదవ్ తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని.. తన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను బలవంతంగా లాక్కున్నాడని ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తనను నిర్భందించారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్‌లోని జర్నలిస్టు కాలనీ సమీపంలో తనను కారులో ఎక్కించుకున్న రామకృష్ణ ఆ తర్వాత అర్ధరాత్రి కొండాపూర్ ప్రాంతంలో వదిలేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయి యాదవ్ పై ఐపీసీ సెక్షన్లు 384, 342 కింద కేసులు నమోదు చేశారు.

అరకు ఎంపీ భర్త కిడ్నాప్.. భూవివాదమా..?

  అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్త కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కొత్తపల్లి గీత తన భర్త పరుచూరి రామకోటేశ్వరరావును కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల ప్రకారం.. గీత కుటుంబానికి 75 కోట్లు విలువ చేసే ఐదు ఎకరాల భూమి ఉంది. అయితే రామకోటేశ్వరరావు ఈ భూమిని రామకృష్ణ, సుధాకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులకు డెవలప్ మెంట్‌కు ఇచ్చారు. కానీ వీరు ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో వారు తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ భూమి విషయమై మాట్లాడదామని డెవలపర్లు రామకోటేశ్వరరావును కారెక్కించుకుని తాజ్ కృష్ణ హోటల్‌కు తీసుకెళ్లారు.గీత ఎంత ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో డ్రైవర్ ను అడిగితే అసలు విషయం బయటపడింది.  దీంతో వెంటనే గీత మీడియాను ఆశ్రయించి తమ భర్తను కిడ్నాప్ చేశారంటూ ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కిడ్నాపర్లు ఆయన్ని కొండాపూర్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఇక అర్ధరాత్రి రామకోటేశ్వరరావు నుంచి  గీతకు ఫోన్ రాగా.. కిడ్నాపర్లు తనను కొండాపూర్ పరిధిలో వదిలేశారని ఆయన ఎంపీకి చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మళ్లీ భారత్ మాతాకీ జై రగడ.. విద్యార్ధులపై దాడి

  భారత్ మాతాకీ జై నినాదం గురించి రభస కొంచెం తగ్గింది అనే లోపులో మరో సంఘటన చోటుచేసుకుంది. భారత్‌ మాతా కీ జై అని నినదించనందుకు ఢిల్లీలో ముగ్గురు మదర్సా విద్యార్థులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మదర్సాలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పార్కుకు వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు తమకు వద్దకు వచ్చి జై మాతా, భారత్‌ మాతా కీ జై అని చెప్పాలని అన్నారని.. లేదంటే తమను చంపేస్తామని తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమపై దాడి చేసిన వారు తమకు పరిచయుస్థులే అని.. వారంతా కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరువేల కోట్లతో కొడుకు పెళ్లి.. ఎక్కడ..?

ఒకప్పుడు పెళ్లిళ్లంటే ఏదో తూతూ మంత్రంగా జరిగేవి కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లిళ్లకి కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటి కుబేరుడే ఇప్పుడు తన కుమారుడి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,800 కోట్లు ఖర్చుపెట్టాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. ఇంతకీ ఎవరా తండ్రి.. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. కజకిస్థాన్ లో మిఖాయిల్ గుత్సరీవ్ అనే వ్యక్తి రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగారు. ఈయన తన కొడుకు సయీద్ గుత్సరీవ్ (28) విహహానికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఈ వివాహం నిర్వహించి.. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ వేదికను పూలవనంలా తీర్చిదిద్దారు. కాగా, మిఖాయిల్ గుత్సరీవ్ కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తెలుస్తోంది.

