వరల్డ్ టి 20 : భారత్ ను ఓడించి ఫైనల్ కు చేరిన వెస్టిండీస్

  సెమీస్ కు చేరాలంటే పోరాడాల్సిన గేమ్ లో భారత్ చేతులెత్తేసింది. ఇన్నాళ్లూ కష్టపెట్టిన బ్యాటింగ్ ఈ మ్యాచ్ తో గాడిలో పడితే, ఇప్పటి వరకూ కాపాడుతూ వచ్చిన బౌలింగ్ తేలిపోయింది. వెస్టిండీస్ బాదుడుకు భారత బౌలర్లు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. వరల్డ్ క్లాస్ బౌలర్ గా పేరున్న అశ్విన్ కేవలం రెండే ఓవర్లు వేసి 20 పరుగులు సమర్పించుకున్నాడు. నెహ్రా తప్పితే మిగిలిన రెగులర్ బౌలర్లందరూ 10 పైనే రన్ రేట్ తో పరుగులు ఇచ్చేశారు. విరాట్ కోహ్లీ ఒకటిన్నర ఓవర్ వేసి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ కోసం తన సర్వ శక్తులూ ఒడ్డిన కోహ్లీ, ఒక్కడి ఎఫర్ట్ గెలిపించడానికి సరిపోలేదు. అదృష్టం కూడా వెస్టీండీస్ వెంటే ఉంది. అశ్విన్ బౌలింగ్ లో సిమ్మన్స్ బుమ్రా పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుటైనా అది నోబాల్ అని తేలింది. 15వ ఓవర్లో ఇదే సిమ్మన్స్, పాండ్యా బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చాడు. అది కూడా నోబాలే. బుమ్రా బౌలింగ్ లో జడేజా బౌండరీలో క్యాచ్ పట్టి, బ్యాలెన్స్ తప్పి రోప్ ను తొక్కేశాడు. అది కూడా సిమ్మన్స్ అదృష్టమే. ఇన్ని లైఫ్ ల తర్వాత 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ వచ్చిన వాళ్లు వచ్చినట్టు అడ్డంగా బ్యాట్ ఊపేస్తుండటంతో, ఫీల్డింగ్ కరెక్ట్ గా పెట్టే అవకాశం ధోనికి లేకపోయింది. ప్రమాదకర గేల్, సామ్యూల్స్ లను ముందే అవుట్ చేసినా, వెస్టిండీస్ పవర్ హిట్టర్ల ముందు ఇండియా బౌలింగ్ నిలవలేకపోయింది. ఇంకో రెండు బంతులు మిగిలుండగానే రస్సెల్ కొట్టిన సిక్స్ తో వెస్టిండీస్ ను ఫైనల్ కు చేరింది.   స్కోర్లు:  ఇండియా - 192/2 ( రోహిత్ - 43, రహానే - 40, కోహ్లీ - 89, ధోనీ - 15) (రస్సెల్ 1 - 47, బద్రీ  1 - 26) వెస్టిండీస్ - 196/3 (ఛార్ల్స్- 52, గేల్ - 5, శామ్యూల్స్ - 8, సిమ్మన్స్ - 82, ఆండ్రీ రస్సెల్ - 43 ) (నెహ్రా 1 - 24, బుమ్రా 1 - 42, కోహ్లీ 1 - 15 )

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్.. డబ్బు కోసం చేరారు

  వైసీపీ నుండి ఇప్పటికీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ, పరువుల సుబ్బారావు కూడా టీడీపీ లోకి జంప్ అవుతున్నట్టు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి కాబట్టి వారితో కలిపి పదిమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లినట్టు. అయితే తమ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై జగన్ మండిపడ్డారు.   ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు.. మరో పార్టీలో ఎలా వెళతారని, ప్రజాస్వామ్యంలో ఇదేం విధానమన్నారు. కేవలం డబ్బు, ఇతర ప్రలోభాల కోసం వారు పార్టీ మారారని ఆయన ఆరోపించారు. డబ్బులిచ్చి పార్టీ మార్పించుకున్నప్పుడు అంతే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేనప్పుడు పార్టీలో ఎలా చేర్చుకున్నాని ఆయన ప్రశ్నించారు.

దెయ్యం సెల్ఫీ!

  హైజాకరుతో సెల్ఫీ, శవాల ముందు సెల్ఫీ, రైలు ముందు పరిగెడుతూ సెల్ఫీ... ఇలా సెల్ఫీ దిగేందుకు జనం రకరకాల సందర్భాలు వెతుక్కుంటున్న విషయం తెలిసిందే! ఈ సంబరంలో ఒకసారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షికారు చేస్తున్న ఓ సెల్ఫీ మరీ విచిత్రంగా ఉంది. ఇందులో సెల్ఫీ దిగుతున్న ఓ జంట ఫొటో ఉంది. సవాలక్ష సెల్ఫీలలాగానే ఇది కూడా ఓ సాదాసీదా దృశ్యం అనుకున్నవారి వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా, ఆ సెల్ఫీలోని స్త్రీ ప్రతిబింబం తేడాగా కనిపించింది.   ఇటు కెమెరా వంకా, అటు వెనక్కి తిరిగి కూడా ఆ యువతి చూస్తున్నట్లు సెల్ఫీలో ఉంది. ఇది స్పష్టంగా ఫొటోషాప్‌తో రూపొందించిన చిత్రం అని తెలుస్తున్నా... దెయ్యంతో సెల్ఫీ అంటూ సోషల్ మీడియా జనం తెగ హడావుడి చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంత సరదాకైతే మాత్రం తోటి మనిషిని ఇలా చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఆ సెల్ఫీలో ఉన్నదెవరో ఎవరికీ తెలియదు కాబట్టి, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం లేదు!

తలాక్‌ విధానాన్ని నిషేధించవచ్చు..

  తలాక్ అనే పదాన్ని మూడుసార్లు చెబితే చాలు తమ భార్యలకు విడాకులు ఇచ్చినట్టే. ఇది ముస్లిం ఆచార వ్యవహారాలలో అనతి కాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే ఉత్తరాఖండ్‌కు చెందిన సైరాబాను అనే ముస్లిం మహిళ ఆ విధానంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం చర్చాంశనీయమైంది. అయితే ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. ముస్లిం మత విధానాలు అన్నితెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కమిటీని ఏర్పాటుచేయమని.. దానికి సంబంధించిన నినేదికను అందించమని ఆదేశించింది.  దీంతో 'ఇటువంటి విడాకుల పద్ధతి ద్వారా మహిళలు తమ వివాహ జీవితంపట్ల అభద్రతాభావానికి గురవుతున్నార'ని పేర్కొంటూ తలాక్‌ విధానాన్ని నిషేధించాలనే డిమాండ్‌ సరైనదేనని కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు  మూడుసార్లు తలాక్‌ అనే విధానాన్ని, బహుభార్యత్వాన్ని నిషేధించాలని కమిటీ సూచించింది. 1939నాటి ముస్లిం మ్యారేజెస్‌ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని కమిటీ సూచించింది. మరి కమిటీ చెప్పిన సూచనలు కేంద్రం తీసుకుంటుందా.. లేక మతపరమైన వివాదాలు ఎందుకులే అని సైలెంట్ గా ఉంటుందా.. చూడాలి.