విమానంలో త్రిశూలం... మరో వివాదంలో రాధేమా

  తనని తాను దేవతగా సన్యాసిని రాధేమా మరో వివాదంలోకి జారుకున్నారు. ఇప్పటికే రాధేమా మీద వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు వంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అసభ్య రీతిలో రాధేమా చేసిన నృత్యాలు, చాలీ చాలని దుస్తులలో ఆమె దిగిన ఫొటోలు... ఆమె చెబుతున్న ప్రవచనాలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు రాధేమో మీద మరో కేసు నమోదైంది. గత ఏడాది ఆమె ఔరంగాబాదు నుంచి ముంబై వెళ్లే విమానంలో ప్రయాణించే సమయంలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నారన్నది తాజా ఆరోపణ. విమాన ప్రయాణానికి సంబంధించిన నిబందనల ప్రకారం ఇలా ఏదన్నా ఆయుధాన్ని చేపట్టి, ప్రయాణం చేయడం నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు రాధేమా మీద, ఆ పనిని చూసీ చూడనట్లు ఊరుకున్న మరో నలుగురు ఉద్యోగుల మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

తిట్టినా ట్రంప్ ను ఇష్టపడుతున్న చైనీయులు.. ఎందుకు..?

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. అదృష్టం ఏంటంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబరపడిపోతున్నారంట చైనీయులు. అంతలా ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశాడనుకుంటున్నారా.. సాధారణంగా ట్రంప్ ఎప్పుడూ చైనీయులను తూలనాడుతూ మాట్లాడేవాడు. అమెరికాలో స్థిరపడిన చైనీయుల వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందని, అమెరికన్ యువకులకు అందాల్సిన చాలా అవకాశాలను చైనీయులు తన్నుకుపోతున్నారని, తాను అధికారంలోకి వస్తే వారందర్నీ స్వదేశాలకు పంపేస్తానంటూ వ్యాఖ్యానించేవారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో చైనీయులు చాలా తెలివైనవారని ట్రంప్ చెప్పకనే చెబుతున్నారని.. ఆయన అన్న మాటలకు అర్ధం అదే అని సంబరపడిపోతున్నారట. ఈ విషయాన్ని హువాంగ్ క్వియు.కామ్ సంస్థ తెలిపింది. ఈ సంస్ద ఓ సర్వే నిర్వహించగా అందులో 54 శాతం మంది చైనీయులు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టం అని చెప్పడం విశేషం. మొత్తానికి ట్రంప్ కు అదృష్టం బాగానే ఉన్నట్టు ఉంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చైనా పాజిటివ్ గా తీసుకోవడం గ్రేట్..

చంద్రబాబు నన్ను కొట్టారు.. కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా..?

  తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..  నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై నాడు నేను చంద్రబాబుతో చర్చించానని.. ఈ పద్దతి వద్దని నేను ప్రతిపాదించగా ఆయన తనపై మండిపడ్డారని.. అక్కడితో ఆగకుండా తన మీద చేయి కూడా చేసుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను నాడు బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పోచారం వ్యాఖ్యలపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా ఆయన చెబుతారని ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా పోచారం వ్యాఖ్యలపై స్పందించి.. చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు.

ఆత్మహత్య చేసుకుంటే చేసుకో.... రైతుకి ఓ కేంద్ర మంత్రి సూచన

  ఉత్తరాదిన సంజీవ్‌ బాల్యన్‌ అనే పార్లమెంటు సభ్యుని గురించి తెలియనివారుండరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన సంజీవ్‌ మీద మతహింసను రెచ్చగొట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా మోదీ ప్రభుత్వంలో సంజీవ్‌, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా స్థానాన్ని సాధించారు. ప్రస్తుతం ఓ వివాదాస్పద వ్యాఖ్యను చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సంజీవ్‌ దగ్గరకు ఓ రైతు వచ్చి తన గోడుని వినిపిస్తుండగా ఈ ఘటన జరిగింది.   గిరిరాజ్ అనే సదరు రైతు తన గ్రామంలో గత 15 రోజుల నుంచి కరెంటు లేదనీ, దాని వల్ల తన పండ్ల మొక్కలకు నీరు పెట్టలేకపోతున్నానని వాపోయాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్య తప్ప తనకు వేరే దిక్కు లేదని మొరపెట్టుకున్నాడు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కదా, ఆయన తల్చుకుంటే తనకు న్యాయం లభిస్తుందని సదరు రైతు భావించి ఉండవచ్చు. కానీ సంజీవ్‌ తీరే వేరుగా ఉండింది. ‘వెళ్లి ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకేం మాట్లాడకు’ అంటూ రైతుని కసిరికొట్టారు సంజీవ్‌. సంజీవ్ మాటలతో అక్కడున్నవారంతా విభ్రాంతికి గురయ్యారు. ఆపదలో ఉన్న రైతుని ఓదార్చాల్సింది పోయి, ఇవేం మాటలంటూ ముక్కున వేలేసుకున్నారు. బహుశా ఈ దేశంలో రైతు ప్రాణానికి ఉన్న విలువ ఇంతేనేమో!