తల్లిని కాపాడేందుకు తండ్రిని చంపేశాడు

  దిల్లీకి చెందిన సురేంద్ర కుమార్‌కు తాగుడు అలవాటు ఉంది. ఆ మత్తులోనే ఈ సోమవారం తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న సురేంద్ర కుమార్‌కు, అతని భార్యకి ఏదో విషయంలో మాటామాటా పెరిగింది. అంతే! తాగిన మైకంలో అతను తన భార్యని విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి జరుగుతున్న గొడవే ఇది. కానీ ఈసారి తన తండ్రి చేస్తున్న పనిని సురేంద్ర 17 ఏళ్ల కొడుకు సహించలేకపోయాడు. రాళ్లతో కొడుతూ, తన తండ్రి మీద అతను తిరగబడ్డాడు. ఆ దెబ్బలకి తాళలేక సురేంద్ర చనిపోయాడు.   తండ్రి శవాన్ని తీసుకువెళ్లి దగ్గరలోని ఒక ఖాళీ స్థలంలో పారేసి వచ్చాడు నిందితుడు. కానీ నేరం ఎన్నాళ్లని దాగుతుంది. స్థానికుల ఫిర్యాదుతో సురేంద్ర శవాన్ని కనుగొన్న పోలీసులు, నిందితుని అరెస్టు చేసి విచారణకు తరలించారు. తన తండ్రి చేసే అకృత్యాల నుంచి తల్లిని కాపాడుకునేందుకే, ఈ దారుణానికి ఒడిగట్టానని వాపోతున్నాడు నిందితుడు. ఈ కేసులో అసలు నేరం మద్యానిదేనేమో!

అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లు..

  తమిళనాట అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల బరిలో దిగడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ పార్టీల్లోకి సినీ పరిశ్రమకు చెందిన వారిని తీసుకునేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రాన్స్ జెండర్లకి కూడా అవకాశం ఇస్తున్నాయి తమిళపార్టీలు. ఇప్పటికే దేవి అనే ట్రాన్స్ జెండర్ కి చెన్నైలోని ఆర్‌కె నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందకు టికెట్ లభించింది. దేవి ప్రస్తుతం  ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఏఐఏడీఎంకె పార్టీ కూడా పి.సుధ అనే ట్రాన్స్‌జెండర్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చినట్లు సమాచారం. సుధ ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం పలు సామాజిక సంఘాల ద్వారా కృషి చేస్తున్నారు. మరి అందరిలాగే వీరికి కూడా ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.

తండ్రి బాటలోనే.. పరిటాల రవి తనయుడు

  తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నాడు దివంగత నేత పరిటాల రవీంద్ర.. సునీతల తనయుడు శ్రీరామ్. పరిటాల రవి తను పార్టీలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సహాయక కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు శ్రీరామ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తన తండ్రి లాగే తాను కూడా సామూహిక వివాహ మహోత్సవాన్ని నిర్వహించదలిచారు. తన సొంత ఊరు దగ్గర ఉన్న తిరుమల దేవర వెంకటేశ్వరస్వామి దేవాలయంలో..  పరిటాల ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలను జరిపించడానికి శ్రీరామ్ సిద్ధమయ్యారు. తమ పిల్లలకు పెళ్లి చేయలేని తల్లిదండ్రులు ఇప్పటికే చాలామంది  తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. ఇక ఏప్రిల్ 21న జరిగే ఈ కార్యక్రమానికి పరిటాల సునీత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినిసైతం ఆహ్వానించారు.   ఇదిలా ఉండగా పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాల ద్వారా చంద్రబాబుకు దగ్గర అవ్వాలని చూస్తున్నారంట. ఇక సునీత కూడా అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.

ప్రశ్నాపత్రం లీక్‌తో పరీక్ష వాయిదా... మళ్లీ లీక్‌... మళ్లీ వాయిదా!

  బెంగళూరు: అహోరాత్రాలూ కష్టపడి పరీక్షకి సిద్ధపడ్డాక, ప్రశ్నా పత్రం లీక్‌ అయ్యిందని చెప్పి వాయిదా వేస్తే బాధ కలగడం సహజమే! కానీ రెండోసారి పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాక కూడా అదే పరిస్థితి ఎదురైతే విద్యార్థిలోకం ఒళ్లుమండిపోదా! కర్ణాటకలో అదే జరిగింది. అక్కడ ప్రీ యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్ర పరీక్ష ఈ నెల 21న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తీరా ఆ పరీక్షకు చెందిన ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఎవరో విద్యార్థి ఉప్పందించడంతో, పరీక్షను నేటికి వాయిదా వేశారు. పైగా ప్రశ్నాపత్రం లీకేజికి సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించారు.   అయితే రెండోసారి కూడా సిద్ధం చేసిన ప్రశ్నాపత్రం కూడా లీక్‌ అయ్యిందని సీఐడీ అధికారులు తేల్చడంతో, ఇవాళ జరగాల్సిన పరీక్షను కూడా రద్దు చేశారు అధికారులు. ఇప్పడు మరోసారి పరీక్షను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకే పరీక్షను మూడుసార్లు చదవాల్సి రావడంతో, విలువైన సమయమంతా వృథా అయిపోయిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల మిగతా పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోయామని వాపోతున్నారు. విద్యార్థుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో, కర్ణాటక విద్యాశాఖ భవనం ముందర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ సరికొత్త రికార్డ్.. తొలిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నాయకుడు

  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..మరో రికార్డును కేసీఆర్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర జల విధానంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ఇస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ నాయకడు ఇంత వరకూ ఇలా అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అటు పార్లమెంటులోనే కాక ఇటు దేశంలోని ఏ ఒక్క నేత కూడా చట్టసభలో ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలా లేదు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట సరికొత్త రీతిలో ప్రసంగించిన ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. జలవిధానం, ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పన గురించి వివరించారు. ప్రపంచంలోనే తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని.. 75 వేలకు పైగా చెరువులు కాకతీయులు నిర్మించారని, కులీకుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించారని, కాకతీయులు, రెడ్డిరాజుల స్ఫూర్తిని కులీకుతుబ్ షా కొనసాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుని ముందుకుపోని ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతుల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఇరుక్కపోయాయన్నారు. గోదావరిలో రాష్ట్రానికి రావాల్సింది 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లు అవే..

  తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వసమైంది.. మీడియం నీటి ప్రాజెక్టులు వట్టిపోయాయి అని అన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమం నిధులు.. నియామకాలు.. నీళ్లతోనే పురుడుపోసుకుందని.. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్లు అవే అని.. ఇప్పుడు నిధులు సమకూరాయి.. నియామకాలు కూడా చేపట్టాం.. ఇక నీళ్లకోసం ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు.. టీఆర్ఎస్ ఏర్పడ్డాకే జూరాల ఆర్డీఎస్ పై పోరాటం జరిగింది.. ఉద్యమ ప్రభావమే దేవాదుల ప్రాజెక్టు అని అన్నారు.

జెఎన్ యూకి తగ్గిన ధరఖాస్తుల సంఖ్య.. కారణం అదేనా..?

  ఢిల్లీలోని జెఎన్ యూలో గత కొద్దికాలంగా పలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జెఎన్ యూలో నిరసన సభ నిర్వహించడంతో పలు ఆందోళలు..గొడవలు కూడా జరిగాయి. దీంతో జెఎన్ యూ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోయింది. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ వివాదాల వల్ల యూనివర్సిటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. జెఎన్ యూ వివాదాలకు కేంద్రంగా మారడంవల్ల ఈ ఏడాది యూనివర్సిటీలో చేరేందుకు రాసే ఎంట్రన్స్ పరీక్షకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గతేడాదితో పోలిస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లకు పెట్టుకున్న దరఖాస్తులు 5,479 తగ్గాయి. అలాగే బయోటెక్నాలజీ కోర్సులు చేసేందుకు వచ్చిన అప్లికేషన్లు కూడా గతేడాదితో పోలిస్తే ఓ రెండు వేలు తగ్గాయి. అదే మొత్తమ్మీద చూస్తే అంటే కోర్సుల విడివిడిగా కాకుండా చూస్తే మాత్రం మొత్తం అప్లికేషన్లు గతేడాది కన్నా దాదాపు 700 దాకా తగ్గాయి. అయితే పెద్ద తేడా లేకపోయినప్పటికీ ఈ వివాదాల వల్ల ఐదేళ్లలో మొదటిసారి ధరఖాస్తుల సంఖ్య తగ్గిపోయింది. మరి భవిష్యత్ లో కూడా ఇలానే గొడవలు, ఆందోళనలు జరుగుతుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి యూనివర్శిటీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్రపతి పదవికి అమితాబ్..? మోడీ ప్రతిపాదన..!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ కు రాష్ట్రపతి పదవి దక్కనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పదవికి ప్రధాని మోడీ అమితాబ్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని  ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్‌ తెలిపారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేసినట్టు సమాచారం. ఇంకా ఆయన చెబుతూ... మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమితాబ్ పరిచయం చేశానని.. అనంతరం ఓ సినిమా కోసం ఇద్దరూ సమావేశమయ్యారని.. అప్పుడు గుజరాత్‌ అంబాసిడర్‌గా పని చేయాల్సిందిగా అమితాబ్‌ను మోడీ కోరారని అమర్‌సింగ్‌ చెప్పారు. గతంలో కూడా ఈ విషయంపై చర్చలు జరిగాయి. మరి రాష్ట్రపతి పదవి అమితాబ్ ను వరిస్తుందో లేదో చూడాలి.