జాట్‌ రిజర్వేషన్ బిల్లుతో తృప్తి చెందని నేతలు

  హర్యానాలో జాట్ వర్గానికి రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించి ఉండవచ్చుగాక. కానీ తాము ఈ బిల్లుతో తృప్తిగా లేమని ఆ వర్గ నేతలు తెగేసి చెబుతున్నారు. బిల్లు ప్రకారం జాట్‌ వర్గానికి క్లాస్ 1, 2 ఉద్యోగాలలో 6 శాతం, క్లాస్ 3,4 ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ శాతం తమకు ఏమాత్రం సరిపోవని మండిపడుతున్నారు జాట్‌ నాయకులు. చిన్న ఉద్యోగాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా తమను గుమాస్తాలుగా ఉంచాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. కాబట్టి క్లాస్ 1,2 ఉద్యోగాలలో కనీసం 12 శాతం రిజర్వేషన్ కావాలని పట్టుబడుతున్నారు.   ఇంతేకాదు! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తమ అభ్యంతరాలన్నింటి గురించి చర్చించేందుకు వచ్చే నెల మూడో తేదీన జాట్‌ నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు జాట్‌ వర్గం సాగించిన హింసాత్మక ఆందోళనకు ప్రభుత్వం తల ఒగ్గిందని కాంగ్రెస్ నేతలే కాదు, కొందరు బీజేపీ సభ్యులు కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో హర్యానా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

కేంద్రానికి ఉత్తరాఖండ్‌ హైకోర్టు అక్షింతలు

ఉత్తరాఖండ్‌లో ఆదరాబాదరాగా కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతిపాలన మీద ఆ రాష్ట్ర హైకోర్టు మండిపడింది. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునే ప్రయత్నంలో ఉండగానే, హడావుడిగా రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించింది. 71 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 36 మంది సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే! అయితే వీరిలో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడటంతో సంఖ్యలు తారుమారయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి సోమవారం నాడు తన బలాన్ని నిరూపించుకోవల్సిందిగా గవర్నరు ఆదేశించారు. గవర్నరు ఆదేశం అమలుకాక ముందరే, కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం మీద కోర్టు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్థిరంగా ఉందో, మైనారటీలో పడిపోయిందో ఎలాగూ బలనిరూపణలో తేలిపోయేది కాబట్టి, కేంద్రం తొందరపడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం కాకుండా చూడటమే తన బాధ్యత అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటికే హైకోర్టు అక్కడి ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని పిలిపించవలసిందిగా కోరిన విషయం తెలిసిందే! 