కుక్క పేరు తేడాగా ఉంది... వణికిపోయిన అమెరికా బ్యాంకులు

  అమెరికా ఎంత పెద్ద దేశం అయితేనేం. ఉగ్రవాదం అంటే చాలు ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఒకోసారి, ఆ భయంతో మరీ అతిగా ప్రవర్తిస్తూ ఉంటుందని కూడా ఓ ఆరోపణ ఉంది. అలాంటి సంఘటనే మరోసారి వెలుగుచూసింది. అక్కడి శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే బ్రూస్‌ ఫ్రాన్సిస్ అనే వికలాంగుడు తనకి సాయంగా ఉండేందుకు ఓ కుక్కని పెంచుకుంటున్నాడు. ఈ కుక్కకి కొన్ని సదుపాయాలు కల్పించేందుకు బ్రాస్‌ ఎవరికో ఓ చెక్కుని అందించాడు.   ఆ చెక్కు మీద గుర్తు కోసం తన కుక్క పేరు కూడా రాశాడు. అయితే ఆ పేరుని చూసిన అమెరికా అధికారులు వణికిపోయారు. ఆగమేఘాల మీద ప్రభుత్వ అధికారులకు విషయాన్ని తెలియచేశారు. ఇంతకీ ఆ కుక్క పేరు ‘DASH.’ ఇది ISIS ఉగ్రవాద సంస్థకు మారు పేరైన ‘DAESH’కు దగ్గరగా ఉందన్నదే అధికారుల ఆందోళనకు కారణమట. నా కుక్కకీ ఉగ్రవాదులకీ ఎలాంటి సంబంధమూ లేదు మొర్రో అని బ్రూస్‌ మొత్తుకున్నాక కానీ ఉన్నతాధికారులు ఊరుకోలేదు.

మహిళల అబార్షన్లపై నోరు జారిన ట్రంప్..

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఈసారి మహిళలపై విరుచుపడ్డాడు. మహిళల గర్భస్రావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్కాన్సిన్లోని ఓ చర్చా మందిరంలో క్రిస్ మాథ్యూతో చర్చ సందర్భంగా అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా అని ఆయనను ప్రశ్నించగా.. దానికి ఆయన ఈ మధ్య కాలంలో అబార్షన్లు చేయించుకునే మహిళల ఎక్కువయ్యారు.. వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష మాత్రం పడాలని అన్నారు. ఇక ట్రంప్ అలా వ్యాఖ్యానించారో లేదో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా చెత్తగా.. భయంకరంగా ఉన్నాయని మండిపడ్డారు. మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా ఎంతమంది మహిళల నుండి విమర్శలు వస్తాయో చూడాలి.

మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్.. నిప్పంటించినందకు

  ఓ బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. ప్రధాన ప్రతిపక్ష నేత బేగం ఖలేదా జియాకు ఆ దేశ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల ప్రకారం.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఏడాది జనవరిలో బంగ్లా నేషనల్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బస్సుకు నిప్పంటించగా.. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. ఈ వ్యవహారంలో బేగం ఖలేదా జియాకు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా ఆమెకు బెయిల్ వచ్చేఅవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.