నా కొడుకుని ఏమీ అనవద్దు... విజయ్ మాల్యా

తను చేసిన తప్పులకు తన బిడ్డను నిందించవద్దంటూ విజయ్‌మాల్యా ట్విట్టర్‌లో కోరాడు. 28 ఏళ్ల సిద్ధార్థ మాల్యా కూడా తన తండ్రిలాగానే మంచి జల్సారాయుడని పేరు. అరకొర దుస్తులు ఉన్న మోడల్స్‌తో సిద్ధార్థ మాల్యా దిగిన ఫొటోలు బాగానే ప్రచారం పొందేవి. ఇక దీపికా పదుకొనేతో సిద్ధార్థ సాగించిన స్నేహం కూడా చాలారోజులు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం లండన్‌లోని డ్రామా స్కూల్‌లో చదువుతున్న సిద్ధార్థ, గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో తన తండ్రిని వెనకేసుకు వస్తూ కనిపించేవాడు. అందుకు జనం సిద్ధార్థను కూడా తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పడు విజయ్ మాల్యా తన బిడ్డను రక్షించేందుకు పూనుకున్నారు. ‘మీరు నన్ను ఎంతగా ద్వేషించినా ఫర్వాలేదనీ, కానీ అభంశుభం తెలియన తన బిడ్డ జోలికి మాత్రం వెళ్లవద్దని’ ట్విట్టర్‌ సాక్షిగా కోరాడు. దీనికి సిద్ధార్థ బదులిస్తూ, తనకు వస్తున్న పది ట్విట్టర్‌ సందేశాలలో ఒకటి మాత్రమే సానుకూలంగా ఉంటోందనీ, మిగతా తొమ్మిదీ తనను తిడుతున్నవే అని వాపోయాడు. ఈ తండ్రీకొడుకుల సెంటిమెంటకు జనం పెద్దగా ప్రభావితం అయినట్లు కనిపించడం లేదు. తండ్రి నుంచి వారసత్వంగా దొంగ సొమ్ముని కనుక తీసుకోకపోతే, తాము సిద్ధార్థని క్షమించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ప్రకటించారు కూడా! మరికొందరేమో ముందు బిడ్డను వెనకేసుకు రావడం మానేసి, అప్పులు చెల్లించమని మాల్యాను నేరుగా విమర్శించారు.  

హైజాకర్‌తో సెల్ఫీ...

ట్విట్టర్‌లో అభినందనల వెల్లువసునామీ వస్తున్నా సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడే వెర్రి మాలోకం ఇది. రైళ్లు, జలపాతాలు, పాములు, శవాలు... ఇలా సెల్ఫీ తీసుకునేందుకు సందర్భాలు అన్నీ అయిపోయినట్లున్నాయి. ఇప్పుడు హైజాకర్‌తో సెల్ఫీ తీసుకుని సంచలనం సృష్టించాడు ఓ యువకుడు. నిన్న ఈజిప్టులోని ఓ విమానాన్ని మతిచెడిన మనిషొకరు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే! అతను ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడా, అతని కోరికలు ఏమిటి అని సదరు విమానంలోని ప్రయాణికులంతా భయంతో వణికిపోతుంటే... ఇన్నిస్ అనే బ్రిటన్‌ జాతీయుడు మాత్రం అతనితో ఓ సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు. పైగా దాన్ని అప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్టు చేసి, తనతో సెల్ఫీలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే న్యూస్‌ ఛానల్‌ చూసుకోమన్నాడు. ఇంకా చిత్రమేమిటంటే ట్విట్టర్లో ఈ చిత్రానికి విపరీతమైన అభినందనలు రావడం! ఒంటి నిండా బాంబులు ఉన్నాయని హైజాకరు చెబుతున్నా, ‘ధైర్యంగా’ అతనితో సెల్ఫీ దిగినందుకు ఇన్నిస్‌ను ట్విట్టర్‌లోకం విపరీతంగా అభినందించింది. సెల్ఫీల చరిత్రలో మరో అరుదైన ఘట్టం చేరింది.

ఆ సింహం అడవిలో ఉండదు.. 

సాధారణంగా సింహం అంటే అడవిలో ఉంటూ.. జంతువులని వేటాడి తింటూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే.. ఇక్కడ ఒక సింహం మాత్రం అడవిలో ఉండదు.. అందునా దుప్పటి ఉంటేకానీ నిద్రపోదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు.. వివరాల ప్రకారం.. అమెరికాలోని ఒక కుటుంబం అడవిలో ఉండే ఒక సింహపు పిల్లని తెచ్చుకొని పెంచుకునేది. దానికి ల్యాంబర్ట్ అని పేరు కూడా పెట్టారు. అయితే సింహపు పెద్దయితే భవిష్యత్ లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గమనించి.. దానికి ఆహారం పెట్టకుండా మాడ్చి ఆఖరికి బయటకు వదిలిపెట్టారు. అది కాస్త వెటర్నరీ టెక్నీషియన్, ఇన్ సింక్ ఎగ్జోటిక్స్ అనే వన్యప్రాణుల సంరక్షణ, ఎడ్యుకేషనల్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విక్కీ కీహే కంట పడింది. తను దానిని తీసుకువచ్చి వన్యప్రాణుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అయితే ఆయనకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే.. ల్యాంబర్ట్ కు చిన్నప్పటి నుండి పరుపు మీద పడుకోవడం అలవాటని.. అదీ కాక దుప్పటి కప్పుకునే అలవాటు కూడా ఉందని. దీంతో ఆయన దాని కోసం ఒక దుప్పటి తెచ్చి ఇచ్చి ఇచ్చారు. ఆ దుప్పటిని చూసిన ఆనందంతో ల్యాంబర్ట్ దాన్ని చుట్టుసుకుని పడుకునేదని.. పెంపుడు సింహం కాబట్టి అడువుల్లో ఉండలేదని విక్కీ తెలిపారు. 

ప్రియుడిని చంపిన ప్రియురాలు.. గుండె బయటకి తీసి మరీ..

నిజాలు వినడానికి బానే ఉంటాయి. కానీ ఒక్కోసారి.. కొన్ని నిజాలు వింటే మాత్రం భయపడాల్సి వస్తుంది. అలాంటిదే బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ యువతి కోర్టుకు చెప్పిన నిజం విని జడ్జి, న్యాయమూర్తులుతో సహా అక్కడున్న వారందరూ ఖంగుతిన్నారు. అసలు సంగతేంటంటే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫతేమా అఖ్తర్ సొనాలీ (21) అనే యువతి షిపాన్ (28) అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే షిపాన్ మాత్రం ఆమెతో పాటు ఇంకో యువతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా గడిపిన క్షణాలను వీడియోలుగా తీసి తన ల్యాప్ ట్యాప్‌లో భద్రపరిచాడు. ఇక ఆ వీడియోలు చూసిన సొనాలీ అతనిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే వారు కలిసినప్పుడు అతని కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే అతి దారుణంగా పొడిచి చంపింది. అక్కడితో ఆగకుండా తన శరీరం నుండి గుండెను వేరు చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక కోర్టుకు హాజరుపరిచిన ఆమెను ఎందుకు చంపావని అడుగగా..తనతో పాటు.. అనేక మందిని ప్రేమించిన అతని గుండె ఎంత విశాలమైనదో చూసేందుకు ప్రియుడిని హత్య చేసి.. శరీరం నుంచి గుండెను వేరు చేసి చూశానని చెప్పింది. దీంతో ఆమెను దోషిగా పరిగణించిన న్యాయస్థానం, మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

బ్యాంకులకు మాల్యా బంపరాఫర్..

  బ్యాంకు బకాయిలు తీర్చేందుకు కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాల్యా.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాల్యా తరపు న్యాయవాది.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తన క్లెయింట్ తీరుస్తారని.. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారన్నారు. కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.   

సహారా గ్రూపు సంస్ఠల ఆస్తులు అమ్మేయండి.. సుప్రీం

వేలాది మంది పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇచ్చేందుకు గాను సహారా గ్రూపు సంస్ఠల ఆస్తుల అమ్మకానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్యురిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ను సహారా రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు సహారా ఆస్తులను మార్కెట్‌ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని.. ఒకవేళ దానికంటే తక్కువకు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. కాగా సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌ 2014 మార్చిలో అరెస్టయిన సంగతి తెలిసిందే.